ఓరల్ రీ హైడ్రేషన్ సొల్యూషన్.. ఓఆర్ఎస్ ప్రాధాన్యాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో భాగంగా.. జూలై 29ని ‘ఓఆర్ఎస్ డే’గా జరుపుకొంటారు. ఏటా జూలై 25 నుంచి 31 వరకు .. ఓఆర్ఎస్ వారోత్సవాలూ నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ‘జోడీ నంబర్ వన్- ఓఆర్ఎస్, జింక్’ నినాదాన్ని ఎంచుకున్నారు. గ్రామ గ్రామానా.. అతిసార నియంత్రణలో జింక్ పాత్ర పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ఒక లీటరు ద్రావణానికి సరిపోయేంత పొడితో ప్యాకెట్లు రూపొందిస్తున్నారు. పిల్లల కోసం ప్రత్యేకించి.. 200 మి.లీ. నీటిలో కలపడానికి చిన్న ప్యాకెట్లు లభిస్తున్నాయి. కాకపోతే, ఈ పొడిని కలపడానికి పరిశుభ్రమైన పాత్రలే ఉపయోగించాలి. వాటికి మూతలు ఉండాలి. ఒకసారి తయారుచేసిన ద్రవాన్ని 24 గంటల వరకు మాత్రమే తాగించాలి, మిగిలినదాన్ని పడేయాలి. పెద్ద పిల్లలకు లోటాలో కానీ, కప్పులో కానీ కోరినంత ఇవ్వవచ్చు. చిన్నపిల్లలకు 2-3 నిమిషాలకు ఒకసారి చెంచా చొప్పున ఇవ్వాలి.
తయారీ విధానం
ఓఆర్ఎస్ తయారీకి నీటిని తప్పనిసరిగా మరిగించాల్సిన పన్లేదు. కలిపేముందు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. పొడిని కొద్ది కొద్దిగా కాకుండా మొత్తం ప్యాకెట్ను సూచించిన నీటిలో ఒకేసారి కలపాలి. దీనివల్ల ఒకసారి చిక్కగా, ఒకసారి పలుచగా కాకుండా.. సరైన సాంద్రతతో ద్రవం తయారవుతుంది. విరేచనం ద్వారా శరీరం కోల్పోయే ప్రధాన పదార్థాలను తిరిగి సమకూర్చడమే ఓఆర్ఎస్ లక్ష్యం. ఇది గ్లూకోజ్, లవణ మిశ్రమం. దీనిని కనిపెట్టి 50 సంవత్సరాలైంది. ఇప్పటివరకు ఇతర మందులతో పోలిస్తే, అత్యధిక ప్రాణాలను రక్షించింది ఓఆర్ఎస్. ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది పిల్లలకు మృత్యువు నుంచి రక్షణ కల్పిస్తున్నది. అతిసార వ్యాధి ఉన్న దాదాపు 90 శాతం పిల్లలకు ఓఆర్ఎస్ సరిపోతుంది. మిగతా 10 శాతం పిల్లలకు దీనితోపాటు వైద్యం తప్పనిసరి. చిన్నపిల్లలకు తరచూ వచ్చే వ్యాధుల్లో అతిసార ప్రధానమైంది. దీనినే ‘విరేచనాలు’, ‘బేదులు’ అనే పేర్లతో వివిధ ప్రాంతాల్లో వ్యవహరిస్తుంటారు. పిల్లలు మొదటి 5 సంవత్సరాల్లో 10-15 సార్లు, ఒక్క తొలి ఏడాదే 3-5 సార్లు ఈ వ్యాధికి లోనవుతారు. సంవత్సర కాలంలో 30 రోజులకాలం అతిసార వ్యాధితో బాధపడతారు. ఈ వ్యాధివల్ల మనదేశంలో ఏటా 3 లక్షల మంది చిన్నారులు మరణిస్తున్నారు.
– డాక్టర్ కర్రా రమేశ్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు