ధనుర్మాసం వచ్చింది మొదలు ప్రతి ఇంటి ముందూ ముచ్చటగా ముగ్గులు ప్రత్యక్షమవుతాయి. ముగ్గు పిండితో చుక్కల ముగ్గులూ, మెలికల ముగ్గులూ వేయడం ఒక ఎత్తయితే.. రంగులతో రంగోలీ ఆవిష్కరించడం మరో ఎత్తు. వెనకటితరంలో చిన్నప్పటి నుంచీ అమ్మల వెనకో అమ్మమ్మల పక్కనో కూర్చుని చూసే అలవాటు వల్ల అందరికీ ఆశువుగా ముగ్గులు వచ్చేసేవి. కానీ కాన్వెంట్ల నుంచి కాలేజీ దాకా.. నిద్ర లేచింది మొదలుపరిగెత్తడమే పరమావధి అయిన నేటి రోజుల్లో అవసరం అనగానే అలా ముగ్గులు వచ్చేయాలంటే కుదరదు.
అందుకే ఇప్పుడు వివిధ యూట్యూబ్ ఛానెళ్లు ఆన్లైన్ లైవ్ రంగోలీ తరగతులు నిర్వహిస్తున్నాయి. వారం, పది రోజుల నిడివి ఉండే ఈ క్లాసుల్లో పాతిక దాకా ముగ్గులు నేర్పిస్తారు. రంగుల్ని అందంగా ఎలా నింపాలో, వర్ణాల మేళవింపును ఎలా ఎంచుకోవాలో కూడా చెబుతారు. ముగ్గులు వేయడంలో సులువుల్ని బోధిస్తారు. మొత్తానికి ఆకట్టుకునే ముగ్గుల్ని వాకిట్లో ఆవాహనం చేసేందుకు అవసరమైన శిక్షణ మనకు ఇస్తారు.
“ముగ్గు మనలోని సృజనాత్మకతను మేలుకొలుపుతుంది. అందులో రంగులు నింపడం మానసికోల్లాసాన్ని కలిగిస్తుంది. ముంగిట్లో ముగ్గుల్ని అలంకరించడాన్ని ఒక థెరపీగా కూడా చెప్పొచ్చు. పిల్లలు మొదలు పెద్దల దాకా ఈ కళాత్మక వ్యాపకాన్ని చాలా ఇష్టపడతారు. అందులోనూ సంక్రాంతి మరింత ప్రత్యేకం కాబట్టి ఈ సందర్భంగా, మేం కాస్త పెద్ద పిల్లలతో పాటు పెద్దవాళ్లకీ ఈ ముగ్గుల తరగతుల్ని నిర్వహిస్తున్నాం. అది కూడా కేవలం అయిదు వందల రూపాయలకే కాబట్టి, చాలా మంది మాతో కలిసి ముగ్గులు వేయడానికి ఇష్టపడుతున్నారు” అంటారు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్న జీత్ రంగోలీ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులు. ఇలాంటి వేదికలే మరికొన్నీ ఉన్నాయి.