భవిష్యత్ బాగుండాలని కోరుకునేవారు తమ కోసం తాము కష్టపడితే సరిపోదు. ఇతరుల కోసమూ పాటుపడాల్సిందే. మన భవిష్యత్ బాగుండాలంటే మన దేశమూ బాగుండాలి . మనందరి రేపటి కోసం బడుల్లో విద్యాబోధన మెరుగుపడాలని ఆకాంక్షిస్తున్నారు ఆర్టిస్ట్ రమాదేవి. ఆ ప్రయత్నంలో భాగంగా సర్కారు బడులకు వన్నెలద్దుతున్నారు. రంగుల కళకు, ఆమె కలకు సంబంధం ఏమిటంటారా? సమాధానం రమాదేవి మాటల్లోనే..
నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దర్నీ చాలా బాధ్యతగా పెంచాను. మా అమ్మాయి వీణ వాయిస్తుంది. తైక్వాండో ఆడుతుంది. బాగా చదువుకుంది. అబ్దుల్ కలాం తనకు తరచూ ఉత్తరాలు రాసేవారు. మా అబ్బాయి చదరంగంలో జాతీయ స్థాయి క్రీడాకారుడు. నా సహకారం, కుటుంబ ప్రోత్సాహం ఉండబట్టే వాళ్లు రాణించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆ మద్దతు ఎవరినుంచి దొరుకుతుంది? ఆ ఆవరణలో ప్రతిభకు కొదువ లేదు. కానీ ప్రోత్సాహమే శూన్యం. దీంతో మట్టిలో మాణిక్యాలుగానే మిగిలిపోతున్నారు. నా పిల్లల్లానే వాళ్లూ చదవాలి. బాగా ఎదగాలని కోరుకుంటున్నా. వాళ్లను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దేంత శక్తి నాకు లేకున్నా.. సమాజంపట్ల అవగాహనతో మంచి పౌరులుగా ఎదిగేందుకు నా వంతు సాయం చేయాలని ఆశిస్తున్నా.
చదువు మనిషిని పరిపూర్ణమైన వ్యక్తిని చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల్లో తొంభైశాతం మంది ప్రాథమిక విద్యను కూడా పూర్తి చేయలేకపోతున్నారు. ప్రతిభ కొరవడి కాదు, సరైన విద్యా వసతులు లేకపోవడం వల్లనే ఇలా వెనుకబడుతున్నారు. ఉస్మానియా క్యాంపస్లో తెలంగాణ (ఆంధ్ర) మహిళా సభ బాలికల పాఠశాల నడుపుతున్నది. దాదాపుగా అందరూ నిరుపేదల పిల్లలే. నేను బాగ్ అంబర్పేటలో ఉంటాను. మా ఇంటికి దగ్గర్లో చెవిటి, మూగ విద్యార్థుల పాఠశాల ఉంది. ఇతరులతో పోలిస్తే బాగా చదువుకోవాల్సిన అవసరం వీళ్లకే ఎక్కువ. నావంతుగా ఆ పిల్లల కోసం ఏదైనా చేద్దామని బలంగా అనిపించేది. వాళ్లకు అవసరమైనప్పుడో.. నాకు తోచినప్పుడో సహాయం చేసేదాన్ని. ఆర్టిస్ట్గా నా సంపాదనలో కొంతభాగం పేద పిల్లల చదువుల కోసం ఖర్చు చేసేదాన్ని. నేను ఎలాంటి స్వచ్ఛంద సంస్థనూ నడపట్లేదు. నా దగ్గర వనరులూ పరిమితమే. చేయాల్సిన సాయం నా శక్తికి మించితే నలుగురి సాయం కోరతాను. మా బంధువులు, స్నేహితులు తప్పక స్పందిస్తారు. అప్పటికి డబ్బు అవసరం తీరిపోతుంది. ఇలా ఇరవై ఏళ్ల నుంచీ ప్రభుత్వ పాఠశాలల కోసం పని చేస్తున్నా.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలు సమయానికి పుస్తకాలు కొనుక్కోలేరు. పెన్నులకు డబ్బులుండవు. సరైన దుస్తులు ఉండవు. ఆడపిల్లలకు రుతుస్రావ పరిశుభ్రత పట్ల సరైన అవగాహన ఉండదు. ప్యాడ్స్ కొనేంత స్తోమత కూడా ఉండదు. ఇలాంటి వారికి చిన్న సహాయం అందించినా.. వాళ్ల జీవితంలో పెద్ద మార్పునకు కారణం అవుతుందని నా నమ్మకం. నేనూ ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న దాన్నే. కాబట్టి ఆ పిల్లల పట్ల నాకు సానుభూతి ఉంటుంది. ఈ మధ్య బాగ్లింగంపల్లి, శ్రీరాంనగర్ బస్తీకి వెళ్లాను. అక్కడి ప్రభుత్వ పాఠశాల దుస్థితి చూసి కదిలిపోయాను. గోడలు శిథిలమై ఉన్నాయి. పెచ్చులూడిన పై కప్పు కనిపించింది. వానకు తడిసి బ్లాక్ బోర్డ్ ఉబ్బిపోయి ఉంది. ఈ పాఠశాల కోసం పని చేద్దామని అర్బన్ స్కెచర్స్-హైదరాబాద్ గ్రూప్ సభ్యుల సాయం అడిగాను.
సంతోషంగా ముందుకొచ్చారు. మొదట కొంత డబ్బు పోగేసి మరమ్మతులు చేయించాం. తలుపులు, కిటికీలకు రంగులు వేయించాం. అర్బన్ స్కెచర్స్ ఆర్టిస్ట్లు తరగతి గదులు, పాఠశాల ప్రాంగణంలో తెలుగు, ఇంగ్లిష్, గణితం, సైన్స్కు సంబంధించిన బొమ్మలు వేశారు. వర్ణమాల, గుణింతాలు, అంకెలు, ఎక్కాలు, జంతువులు, మొక్కలు, భౌగోళిక పటాలు, సౌర కుటుంబం, వారాలు, నెలలు.. ఇతివృత్తాలుగా చిన్నారులకు నచ్చే ముచ్చటైన బొమ్మలు గీశారు. పిల్లల విద్యా సామర్థ్యాలు పెంచేలా బడిని ముస్తాబు చేశాం. ఎన్బీటీ కాలనీ, మణికొండ ప్రభుత్వ పాఠశాలల్ని కూడా ఇలాగే సుందరీకరించాం. వీటికి ‘కనెక్ట్ ఫర్’ అనే ఎన్జీవో సహకరించింది. బడి మారితే విద్యార్థులు మారతారు. విద్యార్థుల వల్ల సమాజమూ, దేశమూ మారుతాయి. కళలకు ఇంతకుమించిన పరమార్థం ఏం ఉంటుంది?
నా వృత్తి కోసం ఎన్నో గంటలు వెచ్చిస్తాను. నా పిల్లలకు కేటాయించినట్లుగానే సమాజం కోసమూ సమయం కేటాయిస్తాను. నాకు పనుల్ని బ్యాలెన్స్ చేసుకోవడం తెలుసు. పిల్లలకు మూడు పూటలా వండి పెడతాను. అన్ని విషయాల్లో శ్రద్ధగా చూసుకుంటాను. ప్రస్తుతం వీధి కుక్కల కోసం కూడా పని చేస్తున్నాను. వాటికి టీకాలు వేయిస్తాను. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యం చేయిస్తాను. దత్తత తీసుకునేవాళ్లను ప్రోత్సహిస్తాను. మనం తలచుకుంటే ఎంత కష్టమైన పనైనా తేలికైపోతుంది. ముందు మనసును సిద్ధం చేసుకోవాలి.
-నాగవర్ధన్ రాయల
-రాజేశ్