ముదునూరి వరలక్ష్మి.. కొన్నేండ్ల క్రితం వరకూ భర్త శంకర్ వర్మతో కలిసి బొప్పాయి పండ్లు పండించేది. పంటకాలం మూడు నెలలే కావడంతో.. మిగతా రోజుల్లో ఖాళీగా ఉండాల్సి వచ్చేది. దీంతో ఏడాది పొడవునా దిగుబడులు ఇచ్చే పంటలేవైనా సాగు చేయాలని భావించింది. అప్పటికే మక్తల్ ప్రాంతంలో కొందరు రైతులు ‘అంజీర్’ సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. తను కూడా ఆ దిశగా అడుగు వేయాలని సంకల్పించింది. మారుతీ నగర్ ప్రాంతంలోనే 12 ఎకరాలు లీజుకు తీసుకుని నాలుగేండ్ల క్రితం ‘అంజీర్’ సాగుకు శ్రీకారం చుట్టింది. అంజీర్ ఆరోగ్య ఫలం. యాంటీ ఆక్సిడెంట్స్, ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్, మాంగనీస్, సోడియం, పొటాషియం, కాపర్ వంటి పోషకాలు అపారం. కాబట్టే, వైద్య నిపుణులు క్యాన్సర్ రోగులకు సిఫారసు చేస్తారు. రక్తహీనత, బరువు తగ్గడం, గుండె సమస్యలు, మెనోపాజ్ ఇబ్బందుల నివారణలో అంజీర్ పండ్లు సాయపడతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే అంజీర్తో ఓ సమస్య ఉంది.
ఈ పండ్లు ఒక్క రోజులోనే పాడైపోతాయి. చెత్తబుట్ట పాలు చేయాల్సిందే. ఇదంతా చూసి.. వరలక్ష్మి మనసు బాధ పడింది. కష్టపడి పండించిన పంట.. నేలపాలు అవుతుంటే ఏ రైతు మాత్రం సంతోషంగా ఉంటారు. పరిష్కారం ఆలోచించాలని నిర్ణయించుకుంది. కానీ, ఏం చేయాలో తోచేది కాదు. ఎటూ ఇంటినిండా అంజీర్ పండ్లు ఉంటాయి కాబట్టి, ఇద్దరు పిల్లలకూ తినమని ఇచ్చేది. కానీ వాళ్లకు నచ్చేవి కాదు. దీంతో, ఓ రోజు అదే పండుతో మిఠాయి చేసి ఇచ్చింది. బిడ్డలు ఇష్టంగా తిన్నారు. ఆ క్షణంలోనే వరలక్ష్మి బుర్రలో ఓ ఐడియా వెలిగింది. నేల పాలవుతున్న అంజీర్ పండ్లతో ప్రపంచానికి కొత్త రుచులను పరిచయం చేయాలని నిర్ణయించుకుంది. వంటిల్లే ల్యాబొరేటరీగా ప్రయోగాలు ప్రారంభించింది.
‘సహజ’ ఉత్పత్తులు
తొలుత అంజీర్తో జామ్ చేసి బంధువులకు రుచి చూపింది వరలక్ష్మి. అందరినుంచీ సానుకూల స్పందన రావడంతో విభిన్న ఉత్పత్తుల తయారీకి సిద్ధపడింది. ఇందుకు వేదికగా.. ‘వర్మ ఫామ్స్’ను ఏర్పాటు చేసింది. ఎండ
బెట్టిన అంజీర్తో హార్లిక్స్, బోర్నవిటా తరహాలో పాలలో కలుపుకొని తాగేందుకు అనువైన మిశ్రమాన్ని సిద్ధం చేసింది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అలాగే, తేమను తొలగించిన అంజీర్తో డీహైడ్రేటెడ్ చిప్స్, అంజీర్ ఆకులతో ఇన్స్టంట్ టీ పొడి చేసి మార్కెట్లో విడుదల చేసింది. చక్కెర, బెల్లం జోడించి జామ్ కూడా తయారు చేస్తున్నది. వరలక్ష్మి కిచెన్లో రసాయన రంగులు, కృత్రిమ వాసనలు నిషిద్ధం. ఈ ఉత్పత్తులన్నీ కనీసం ఏడాది పాటు నిల్వ ఉంటాయి. కాబట్టే, వరలక్ష్మి అంజీర్ ఉత్పత్తులకు క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. ప్రస్తుతం, ఓ పది మందికి ఉపాధి కల్పిస్తున్నదామె. మరిన్ని ఉత్పత్తులు మార్కెట్లోకి తీసుకురావాలనేది వరలక్ష్మి ఆలోచన.
‘వీ హబ్’ తోడ్పాటు..
“మా ఉత్పత్తులను అప్పటి కలెక్టర్ హరి చందన రుచి చూశారు. నాణ్యత నచ్చడంతో ‘వీ హబ్’కు పరిచయం చేశారు. ప్రాజెక్ట్
రిపోర్ట్ తయారీ, బ్రాండింగ్, మార్కెటింగ్ తదితర అంశాలపై వీ హబ్ నాకు అవగాహన కల్పించింది. ‘ఎలీప్’ సంస్థ సైతం తోడ్పాటు అందించింది. కూకట్పల్లి ప్రాంతంలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఆర్థికంగా సహకరించింది. ప్రస్తుతం క్యూమార్ట్లోనూ మా ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. త్వరలోనే అమెజాన్, బిగ్ బాస్కెట్లో అందుబాటులోకి తెస్తాం” అని చెబుతున్నది వరలక్ష్మి.
…? గంజి ప్రదీప్ కుమార్