రెండేండ్ల క్రితం విరుచుకుపడిన కరోనా మహమ్మారి ఇటీవల తగ్గుముఖం పట్టినా, ఆ ప్రభావం మాత్రం నీడలా వెంటాడుతూనే ఉంది. రెండో దశలో వైరస్ బారిన పడినవారు ఆ తర్వాత బ్లాక్ఫంగస్కు గురైన విషయం తెలిసిందే. మూడు దశల్లోనూ వైరస్ తగ్గాక కూడా ఇబ్బందులపాలైన వారు ఎంతోమంది.
ఇప్పటికీ కొందరు వివిధ సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. గుండె, కిడ్నీ, ఉదర, శ్వాస సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు.
‘దీర్ఘకాలిక’ ముప్పు
గతంలో కొవిడ్కు గురైన వారిలో.. బీపీ, షుగర్, క్యాన్సర్, థైరాయిడ్, కిడ్నీ, కాలేయ, గుండె సంబంధ వ్యాధులు ఉన్నవారికి ప్రాణాపాయం ఎక్కువేనని అంటున్నారు వైద్య నిపుణులు. కరోనా వైరస్ శరీరంలోని వివిధ అవయవాలపై చెడు ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో వైరస్ తీవ్రత తగ్గిన తరువాత ఆయా అవయవాలకు సంబంధించిన సమస్యలు నెమ్మదిగా బయటపడతాయి. కరోనా రోగులలో రక్తనాళాలు, ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ, కాలేయం, ఉదరం.. తదితర భాగాలు తీవ్రంగా దెబ్బతింటాయి.. అందులోనూ గుండెపై వైరస్ దెబ్బ బలంగానే ఉంటుంది. గతంలో గుండె సమస్యలున్నవారు, గుండె సమస్యల కుటుంబ నేపథ్యం ఉన్నవారిపై వైరస్ ప్రభావం సాధారణ రోగులకంటే కొంత ఎక్కువేనని మెడికొవర్ వైద్యనిపుణులు డాక్టర్ శరత్రెడ్డి వివరించారు. ఏ చిన్న లక్షణాన్నీ విస్మరించలేమని తేల్చి చెబుతున్నారు.
‘పోస్ట్ట్ కరోనా’ వ్యాధులు
అప్రమత్తత తప్పదు
‘పోస్ట్ కొవిడ్లో అందరికీ సమస్యలు తలెత్తకపోవచ్చు. కానీ ప్రధానంగా గుండె రోగాలు ఉన్నవారు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, హైబీపీ, డయాబెటిస్ తదితర రుగ్మతలు ఉన్న వారికి మాత్రం కొంత రిస్క్ తప్పదు. కాబట్టి, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కొవిడ్కు గురికాకపోయినా సరే, వీరికి పరీక్షలు తప్పనిసరి. నిత్యం వాకింగ్ వంటి సాధారణ వ్యాయామాలు చేయాలి. పౌష్టికాహారం, తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా వైద్యులను సంప్రదించాలి’ అని సూచిస్తున్నారు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు.