మలబారు తీరాన్ని తాకిన తర్వాతే రుతుపవనాలు అంతటా విస్తరిస్తాయి. అందుకు మనదేశ భౌగోళిక నైసర్గిక స్వరూపం కారణం. మిరియాలు, యాలకులు వంటిసుగంధ ద్రవ్యాలు సైతం కేరళ నుంచి దేశదేశాలకూ ఎగుమతి అవుతాయి. పడమటికనుమల్లో విరివిగా ఉత్పత్తి కావడమే కారణం. ఎప్పట్నుంచో మాలీవుడ్ నుంచి కథలుఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్కు మలయసీమ కథల కార్ఖానాగామారింది. అందుకు కారణం తెలుగు తెరపై మలయాళ మంత్రం మహత్తరంగా పనిచేయడమే. తాజాగా మలయాళంలో విజయవంతం అయిన సినిమాల్లో కొన్ని తెలుగునాట విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకొన్ని సెట్స్ మీద సందడి చేస్తున్నాయి. మరికొన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని షూటింగ్కు సిద్ధమవుతున్నాయి.
సినిమాకు కావాల్సింది కథ. మంచి కథ పడితే కథనం పండుతుంది. అయితే, కథల కొరత టాలీవుడ్ను పట్టి పీడిస్తున్నది. దీంతో రీమేక్పై దృష్టి సారిస్తున్నారు దర్శక, నిర్మాతలు. హీరోలు సైతం కొత్త కథతో రిస్క్ ఎందుకనుకొని ఆల్రెడీ హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాల రీమేక్కు మొగ్గుచూపుతున్నారు. దర్శక నిర్మాతల ఆశలకు తగ్గట్టే మలయాళంలో విభిన్న కథాంశాలతో తెరకెక్కుతున్న చిత్రాలు, మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో మలయగిరుల్లో హిట్టయిన బొమ్మపై మన హీరోలు కన్నేస్తున్నారు. అప్కమింగ్ యాక్టర్స్ మొదలు దిగ్గజ హీరోల వరకు రెడీమేడ్ కథను సొంతం చేసుకోవడానికి ఆరాటపడుతున్నారు. రీమేక్ల ట్రెండ్ ఈ మధ్య మొదలైందేమీ కాదు. ఎప్పట్నుంచో ఉన్నదే! బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల నుంచి కూడా మలయాళ సినిమాలు తెలుగులో రీమేక్ అయి, మన హీరోలకు విజయాలు కట్టబెట్టినవే! కాకపోతే ప్రేక్షకులకే అంతగా తెలిసేది కాదు. అయితే, ఓటీటీ పుణ్యమా అని ఇప్పుడు రీమేక్ అవుతున్న చిత్రాలను ముందుగానే చూసే వెసులుబాటూ లభించింది.
‘మెగా’ మూవీ
మలయాళంలో సూపర్హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా ‘లూసిఫర్’. మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రెండేండ్ల కిందటే తెలుగులోనూ విడుదలైంది. మాలీవుడ్లో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఇక్కడ పెద్దగా ఆడలేదు. ఓటీటీలో విడుదలయ్యాక మాత్రం రికార్డు వ్యూయర్షిప్ సంపాదించుకుంది. పొలిటికల్ డ్రామా కావడం, కావాల్సినంత మాస్ ఎలిమెంట్స్ ఉండటంతో ఈ సినిమా రీమేక్కు పచ్చజెండా ఊపారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ‘లూసిఫర్’ తెలుగు రీమేక్లో నటించనున్నారు చిరు. స్టార్ ఇమేజ్, నేటివిటీకి తగ్గట్టుగా కథనంలో మార్పులు చేస్తున్నట్టు టాక్. దీని తర్వాత మెగాస్టార్ చేస్తున్న మరో చిత్రానికి కూడా, మాతృక తమిళ సినిమా ‘వేదళం’ కావడం గమనార్హం.
లా..లా.. భీమ్లా
లాక్డౌన్ కష్టకాలంలో వినోదాన్ని పంచిన ఘనత ఓటీటీదే. ఇంటిపట్టునే ఉండటంతో కాలక్షేపానికి బహుభాషా చిత్రాలు చూసేశారు చాలామంది. అన్నిటికన్నా మలయాళ సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా అలరించాయి. విభిన్నమైన కథలతో తయారైన సినిమాలను భాషకు అతీతంగా ఆదరించారు. ఇంగ్లిష్ సబ్-టైటిల్స్ వేసుకొని మరీ పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేశారు. ఇలా చూసిన చిత్రాల్లో ‘దృశ్యం-2’, ‘అయ్యప్పన్ కోషియమ్’ మెగాహిట్స్ జాబితాలో చేరిపోయాయి. అలా హిట్టాక్ సొంతం చేసుకోవడం ఆలస్యం, వాటి రైట్స్ కొనేశారు టాలీవుడ్ నిర్దేశకులు. ఇద్దరు బలవంతుల మధ్య వైరం నేపథ్యంలో తెరకెక్కిన ‘అయ్యప్పన్ కోషియమ్’ తెలుగులో ‘భీమ్లా నాయక్’గా తెరకెక్కుతున్నది. మల్టీస్టారర్గా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో పవన్
కళ్యాణ్, రానా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది చిత్ర బృందం. ఓటీటీ ద్వారా తెలుగువారిని విపరీతంగా ఆకర్షించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏ స్థాయిలో తీస్తారో చూడాలి. త్రివిక్రమ్ మాటలు అందిస్తుండటంతో ‘భీమ్లా నాయక్’కు మరింత క్రేజ్ వచ్చింది.
అ‘ద్వితీయ దృశ్యం’
దాదాపు ఏడున్నరేండ్ల కిందట మలయాళంలో విడుదలైన ‘దృశ్యం’ ఎవర్గ్రీన్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. దీనిని తమిళంలో కమల్హాసన్, తెలుగులో వెంకటేశ్ రీమేక్ చేసి హిట్ కొట్టారు. గత ఫిబ్రవరిలో ఓటీటీలో విడుదలైన ‘దృశ్యం-2’ చిత్రాన్ని ప్రాంతాలకు అతీతంగా ఆదరించారు. ఇప్పుడు అదే చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్ రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో చిత్రానికి దర్శకత్వం వహించిన జీతు జోసెఫ్ తెలుగులో మొదటిసారి డైరెక్షన్ చేస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
వరుసలో మరిన్ని..
త్వరలో తెలుగు తెరపై విడుదల కానున్న మరికొన్ని చిత్ర కథలు సైతం మాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్నవే కావడం గమనించదగ్గ విషయం. డిఫరెంట్ ప్రేమకథతో మలయాళంలో తెరకెక్కిన ‘కప్పెల’ చిత్రం త్వరలోనే తెలుగులో రానుంది. సెల్ఫోన్ సంభాషణలతో ప్రేమలోపడ్డ ఓ యువతికి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నది ఈ చిత్ర కథాంశం. రెండేండ్ల కిందట కేరళలో విడుదలైన ‘హెలెన్’ తాజాగా తెలుగులో తెరకెక్కుతున్నది. నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని తెలుగు తెరపై ఎలా చూపించనున్నారో తెలుసుకోవాలంటే ఇంకొన్నాళ్లు ఎదురుచూడాల్సిందే. మలయాళంలో బాక్సాఫీస్ సంచలనం ‘నాయట్టు’ ఓటీటీలోనూ హిట్టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా రీమేక్ హక్కులు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కేరళలో విజయ దుందుభి మోగించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’,
‘జోసెఫ్’ సినిమాలు సైతం తెలుగులో పలుకరించనున్నాయి.