అమ్మలంతా చదువుల తల్లులే. తాము చదివినా, చదువుకోకపోయినా.. పిల్లల్ని మాత్రం బాగా చదివించాలని అనుకుంటారు. అన్నప్రాశన నాడు.. ఎదురుగా కరెన్సీ నోట్లు, కత్తులూ కటార్లు, బంగారం.. ఎన్నున్నా బిడ్డ పుస్తకాన్ని పట్టుకోగానే తల్లి ఎంత మురిసి పోతుందో! బిడ్డ అక్షరాభ్యాసం నాడే ‘సరస్వతీ నమస్తుభ్యం..’ శ్లోకం చెప్పుకొని ప్రతిన బూనుతుంది. చూచిరాత రాయించీ రాయించీ.. బిడ్డ చేతిరాతను ముత్యాల మూటలా మార్చేస్తుంది. ఊరంతా వాకబు చేసి మంచి పాఠశాలలో చేర్పిస్తుంది. పుస్తకాలకు అందంగా అట్టలేసి.. నలిగిపోకుండా కాపాడుతుంది. పిల్లలకు పెద్ద పరీక్షలంటే.. తనకూ పరీక్షలే అన్నంత ఒత్తిడికి గురవుతుంది.
ఫలితాలు వచ్చేదాకా, బిడ్డ మంచి మార్కులు సాధించేదాకా.. ఆమె మనసు మనసులో ఉండదు. ఐఐటీ హైదరాబాద్ కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ శర్మ జీవితం మీద కూడా అమ్మ సరోజ శర్మ ప్రభావం అపారం. ‘అమ్మ తీర్చిదిద్దిన శిల్పాన్ని నేను. మా అమ్మకు ఆడపిల్లలు చదువుకుంటే ఆనందం. ఉద్యోగాలు సాధించారని తెలిస్తే.. తనకే ఆ కొలువు వచ్చినంత సంబురపడిపోయేది. కాబట్టే, అమ్మ స్మారకార్థం ఓ అవార్డు ప్రవేశపెడుతున్నా. ఐఐటీ-హెచ్లో పరిశోధనల్లో ముందంజలో ఉన్న యువతులకు నగదు పురస్కారం అందించాలని తీర్మానించాను. జన్మనిచ్చిన రుణం ఎలానూ తీర్చుకోలేం. కనీసం ఆమె కలలైనా నిజం చేయాలి కదా!’ అంటారు చంద్రశేఖర్ ఉద్వేగంగా.