రేడియో అంటే ఓ ఎమోషన్.. దాని చుట్టూ ఎన్నో జ్ఞాపకాలు. అల్ట్రామోడల్ టీవీలు హల్చల్ చేస్తున్న కాలంలోనూ రేడియో ప్రేమికులు కోకొల్లలు. మరి రేడియో మరమ్మతుకు వస్తే ఎలా? అలాంటివారి కోసమే హైదరాబాద్లో ఓ రిపేర్ సెంటర్ ఉంది. ఇక్కడికి వచ్చే ఏ రేడియో అయినా పాటపాడుతూ ఇంటికి పోవాల్సిందే. హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఉంటుంది ‘మెహబూబా రేడియో సెంటర్’. పురాతన రేడియోల మరమ్మతు ఇక్కడ ప్రత్యేకం. మన ప్రాంతం నుంచి, దేశం నలుమూలల నుంచే కాదు.. విదేశాల నుంచి వచ్చే రేడియోలకూ చికిత్స చేసి రేడియో డాక్టర్ అనిపించుకుంటున్నాడు మెహబూబా రేడియో సెంటర్ నిర్వాహకుడు మొహినుద్దీన్.
షేక్ మెహబూబ్ 1948లో ఈ రిపేర్ సెంటర్ను ప్రారంభించాడు. తర్వాత ఆయన కొడుకులు ముజీబుద్దీన్, మొహినుద్దీన్ దీని నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. ఏడాది కిందట ముజీబుద్దీన్ కన్నుమూశాడు. ప్రస్తుతం మొహినుద్దీన్ ఒక్కడే ఈ సెంటర్ నడుపుతున్నాడు. ఎలాంటి రేడియోనైనా ఆయన రిపేర్ చేయగలడు. అమృత్సర్, కోల్కతా, ఢిల్లీ, చెన్నై.. ఇలా దేశం నలుమూల నుంచి రేడియోలు రిపేర్ కోసం మొహినుద్దీన్ తలుపు తడతాయి. మన దేశం నుంచి మాత్రమే కాదండోయ్.. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి కూడా పాత రేడియోలు మెహబూబా సెంటర్కు వస్తుంటాయి. రేడియో ధర కన్నా ఎక్కువ చెల్లించి మరీ మరమ్మతు చేయించుకుంటారు. ‘తాతలు, తండ్రుల నాటి రేడియోను మళ్లీ శ్రుతి చేసి, మా జ్ఞాపకాలను పదిలపరిచార’ని మొహినుద్దీన్కు కృతజ్ఞతలు చెబుతారు. ‘ఒక్కో రేడియో రిపేర్ కావడానికి నాలుగు నుంచి ఎనిమిది రోజుల సమయం పడుతుంది. రిపేర్ అయ్యాక ఒకరోజు మొత్తం రేడియోను నడిపిస్తా. ఏదైనా లోపం ఉంటే మళ్లీ చెక్ చేస్తా. ఆ తర్వాతే కస్టమర్కు ఇస్తా’ అంటాడు మొహినుద్దీన్. తన తర్వాత రేడియోలు రిపేర్ చేసేవాళ్లు ఎవరూ లేరని, తన తండ్రి పేరు నిలబెట్టేందుకే లాభనష్టాలతో సంబంధం లేకుండా ఇన్నాళ్లుగా ఈ సెంటర్ను నడుపుతున్నానని చెబుతున్నాడు మొహినుద్దీన్.
– రాజు అతికం