గర్భం దాల్చిన నెల రోజుల నుంచే స్త్రీ శరీరంలో అనేక మార్పులు మొదలవుతాయి. కాన్పు జరిగాక మానసిక సమస్యలూ చుట్టుముడతాయి. కొత్త అమ్మలు ఎదుర్కొనే అలాంటి సమస్యలనే ‘పోస్ట్ పార్టమ్ బ్లూస్’ అంటారు. కాన్పు జరిగిన రెండు, మూడు రోజుల తర్వాత మొదలై మూడువారాల్లో తగ్గిపోయే తాత్కాలిక ఇబ్బంది ఇది. అలా అని తేలిగ్గా తీసుకోలేం. మానసిక ఒత్తిడి ఎక్కువై 10- 20 శాతం తల్లులు డిప్రెషన్లోకి వెళ్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పోస్ట్పార్టమ్ బ్లూస్ ఉన్న వాళ్లకు నిద్ర, ఆకలి అలవాట్లలో మార్పులు వస్తాయి. శారీరకంగా, మానసికంగా అలసిపోతారు. ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన లక్షణాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో కుటుంబసభ్యులు, జీవిత భాగస్వామి సహకారం చాలా అవసరం.
లక్షణాలు ఇవీ..
విపరీతమైన చిరాకు, తల్లిగా విఫలం అవుతున్నానేమో అన్న భయం, నిరాశ, నిస్పృహ, అకారణంగా ఏడుపు, కుంగుబాటు, దేనిపైనా శ్రద్ధ పెట్టకపోవడం, విపరీతమైన ఆందోళన, బిడ్డతో బాంధవ్యాన్ని ఏర్పరచుకోవడంలో ఇబ్బంది, బంధువులు, స్నేహితులతో సంబంధాలు తెంచుకోవడం, నిద్రలేమి, ఆకలి లేకపోవడం, కొన్నిసార్లు విపరీతమైన ఆకలి. కొత్తగా తండ్రి అయిన పురుషులకూ ఈ తరహా మానసిక ఒత్తిడి ఉంటుందని తాజా అధ్యయనాలు నిర్ధారిస్తున్నాయి. దాదాపు 10 శాతం తండ్రులు ‘పోస్ట్పార్టమ్ బ్లూస్’ను ఎదుర్కొంటున్నారు. ఈ దశలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ ఒక్కరిలో ఈ లక్షణాలు కనిపించినా థెరపిస్ట్ను సంప్రదించడం మంచిది.