కృత్రిమ మేధ… ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తున్న సరికొత్త సాంకేతికత. ఈ టెక్నాలజీని రేడియాలజీ విభాగంలోనూ ప్రవేశపెట్టింది మధ్యప్రదేశ్కు చెందిన మీనాక్షి సింగ్. ఎక్స్రే, సీటీ స్కాన్ రిపోర్టుల తయారీలో వైద్య సిబ్బందికి సహకరించేలా కృత్రిమ మేధను జోడిస్తున్నది మీనాక్షి బృందం నెలకొల్పిన సినాప్సికా సంస్థ. భారీ పెట్టుబడులతో ఇది దిగ్గజ కంపెనీల సరసన చేరుతున్నది.
వ్యాధిని నయం చేయాలంటే ముందు ఆ వ్యాధి ఏమిటన్నది కనిపెట్టగలగాలి. యాక్సిడెంట్లాంటివి జరిగితే బలమైన గాయం ఎక్కడ తగిలిందో గుర్తించగలగాలి. ఆ ప్రయత్నంలో ఎక్స్రే, ఎంఆర్ఐ, సీటీ స్కాన్ లాంటివి తప్పనిసరి. ఈ పనులన్నీ చేసేందుకు ప్రత్యేక రేడియాలజీ విభాగం అవసరం. కానీ మన దగ్గర రేడియాలజిస్టుల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల రిపోర్టుల్లో తప్పులు దొర్లే ఆస్కారం ఎక్కువ. ఒక అంచనా ప్రకారం.. ఇప్పుడు తీస్తున్న రిపోర్టుల్లో 30 శాతం దాకా లోప పూరితమే. రెండోసారి పరీక్షలు చేయించడం తప్పనిసరి అవుతున్నది. వైద్య కుటుంబం నుంచి డాక్టర్ల కుటుంబంలో పుట్టిన మీనాక్షికి రోగ నిర్ధారణ ప్రక్రియను సులభతరం చేయాలన్న ఆలోచన వచ్చింది.
మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్, ఐఐటీ అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ చేసిన మీనాక్షి రేడియాలజీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ను చొప్పించాలనుకుంది. తనలాంటి అభిప్రాయాలే ఉన్న మరో ఇద్దరితో కలిసి సినాప్సికా సంస్థను నెలకొల్పింది. దీని ద్వారా ఎక్స్రే, ఎంఆర్ఐ, స్కానింగ్ మెషీన్లకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ను అనుసంధానిస్తూ సాఫ్ట్వేర్లను తయారు చేశారు. అస్పష్టమైన స్కాన్లూ, ఎక్స్రేలను కృత్రిమ మేధ ఠక్కున గుర్తిస్తుంది. రిపోర్టుల తయారీలో కచ్చితత్వానికి, వేగానికి సహకరిస్తుంది. పేషెంట్ల డేటాను క్రమపద్ధతిలో భద్రపరుస్తుంది. హైరిస్క్ ఉన్న కేసులను గుర్తించి, వైద్యులు వెంటనే చూడాల్సిన లిస్టులో పెడుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్తో అనుసంధానం అవుతుంది కాబట్టి, డాక్టర్లు ఎక్కడి నుంచైనా రిపోర్టులను చూడొచ్చు. వేరే ల్యాబ్లతో పంచుకోనూవచ్చు. రోగులకు కూడా సులభంగా అర్థమయ్యేలా నివేదికలు సిద్ధం చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. భారత్తోపాటు అమెరికా, ఆఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్లలో సినాప్సికా సేవలను అందిస్తున్నది. ఇప్పటి దాకా పదిలక్షల మెడికల్ రిపోర్టులు తయారు చేయడంలో సాయపడింది. మీనాక్షి కృషి ఫలితంగా రేడియాలజిస్టుల సమయం ఆదా అవుతున్నది. ఇంతకు ముందుకన్నా రెట్టింపు కేసుల్ని చూడగలుగుతున్నారు. ఈ మధ్యే భారీ మొత్తంలో పెట్టుబడులు సమ కూర్చుకున్న ఈ సంస్థ తన సేవల్ని మరింత విస్తరించాలని అనుకుంటున్నది.