ఒకటా రెండా.. రెండు వేలకు పైగా ఆయిల్ పెయింటింగ్స్. వందేండ్లు దాటినా చెక్కుచెదరని సౌందర్యం. రాజా రవివర్మ కుంచెనుంచి జాలువారిన ఎన్నో అపురూప చిత్రాలు సంపన్నుల ఇండ్లకే పరిమితం అయ్యాయి. మరికొన్ని మ్యూజియంలలో భద్రంగా ఉన్నాయి. పట్టించుకునే దిక్కులేక కనుమరుగైనవీ అనేకం. నాడు కొందరికే పరిమితమైన రాజా రవివర్మ వర్ణ చిత్రాలను ఇక నుంచి ఫొటోలు, వీడియోలు, క్యాలెండర్లు, డాక్యుమెంటరీల రూపంలో ప్రపంచానికంతా అందుబాటులోకి తెస్తున్నారు ఆయన మునిమనుమరాలు, ట్రావెన్కోర్ మాజీ యువరాణి రుక్మిణీబాయి. బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేసిన ‘రాజా రవివర్మ హెరిటేజ్ ఫౌండేషన్’ ద్వారా తన ముత్తాత చిత్రాలను సేకరిస్తున్నారామె. రంగు వెలిసిపోయిన పెయింటింగ్స్కు నిష్ణాతులైన చిత్రకారులతో రంగులద్దించి కొత్త జీవం పోస్తున్నారు. గత ఏప్రిల్లో యూట్యూబ్లో విడుదలైన ‘రాజా రవివర్మ : రిస్టోరింగ్ ఎ మాస్టర్స్ గ్లోరీ’ అనే డాక్యుమెంటరీలో తాము చేస్తున్న పనుల గురించీ, తన ముత్తాత గొప్పతనం గురించీ ఎన్నో విషయాలను పంచుకున్నారు రుక్మిణి. ఆ ప్రయత్నాన్ని అంతా స్వాగతిస్తున్నారు.