‘తూఁ మేరీ జిందగీ హై.. తూఁ మేరీ హర్ ఖుషీ హై..’ పాట ఆయన జీవితానికి అక్షరాలా సరిపోతుంది. ఆయన జీవితం, సంతోషం ఎవరో కాదు.. పాటే! పాతికేండ్లుగా కరావోకే సంగీత ఝరిలో శ్రోతలను అలరిస్తున్నారు.. హన్మకొండకు చెందిన గౌస్ హైదర్. కరావోకే పాటలతో ఎన్నో రికార్డులు సృష్టిస్తున్న ఆయన మరో మైలురాయినీ అందుకున్నారు. అత్యధిక హిందీ పాటలు ఆలపించిన కరావోకే సింగర్గా ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. జిల్లా వ్యవసాయాధికారిగా, రన్నర్గా, సైక్లిస్ట్గా, కరావోకే కింగ్గా విభిన్న రంగాల్లో తన ప్రతిభను చాటుకుంటున్నారు హైదర్ సాబ్. జపాన్కు చెందిన సంగీత ప్రక్రియ అయిన కరావోకేను తొలినాళ్లలోనే అందిపుచ్చుకొన్నారు ఈ అగ్రీ ఆఫీసర్. సొంతింటిని కరావోకే అకాడమీగా తీర్చిదిద్ది ఆ కళకు ప్రాచుర్యం కూడా కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు సాధించారు. 2018లో 25 రోజులపాటు 25 కరావోకే మ్యూజికల్ నైట్స్ నిర్వహించి ‘ఇండియా బుక్ ఆఫ్
రికార్డ్స్’లో స్థానం సంపాదించారు. తాజాగా కరావోకే విధానంలో అత్యధిక హిందీ చిత్ర గీతాలు ఆలపించిన గాయకుడిగానూ ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్నారు. అంధ బాలలు, మానసిక వికలాంగులతోనూ కరావోకే పాటలు పాడిస్తున్నారు హైదర్. మరోవైపు ‘వలీ హైదర్ మెమోరియల్’ పేరిట పేద కళాకారులకు ఆర్థికసాయం అందిస్తున్నారు.