Pothana Bhagavatam Episode 112 | శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ- దామోదర దేవుని దివ్యమంగళ శ్రీ విగ్రహం. సప్తమ, అష్టమ స్కంధాలు భాగవత రూపుడైన కృష్ణ భగవానునికి రెండు భుజాలు. ఘృణ (అసూయ), శంక, భయం, లజ్జ (సిగ్గు), జుగుప్స (చీదర), కులాభిమానం, శీలాభిమానం, మాన (పరువు, మహత్త) అభిమానం- ఈ ఎనిమిది మనోవికారాలను (భావాలను) కాళీ తంత్ర గ్రంథం అష్టపాశాలు- బంధాలుగా పేర్కొంది. అష్టమ స్కంధాన్ని నిష్ఠగా అధ్యయనం- పారాయణం చేసే శిష్ట జీవులను అది అష్ట విధాలైన బంధాలనే (పాశాలనే) కబంధ హస్తాల నుంచి నిర్బంధంగా విడిపిస్తుంది.
ఈ అష్టమం, తెలుగువారికి అత్యంత ఇష్టమైన గజేంద్ర మోక్షణం, క్షీరసాగర మథనం, మహాకాలుని హాలాహల భక్షణం, చిత్రాతిచిత్రమైన వామన చరిత్ర అనే ఘట్ట చతుష్టయంతో పరిపుష్టమై, పోతన మహాకవి అనల్ప కవితా చేతనా శిల్ప జుష్టమైన విశిష్ట స్కంధం. పీయూష (అమృత) నిష్యందాలైన పదబంధాలతో కూడిన, ఈ కథా ప్రసంగంలోని పలు గద్యపద్యాలు అశేష ఆంధ్రులకు విశేష ముదావహాలై, భావుక బుధ (పండిత), భక్త జనుల హృదయాలను సదా సుధామయం చేస్తున్నవని అనడంలో అతిశయోక్తి అణుమాత్రం లేదు.
బుధేంద్ర చంద్రుడు పోతన అమాత్యుని తెలుగు భాగవతంలో గజేంద్ర మోక్షణం పారమార్థిక జిలుగు వెలుగులతో ప్రకాశించే ప్రశస్తమైన ప్రసంగం. ఇది అనన్యభక్తి వైశిష్ట్యాన్ని, సర్వ శరణ్యుడైన రమాపతి- విష్ణువు శరణాగతి తత్తాన్ని హిత రమణీయంగా ప్రతిపాదించే అతి కర్ణపేయమైన వర్ణచిత్రం. ఇందు గజేంద్రుడు వీనులవిందుగా చేసిన కరుణాసింధువైన ఇందిరావరుని భావ బంధురమైన స్తుతి స్తోత్ర భక్తులకు ధృతి- ధైర్యాన్ని, సన్మతిని, సద్గతిని- పరానుభూతిని ప్రసాదించేది.
శుక ఉవాచ- ‘పరీక్షిన్మహారాజా! ప్రియవ్రతుని పుత్రుడు, ఉత్తమునికి తమ్ముడూ అయిన ‘తామసుడు’ నాల్గవ మనువు. ఆ తామస మన్వంతరంలో సర్వహృదయాంతరనివాసి అయిన వాసుదేవుడు హరిమేధునికీ, హరిణికీ ‘హరి’ అను నామంతో అవతరించి, మొసలి బారినపడ్డ కరిని (ఏనుగును) కనికరంతో కాపాడి తరింపజేశాడు’ అనగా విని అవనీపతి శుకమునిని ఇలా ప్రశ్నించాడు…
కం॥ ‘కరిఁదిగుచు మకరి సరిసికిఁ
గరి దరికిని మకరిఁ దిగుచు గరకరి బెరయన్
గరికి మకరి మకరికిఁ గరి
భర మనుచును నతల కుతల భటులరుదు పడన్’
మునీంద్రా! నీరాటమైన (నీటిలో చరించే) మొసలికి, వనాటమైన (దట్టమైన అడవిలో సంచరించే) ఏనుగుకు ఘోరాటవిలో పోరాటం కలుగడానికి కారణమేంటి? విష్ణువు గజేంద్రుని ఆరాటాన్ని (సంకటాన్ని) ఎలా తొలగించాడు? ఈ కథ వినాలని నాకు వేడుకగా ఉంది, వినిపించుమని విష్ణురాతుడు- పరీక్షిత్తు వేడగా అతనికి బ్రహ్మరాతుడు- శుకుడు వినిపించిన కథను సూతుడు నైమిశారణ్యంలో శౌనకాదులకు సంతోషంగా ఇలా సెలవిచ్చాడు…
శుక ఉవాచ- రాజేంద్రా! పాల సముద్రంలో త్రికూటమనే ఒక అందమైన పర్వతం ఉంది. దానికి బంగారు, వెండి, ఇనుముతో నిండిన మూడు శిఖరాలు ఉన్నాయి. ఆ కొండ కింద ఉన్న కారడవిలో రకరకాల క్రూర జంతువులు ఎప్పుడూ పరస్పరం పోరాడుకుంటూ ఉంటాయి. అక్కడ సింహాలను సైతం ఢీకొన గలిగే ఏనుగులు లెక్కలేనన్ని సంచరిస్తుంటాయి. ఆ గుంపులోని ఒక గజేంద్రుడు దైవవశంచేత దప్పికతో తెలివి కోల్పోయి తన ఆడ ఏనుగులతో దారితప్పి నడిచాడు. ఆయాసపడుతూ కూడా అడవిలో వడివడిగా, విచ్చలవిడిగా తిరిగాడు. ‘మరచి మత్తేభయూధంబు మడుగుఁజొచ్చె’ అన్న గంభీరమైన మాట పోతన విరచితం! ఆ గజరాజు ఒకచోట అందమైన మడుగు చూచాడు. ఆనందించి భార్యాబిడ్డలతో అందులో దిగి అడ్డులేకుండా విహరించాడు. గృహస్థుని వలె మోహగ్రస్తుడై తన తొండంతో జలధారలు చిమ్ముతూ జలకాలాడాడు. భార్యాపుత్రులను స్నానం చేయించి నీరు తాగించాడు. దేవమాయా మోహితుడై ఉన్మత్తుడయ్యాడు. మున్ముందు ముంచుకు రాబోతున్న పెనుముప్పును ఆ రసిక శేఖరుడు పసిగట్టలేకపోయాడు. పంచేంద్రియ (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల- విషయ సుఖాల) వ్యాపారాలలో తన్ను తాను మరచి (తన వాస్తవ స్వరూపాన్ని విస్మరించి) మడుగు సొచ్చినవాడు మానవుడే! మదించిన ద్విపం (ఏనుగు) అనే నెపంతో సాగిన మానవ వ్యవహారమే ఇది!
ఆ ఉన్మత్త స్థితిలో ప్రారబ్ధవశాత్తు, రాహువు సూర్యుణ్ని పట్టుకున్నట్లు ఒక మకర (మొసలి) రాజు మన మత్తేభ (గజ)రాజు పాదాన్ని ఒడిసిపట్టుకున్నాడు. గజేంద్రుడు విదిలించికొట్టి పట్టు తప్పించుకున్నా, తొందరగా తేరుకొని ఆ మొసలి మరల ఏనుగు ముందరి కాలు పట్టుకుంది. అంతే, ఇక తాను గిట్టేవరకు దాని పట్టు విడిచిపెట్టలేదు. ఘోరాటవిలోని కాసారం (మడుగు)లో అనేక అబ్దాలు (సంవత్సరాలు) కొనసాగిన కరి మకరుల ఆ పోరును పోతన్న శబ్దచిత్రం ద్వారా ఇలా దర్శింపజేశాడు-
కం॥‘నీరాట వనాటములకుఁ
బోరాటం బెట్లు గలిగెఁ? బురుషోత్తముచే
నారాటమెట్లు మానెను
ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్?’
మకరి కరిని మడుగులోనికి ఈడుస్తోంది. కరి మకరిని దరికి- గట్టు మీదికి గట్టిగా లాగుతోంది. రెండూ పరస్పరం రోషద్వేషాలను పెంచుకున్నాయి. కరి మకరులు ‘నువ్వానేనా’ అన్నట్లు ఉన్నాయని అనుకుంటూ అతల, భూతల లోకాల కాకలు తీరిన వీరులు ఆశ్చర్యంతో కేరింతలు కొడుతున్నారు. శుకుడు- రాజా! ఆ సమయంలో మకరితో పోరాడుతున్న, కట్టుకున్న మగనిని- కరిరాజును ఒంటరిగా వదలి బరితెగించి వెళ్లడానికి కాళ్లు రాక, కాంతామణులు చెంతనే ఉండి కూడా ఏమి చేతగాక చూస్తూ ఉండిపోయారు. ‘మగలు దగులు గారె మగువలకున్’- (ఆలుమగల మధ్య ఉండే ఈ తగులాటం, ఈ పీటముడి ఎంతైనా విడరానిది కదా!) ఆటవెలది పద్యంలోని ఈ ముక్తాయింపు మాట పోతన అమాత్యుని సొంతం. అమూలకమైనా ఎంతో అనుభవమూలకం!
గజేంద్ర మోక్షణం ఒక అర్థవాదం. ప్రతీకాత్మకం- పరోక్ష బోధ. ఇందులోని కథ పరమార్థం కాదు. భక్తి, జ్ఞాన వైరాగ్య పూర్వకంగా ప్రపత్తి (శరణాగతి)లో ప్రవృత్తి కలిగించడమే- ఈ శాస్ర్తార్థమే ఇందలి పరమ తాత్పర్యం. జీవుడు వాసనాపాశాలకు చిక్కి పశువయ్యాడు. పాశబద్ధుడైన మానవ పశువే గజేంద్రుడు. కారణ (అవ్యక్త) చైతన్యమే క్షీరసాగరం. త్రిగుణాత్మక మాయాకార్యమైన శరీరమే త్రికూట పర్వతం. సత్తరజస్తమో గుణాలే మూడు శిఖరాలు- ‘మూల కూటత్రయ కళేబరా’ అని లలితా సహస్ర నామం. సంసారమే కాసారం (మడుగు). మృత్యువే మొసలి, మాయే మకరి, మోహమే (అవిద్యయే) గ్రాహం- మొసలి. అవిద్యామోహితులైన బద్ధజీవులే ఏనుగులు. ఏనుగు సహజంగానే మదప్రాణి. పైపెచ్చు జాయా (భార్యా)మణులతో జలక్రీడలు. భాగవతంలో శకటాసురుడు జడవాదానికి, జడాసక్తికి సంకేతం. ఇలా భ్రష్టబుద్ధి, నష్టవీర్యుడైన గృహస్థ మానవుడే మత్త గజేంద్రుడు! (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006