శుభవార్త చెప్పాలంటే నోరు తీపి చేయాల్సిందే. వేడుక చేసుకోవాలంటే స్వీట్లు పంచుకోవాల్సిందే. దాదూస్ స్వీట్లు లేకుంటే హైదరాబాదీలకు ఈ రెండూ లేనట్టే. రెండు దశాబ్దాలుగా నగరవాసులకు నాణ్యమైన రుచుల్ని పంచుతున్నాడు రాజేశ్ దాదూస్. చాలాకాలం రెండు స్టోర్లతో నడిచిన ఈ రుచుల ప్రయాణం కొత్తతరం రాకతో సరికొత్త మలుపు తిరిగింది. హైదరాబాదీలకు ఆర్డర్ చేసిన గంటలో స్వీట్స్ ఇంటికి చేర్చే ఈ సంస్థ పాన్ ఇండియా ఆర్డర్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా డెలివరీ ఇచ్చేంతగా ఎదిగిపోయింది. స్వీట్లతో పాటు సంప్రదాయ శాకాహార వంటకాలనూ ఈ తరానికి పరిచయం చేసే ‘మసాలా రిపబ్లిక్’ని తీసుకొచ్చింది. దాదూస్ మొదటి అడుగు రాజేశ్ది అయితే, తర్వాతి విజయ ప్రస్థానం ఆయన కుమార్తె ముస్కాన్ది.
రాజేశ్ దాదు 1993లో హిమాయత్నగర్లో మిఠాయి వాటికను ప్రారంభించాడు. కొన్నాళ్లకు రెండో స్టోర్ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆయన కూతురు ముస్కాన్ దాదు ఆయన స్థానంలో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. స్విట్జర్లాండ్లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన ఆమె దాదూస్ని మూడు వెరైటీలు.. ఆరు ఫ్రాంచైజీలన్నట్లుగా విస్తరిస్తున్నది. పురుషాధిక్య విపణిలో నిలదొక్కుకునేందుకు సంప్రదాయ వ్యాపారానికి సరికొత్త రుచులనూ జోడిస్తున్నది. ముస్కాన్ పుట్టే నాటికే స్వీట్ షాప్ ఉంది. ఆమె బాల్యమంతా ఆ మిఠాయి వాటిక చుట్టే తిరిగింది. ‘స్కూల్ నుంచి హిమాయత్నగర్ బస్స్టాప్లో దిగగానే మా స్వీట్ షాప్కి వెళ్లేదాన్ని. మీఠా అంటే మహా ఇష్టం. నా డైట్లోనూ అది భాగమైపోయింది. విదేశాలకు వెళ్లిన తర్వాత కూడా ఈ అలవాటు మానుకోలేకపోయాను. ఏదైనా శుభవార్త వింటే స్నేహితులతో కలిసి ఇంటినుంచి తీసుకుపోయిన స్వీట్స్తో అక్కడ సెలబ్రేట్ చేసుకునేదాన్ని’ అని చెప్పుకొచ్చింది ముస్కాన్.
నాన్నకు ప్రేమతో..
‘కాలేజీ చదువులు పూర్తయ్యాక వ్యాపారంలోకి రావాలనుకుంటున్నానని మనసులో మాట నాన్నతో చెప్పాను. స్విట్జర్లాండ్లో చదువుకుంటున్నప్పుడు జూమ్ మీటింగ్లో ఇక్కడి పనులు చూస్తూ ఉండేదాన్ని. సెలవుల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ‘మసాలా రిపబ్లిక్’ బ్రాండ్ పేరుతో రెండు ఔట్లెట్లను మొదలుపెట్టాం. నేను ఇండియాకు వచ్చాక నాన్నకు పని ఒత్తిడి తగ్గింది. అంతేకాదు ప్రతిదాంట్లో ‘ద బెస్ట్’ అనిపించుకునేలా కష్టపడుతున్నాం. హిమాయత్నగర్లో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు కోకాపేట, కొంపల్లి, ఎల్బి నగర్కు విస్తరించింది. ఇప్పుడు వివిధ దేశాలకు ఆర్డర్లు సరఫరా చేస్తున్నాం’ అంటున్నది ముస్కాన్.