Piplantri | పుట్టిన ఆడపిల్లను, ఎదిగే మొక్కను వారు ఒకే రకంగా సంరక్షిస్తారు. ఊరంతా ఆ బాధ్యతను సమంగా పంచుకుంటారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి గర్భంలోనే విచ్ఛిన్నం చేస్తున్న మనుషులున్న ఈ రోజుల్లో ఇలాంటి సంప్రదాయం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎడారి రాష్ట్రంగా పిలిచే రాజస్థాన్ లోని రాజ్ సమంద్ జిల్లాలో పిప్లాంత్రి అనేది ఓ కుగ్రామం. ఇక్కడ ఆడపిల్ల పుట్టగానే ఆమె పేరు మీద 111 మొక్కలు నాటతారు. ఆడపిల్ల భారం అన్న భావన తల్లిదండ్రులకు కలగకుండా సభ్యులందరి నుంచి రూ.21వేల వంతున వసూలు చేస్తారు.
ఆ మొత్తాన్ని ఆడపిల్ల చదువు, ఇతర బాధ్యతల కోసం వెచ్చిస్తారు. ఇదంతా 17 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. గ్రామపెద్ద శ్యామ్సుందర్ పాలివాల్ కుమార్తె కిరణ్ డీ హైడ్రేషన్ వల్ల చనిపోయింది. అప్పటికే ఆ ఊరిని కరవు వెంటాడుతున్నది. మైనింగ్ కార్యక్రమాలు జోరుగా సాగుతుండటం వల్ల అడవులు నాశనమయ్యాయి. దాంతో శ్యామ్సుందర్ ఈ కొత్త ఆలోచనకు పాదుచేశారు. ఇప్పుడు ఆ గ్రామంలో నిమ్మ, మామిడి, మర్రి, రావి, ఉసిరి వంటి రకాలతో నాలుగు లక్షల మొక్కలు వెలిశాయి. దాంతోపాటు నీటి సంరక్షణ చర్యలూ జోరందుకున్నాయి. చెట్లు పిప్లాంత్రి గ్రామ ప్రజలను సంరక్షిస్తున్నాయి. ఆడపిల్లలు సగర్వంగా తలెత్తుకు నిలబడుతున్నారు. ప్రపంచమంతా శ్యామ్సుందర్ విశిష్ట కృషిని ‘ఎకో ఫెమినిజం’గా ప్రశంసిస్తున్నది. ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది. “ఆడపిల్ల, నీరు, చెట్టు, నేలకు ఔన్నత్యం కల్పించడం నేను చేసిన తపస్సు” అంటారు శ్యామ్ సంతృప్తితో.