ఒక మహిళ మద్యం వ్యాపారంలో కాలు పెట్టడమే ఒక సంచలనం. అలాంటిది, ప్రియాంక సావె మద్యం తయారీలో అనేక ప్రయోగాలు చేసింది. సపోటా నుంచి తేనె వరకు రకరకాల రుచులతో వైన్స్ చేస్తున్నది.‘ఆరోగ్యకరమైన మద్యం’ ఆమె నినాదం.
ప్రియాంక సావె మహారాష్ట్రలోని బోర్డి పట్టణంలో పుట్టి పెరిగింది. పుణెలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివింది. అమెరికాలో మాస్టర్స్ చేసింది. అప్పటికే ఆమెకు నగేశ్ పాయ్తో వివాహమైంది. ఇండియాకు తిరిగొచ్చిన కొత్తలో.. నాన్న శ్రీకాంత్ సావె పండించిన సపోటా పళ్లు తగిన మార్కెట్లేక సగానికి సగం పాడైపోయేవి. వాటిని పారేయాల్సి వచ్చేది. ఆ నష్టాన్ని నివారించేందుకు ఏదో ఒకటి చేయాలని భర్తను కోరింది ప్రియాంక. సపోటా వైన్ ఆయన సలహానే! కెనడాకు చెందిన డామినిక్ రివార్డ్ అనే నిపుణుడి సలహాతో తయారీ విధానం తెలుసుకున్నారు. మరింత అధ్యయనం కోసం ప్రియాంక ఇంగ్ల్లండ్ వెళ్లింది. వైన్ తయారీలో కోర్సులు చేసింది. తమ కుటుంబానికి చెందిన పాత బంగళాలో ‘హిల్ జిల్ వైన్స్’ పేరుతో ఓ కంపెనీని స్థాపించింది.
ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా తన కార్ఖానాలో సపోటా వైన్ తయారు చేసింది ప్రియాంక. ఆ ప్రయత్నం విజయవంతమైన తర్వాత పైనాపిల్, స్ట్రాబెర్రీ, స్టార్ ఫ్రూట్స్, మామిడి పండ్లను పులియబెట్టడం ద్వారా మరికొన్ని పానీయాలను రూపొందించింది. ‘ఫ్రూజాంటే’ బ్రాండ్ పేరుతోనే వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. మొదట్లో చాలా సమస్యలు వచ్చాయి. సాధారణ వైన్స్ను, పండ్ల వైన్స్ను ప్రభుత్వం ఒకే గాటన కట్టడం అన్యాయమంటూ ఆమె పోరాటం చేసింది. మూడేండ్ల పాటు కష్టపడి కొన్ని మినహాయింపులు సాధించింది. ఫ్రూజాంటే పానీయాల్ని మహారాష్ట్ర, గోవాలో విక్రయిస్తున్నారు. కొత్తగా ఆవిష్కరించిన తేనె ఆధారిత పానీయాన్ని ‘అర్క’ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది.