మండే ఎండల్లో చర్మానికి అధిక తేమ అవసరం. అయితే, ఎంతమంచి మాయిశ్చరైజర్ అప్లయి చేసినా.. ఈ ఎండలకు ఇట్టే ఆవిరైపోతాయి. ఇలాంటి సమయంలో స్వచ్ఛమైన రోజ్ వాటర్ చాలా ఉపయోగపడుతుంది. అయితే, మార్కెట్లలో చాలావరకూ రసాయనాలు, కృత్రిమ సువాసనలతో నిండినవే ఉంటాయి. వాటితో లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. కాబట్టి, ఇంట్లోనే అత్యంత శ్రేష్ఠమైన రోజ్ వాటర్ను స్టీమింగ్ పద్ధతిలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. స్టీమింగ్ పద్ధతిలో వచ్చే రోజ్వాటర్ చాలాకాలం నిల్వ ఉంటుంది. చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. రోజ్ వాటర్ తయారీ కోసం దేశీ గులాబీలను ఎంచుకోవడం మంచిది. వీటిలోనే సువాసనలు, సుగుణాలు ఎక్కువగా ఉంటాయి. అదే, మార్కెట్లో దొరికే హైబ్రిడ్ పూలతో అంత ఉపయోగం ఉండదు.
కావాల్సినవి: రెండు కప్పుల తాజా గులాబీ రేకులు, నీళ్లు, ఒక పెద్ద గిన్నె, ఒక చిన్న గిన్నె, కొన్ని ఐస్ క్యూబ్స్.
తయారీ విధానం: పెద్ద గిన్నె మధ్యలో ఒక చిన్న ఖాళీ గిన్నెను ఉంచాలి. చిన్న గిన్నె చుట్టూ గులాబీ రేకులను వేయాలి. రేకులు మునిగే వరకు నీటిని పోయాలి. అయితే, మధ్యలోని చిన్న గిన్నెలోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు పెద్ద గిన్నెపై మూతను బోర్లించి పెట్టాలి. మూత పైన కొన్ని ఐస్ క్యూబ్స్ వేయాలి. ఈ సెటప్ను పొయ్యి మీద ఏర్పాటు చేసి, మంటను పెట్టాలి. తక్కువ మంటలో 20-30 నిమిషాలు నీటిని మరిగించాలి. ఆవిరి రూపంలో వచ్చే స్వచ్ఛమైన రోజ్ వాటర్.. మధ్యలో ఉన్న చిన్న గిన్నెలోకి చేరుతుంది. ఈ నీటిని సేకరించి, చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్లో నింపుకొంటే చాలు. అయితే, ఇంట్లో తయారు చేసిన రోజ్ వాటర్లో ప్రిజర్వేటివ్స్ ఉండవు. కాబట్టి దీనిని రిఫ్రిజిరేటర్లో ఉంచడం మంచిది. అప్పుడే రెండుమూడు వారాల పాటు తాజాగా ఉంటుంది.