ప్రచారం
కరోనా టీకాలను వేసుకున్నవారంతా రెండేండ్లలో చనిపోతారని ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ వైరాలజిస్టు, నోబెల్ బహుమతి గ్రహీత లుక్ మాంటగ్నైర్ చెప్పినట్టు ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. సామూహికంగా టీకాలు వేయడం వల్ల వైరస్ తాలూకు కొత్త వేరియెంట్లు పుడుతాయని, ఇది ప్రపంచంలో ఉన్న అంటువ్యాధుల నిపుణులకూ తెలుసునని, సామూహిక వ్యాక్సినేషన్ అతిపెద్ద పొరపాటని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారని ఆ వైరల్ వార్త సారాంశం. ఎయిడ్స్కు కారణమయ్యే హెచ్ఐవీ వైరస్ను తొలుత గుర్తించిన లుక్ మాంటగ్నైర్ అంతటి దిగ్గజ అంటువ్యాధుల నిపుణుడు స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పలువురు దీన్ని నిజమని నమ్ముతున్నారు. ఈ వార్తను కెనడాకు చెందిన ‘లైఫ్సైట్న్యూస్’ అనే వార్తాసంస్థ ప్రచురించింది.
వాస్తవం
కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే రెండేండ్లలో చనిపోతారనేది పూర్తిగా అవాస్తవమని కేంద్రప్రభుత్వ విభాగమైన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తెలిపింది. లుక్ మాంటగ్నైర్ చెప్పినట్లుగా సోషల్మీడియాలో ప్రచారంలో ఉన్న పోస్టు నకిలీదని పేర్కొంది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని షేర్ చేయొద్దని ప్రజలకు సూచించింది. కరోనాను కట్టడి చేయడంలో వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని, యాంటీ బాడీలు వృద్ధి చెంది అవి వైరస్ల నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తాయని స్పష్టం చేసింది. ఇక, కెనడాకు చెందిన ‘లైఫ్సైట్న్యూస్’ గతంలో ఎన్నో అసత్య వార్తలను ప్రచురించి అబాసుపాలైంది. ఆ సైట్లో ప్రచురించే కొవిడ్-19 వార్తలన్నీ అసత్యాలే.