బుధవారం హనుమత్ జయంతి
భయాందోళనలో ఉన్నవారికి అభయాంజనేయుడు ప్రశాంతత కోరుకున్న వారికి సన్నాంజనేయుడుసాయం అడిగినవారికి సహకార ఆంజనేయుడు తలుచుకున్న వారికి కోరుకున్న రూపంలో అండగా నిలిచే కొండంత దైవం ఆయన. సమస్త దోషాలను తొలగించి, సమగ్ర అనుగ్రహం కురిపించే పవనసుతుడి విశ్వరూపమే పంచముఖ ఆంజనేయ స్వరూపం. రాములవారి రక్షణ కోసం, సీతమ్మ విజయం కోసం అవతరించిన పంచముఖ ఆంజనేయుడు.. పంచకృత్య పరాయణుడు.
ఆరాధన
రామలక్ష్మణులను పాతాళంలో మైరావణుడి బారినుంచి కాపాడిన పంచముఖ ఆంజనేయుడి రూపాన్ని ఆరాధిస్తే ధర్మబద్ధమైన అన్ని అభీష్టాలూ నెరవేరతాయని విశ్వసిస్తారు. మంత్రాలయం సమీపంలో శ్రీరాఘవేంద్రస్వామి తుంగభద్రా నదీతీరంలో పంచముఖి దగ్గర పంచముఖ ఆంజనేయస్వామిని ఆరాధించారు. రాఘవేంద్రులు తపస్సు చేసుకున్న స్థలంలో ఉన్న పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం ప్రసిద్ధిచెందింది. పాకిస్తాన్లో అతిపెద్ద నగరం కరాచీలో కూడా పురాతనమైన పంచముఖ ఆంజనేయ దేవాలయం ఉంది. అక్కడ ఇప్పటికీ పూజలు జరుగుతుండటం విశేషం. ఇక అరుదైన మత్స్యవల్లభుడి శిల్పం కొలనుపాకలో సోమేశ్వరాలయం ముందున్న పురావస్తు సంగ్రహాలయంలో దర్శనమిస్తుంది.
మన పురాణ గాథలన్నీ పార్వతికి శివుడు చెబుతున్నట్లో, విష్ణువు లక్ష్మికి వివరిస్తున్నట్లో, బ్రహ్మదేవుడు సరస్వతితో అంటున్నట్లుగానో మొదలవుతాయి. హనుమంతుడి ఆరాధనలో విశిష్టమైనదిగా భావించే పంచముఖ ఆంజనేయ అవతార నేపథ్యమూ అలాంటిదే. ఓమారు కైలాస పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉన్నారు. అప్పుడు జగన్మాత “స్వామీ! మీరు కూడా శ్రీమహావిష్ణువులా ఏవైనా అవతారాలు ఎత్తారా?” అని శంకరుడిని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు భక్తుల కోరికలు తీర్చడానికి సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలతో పంచకృత్య పరాయణుడైన తాను పంచముఖ ఆంజనేయ రూపాన్ని ధరించినట్లు చెప్పాడు. అంతేకాదు ఆ రూప విశిష్టతనూ వివరించాడు.
మహాభారతంలో రాయబారం సమయంలో, యుద్ధభూమిలో గీతాబోధ సందర్భంగా శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. దీనితో పోలిస్తే పంచముఖ ఆంజనేయుడి రూపం హనుమంతుడి విశ్వరూపంగా భావించవచ్చు. పంచముఖ ఆంజనేయ స్వరూపంలో వానర, నరసింహ, గరుడ, వరాహ, హయ (గుర్రం) ముఖాలు ఉంటాయి. త్రిపంచ నయనం అంటే పదిహేను నేత్రాలతో కాంతిమంతంగా ఉంటుంది. పది చేతులలో కత్తి, డాలు, పుస్తకం, అమృతకలశం, అంకుశం, పర్వతం, నాగలి, మంచపుకోడు, పాము, చెట్టు ఆయుధాలుగా అలరారుతుంటాయి. ఇక హనుమంతుడు పంచముఖుడిగా రూపుదాల్చడానికి సంబంధించి ఈ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిలో మైరావణ వధకు సంబంధించింది ఒకటి కాగా, రెండోది శతకంఠరావణ వధ కథ.
మైరావణ వధ
రామ రావణ యుద్ధంలో రాముడి చేతిలో కుంభకర్ణుడు, లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్తు మరణిస్తారు. ఇక తర్వాత వంతు తనదే అని రావణుడు గ్రహిస్తాడు. దాంతో బలంలో తనతో సమానుడైన మైరావణుడి సాయం కోరతాడు. మైరావణుడు శక్తి ఆరాధకుడు, తాంత్రికుడు. నిద్రిస్తున్న సమయంలో రామలక్ష్మణులను పాతాళానికి తీసుకువెళ్తాడు. ఇద్దరినీ అమ్మవారికి బలి ఇచ్చి సర్వసిద్ధులనూ వశం చేసుకోవాలని అనుకుంటాడు. విషయం తెలుసుకున్న హనుమంతుడు పాతాళానికి పయనమవుతాడు.
పాతాళ బిలం ద్వారం దగ్గర ఒక వానరుడు కాపలా ఉంటాడు. అతని అంగీకారం లేకుండా ఎవ్వరూ పాతాళలోకంలో ప్రవేశించలేరు. దాంతో హనుమకు ఆ వానరుడితో పోరు తప్పనిసరవుతుంది. ఎంతకూ ఫలితం లేకపోవడంతో “నీవెవరు?” అని అడుగుతాడు హనుమ. దానికి “నా పేరు మకరధ్వజుడు. నా తండ్రి హనుమంతుడు” అని బదులిస్తాడు. అప్పుడు తానే హనుమంతుణ్ని అని, ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి, తనకు సంతానం ఉండటం అసంభవం అంటాడు. ఆయనే ఆంజనేయుడని రుజువు చేసుకోవాలని కోరతాడు మకరధ్వజుడు. పాతాళ ద్వారంలో అయిదు మూలల్లో ఉన్న దీపాలను ఒకేసారి ఆర్పేయాలని షరతు విధిస్తాడు. అలా చేస్తే పాతాళలోకంలో ఎదురు ఉండదని అంటాడు. దాంతో హనుమంతుడు నరసింహ, వరాహ, అశ్వ, గరుడ ముఖాలను ధరించి ఆ దీపాలను ఆర్పివేస్తాడు. అలా మకరధ్వజుడు పెట్టిన పరీక్ష నెగ్గుతాడు. పాతాళలోకానికి వెళ్తాడు. మైరావణుడిని వధించి రామలక్ష్మణులను మళ్లీ యుద్ధభూమికి తీసుకువస్తాడు.
పంచముఖ ఆంజనేయ ఆవిర్భావానికి సంబంధించి ప్రచారంలో ఉన్న కథల్లో ఇది ఒకటి. హనుమ సముద్ర లంఘనం చేస్తుంటే అతని చెమట బిందువు ఒక చేప కడుపులో పడుతుంది. దాంతో ఆ మత్స్యం గర్భం దాలుస్తుంది. అలా జన్మించినవాడే మకరధ్వజుడు. ఇతనికే మత్స్యవల్లభుడు అనే పేరు కూడా ఉంది.
శతకంఠరావణుడి కథ
రావణ వధ అనంతరం రామలక్ష్మణులకు శతకంఠుడి రూపంలో మరో ముప్పు ఎదురవుతుంది. శతకంఠుడు రావణుడి కంటే బలవంతుడు. అతణ్ని చంపడం రామలక్ష్మణులు సహా ఎవ్వరినుంచీ కాదు. కేవలం ఆదిపరాశక్తి స్వరూపమైన సీత మాత్రమే శతకంఠుణ్ని నిర్జించగలదు. అయితే అతనితో యుద్ధం చేస్తున్న సమయంలో శతకంఠుడి రక్తం భూమిమీద పడకూడదు. ఒక్కొక్క రక్తపుబొట్టు నుంచి ఒక్కో శతకంఠుడు పుట్టుకొస్తాడు. దాంతో సీత యుద్ధం చేస్తుంటే, ఆంజనేయుడు విశ్వరూపం దాలుస్తాడు. తనతోపాటు నరసింహ, వరాహ, హయగ్రీవ, వరాహ ముఖాలను ధరిస్తాడు. శతకంఠుడి రక్తం నుంచి ఉద్భవించిన అనేక శతకంఠులను, అతని సేనలను నుగ్గునుగ్గు చేస్తాడు. అలా సీత శతకంఠుణ్ని వధించడానికి మారుతి తనవంతు సహకారం అందిస్తాడు.
అయిదుగురి శక్తి..
పంచముఖ ఆంజనేయుడి పది చేతుల్లోని ఆయుధాలను స్మరిస్తే చాలు అన్ని రకాలైన శుభాలూ చేకూరతాయి. స్వయంగా హనుమంతుడు, విష్ణువు అవతారాలు, అంశలైన నరసింహ, వరాహ, హయగ్రీవ, ఆయన వాహనం గరుత్మంతుడు… అయిదుగురు ఇచ్చే ఫలాలను ఒక్క పంచముఖ ఆంజనేయ రూపమే ప్రసాదించగల శక్తిమంతమైనది.
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాన్వితం
దివ్యాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాైబ్జెరసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశాద్రిం హలం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి వీరాపహమ్
ముఖాల వివరణ
వానర ముఖం: తూర్పు దిక్కు. శత్రు వినాశనం చేస్తాడు.
నరసింహ ముఖం: దక్షిణ దిక్కు. భూతప్రేతాల బాధనుంచి విముక్తి.
గరుడ ముఖం: పశ్చిమ దిక్కు. అన్ని రకాల విషాలను హరిస్తాడు.
వరాహ ముఖం: ఉత్తర దిక్కు. సకల సంపదలనూ ప్రసాదిస్తుంది.
హయగ్రీవం: ఊర్ధ ముఖంగా ఉంటుంది. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
– చింతలపల్లి హర్షవర్ధన్