దిడ్డి రూపకళది నిరుపేద కుటుంబం. తండ్రి హోటల్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తన కూతురిని ఉన్నత స్థానంలో చూడాలని ఆశపడ్డాడు. తండ్రి కలను సాకారం చేస్తూ ఆమె ఇస్రోలో నర్స్గా ఎంపికైంది. కరోనా సంక్షోభ సమయంలోనూ ప్రేమగా సేవలు చేసింది. ఆ అంకిత భావానికి గుర్తింపుగా ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును అందుకొన్నది రూపకళ.
‘నర్సులంటే సూది మందు ఇచ్చేవాళ్లనే అనుకుంటారు చాలామంది. నిజానికి, రోగికి పరిపూర్ణ స్వస్థతను ప్రసాదించడంలో ముఖ్యపాత్ర నర్సమ్మదే. తమ ఉద్యోగంతో సరిపెట్టుకోకుండా, ఉన్నత చదువులు చదివితే వైద్యులను మించిపోతారు నర్సులు. బాల్యంలో నాకు సైంటిస్టు కావాలనే కోరిక ఉండేది. ఆ లక్ష్యాన్ని సాధించి తీరుతానన్న నమ్మకమూ ఉండేది. కానీ, మాది చాలా నిరుపేద కుటుంబం. బాబాయి సహకారంతో ఈ స్థాయికి వచ్చాను. భర్త, అత్తమామల ప్రోత్సాహంతో ఉద్యోగంలో రాణిస్తున్నా’ అంటూ తన నేపథ్యాన్ని వివరిస్తుంది నైటింగేల్ అవార్డు గ్రహీత దిడ్డి రూపకళ. పేదరికాన్ని తట్టుకుని, ఇంటర్ వరకూ సొంతూరు కొత్తగూడెంలోనే చదివింది రూప. ఆ తర్వాత, హైదరాబాద్ గాంధీ నర్సింగ్ స్కూల్ నుంచి బీఎస్సీ-నర్సింగ్ పాసైంది. అక్కడా టాపర్గా నిలిచింది. కొంతకాలం ‘104’లో ఉద్యోగం చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో కొలువు సాధించడం తన జీవితంలో గొప్ప మలుపని చెబుతుందామె.
కరోనా సమయంలో
కరోనా సంక్షోభంలో నర్సింగ్ సేవలు అందించడమంటే, చావుకు సవాలు విసరడమే! బాధితుల వైపు తొంగి చూడటానికి కూడా ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. మరోవైపు కొవిడ్ రోగుల తాకిడి పెరిగిపోయేది. ఇలాంటి పరిస్థితుల్లోనూ రూప అంకితభావంతో పనిచేసింది. బాధితుల్లో ధైర్యం నూరిపోసింది. ఆ సేవలకు గుర్తింపుగా ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు వరించింది. దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన ముగ్గురికి మాత్రమే ఈ గౌరవం దక్కింది. అందులో రూపకళ ఒకరు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి విజేతల పేర్లను ప్రకటించారు. ఇటీవలే, విజయవాడలోని డీఎంసీలో డిప్యూటీ డైరెక్టర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నది రూపకళ. తెలంగాణ ఆడబిడ్డకు ఈ అరుదైన గుర్తింపు దక్కడం పట్ల కొత్తగూడెం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
… కాగితపు వెంకటేశ్వర్రావు