దేశం కోసం యుద్ధంలో పోరాడి ప్రాణాలు అర్పించేవారు మాత్రమే వీరులు కాదు. విధి నిర్వహణలో భాగంగా అసువులుబాసే ప్రతి సైనికుడూ అమరుడే. అలాంటి వ్యక్తే అభిమన్యు. పేరుకు తగ్గట్టు ఆ యువకుడు సాహసికుడు. కోరికోరి వైమానిక దళంలో చేరాడు. డెహ్రాడూన్కి చెందిన అభిమన్యు, హైదరాబాద్ దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో… తను నడుపుతున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. క్షణాల్లో కుప్పకూలిపోయింది.
ఆ ప్రమాదంలో అభి అసువులుబాసాడు. అభిమన్యు మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు అతని తల్లి చిత్రలేఖ. బిడ్డ జ్ఞాపకార్థం ఏదైనా చేయాలనుకున్నారు. విమానం కూలిపోయిన ప్రదేశంలోనే ఓ స్థూపాన్ని నిర్మించారు. అభిమన్యు 33వ పుట్టినరోజు సందర్భంగా దాన్ని ఆవిష్కరించారు. అంతేకాదు. యూనిఫాంలో ఉన్న కొడుకు రూపాన్ని తన చేతిమీద టాటూగా వేయించుకున్నారు. ఆ ప్రమాదంలో అభిమన్యుతో పాటు ఓ వియత్నాం సైనికుడు కూడా చనిపోయాడు. ఆ దేశానికి వెళ్లి అమరుడైన సైనికుడి తల్లిదండ్రులను కలవాలని చిత్రలేఖ ఆలోచన. అమ్మ ప్రేమలోని చిక్కదనానికి సాక్ష్యం ఈ సంఘటన.