ఉరుకులు పరుగుల జీవితంలో.. భోజనం కూడా వేగంగా పూర్తిచేస్తున్నారు. ఆఫీసుకి వెళ్లే తొందరలోనో, పని ఒత్తిడిలోనో.. గబగబా తినేస్తున్నారు. మరికొందరికి సమయం ఉన్నా.. ఆహారం రుచిగా ఉందని నిమిషాల్లోనే ప్లేట్ ఖాళీ చేస్తుంటారు. అయితే, ఈ అలవాటు ఊబకాయం బారిన పడేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాకాకుండా.. బరువును అదుపులో ఉంచుకోవడానికి తిండి వేగాన్ని తగ్గించాలని సలహా ఇస్తున్నారు.
జంక్ ఫుడ్ వల్లే ఊబకాయం వస్తుందని చాలామంది భావిస్తారు. లేకుంటే, ఎక్కువ పరిమాణంలో తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ, ఏయే పదార్థాలు, ఎంత తింటున్నామన్నదే కాదు.. ఎంత వేగంగా తింటున్నాం? అనేది కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత కడుపు నిండిందనే సంకేతం మెదడుకు చేరడానికి కాస్త సమయం పడుతుంది. దీనినే ‘గట్-బ్రెయిన్ యాక్సిస్’ అంటారు. జీర్ణవ్యవస్థకు-మెదడుకు మధ్య ఉన్న ఈ అనుసంధానం కాస్త ఆలస్యంగా పనిచేస్తుంది. కడుపు నిండినప్పుడు విడుదలయ్యే కొన్నిరకాల హార్మోన్లు.. మెదడులోని హైపోథాలమస్ను చేరడానికి దాదాపు 20 నిమిషాలు పడుతుందట. కానీ, భోజనాన్ని గబగబా తినేస్తే.. కడుపు నిండిన సిగ్నల్ మెదడుకు అందేలోపే, శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారాన్ని తినేస్తారన్నమాట. అలాకాకుండా.. నిదానంగా తిన్నప్పుడు శరీరంలో ‘లెప్టిన్’ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి కడుపు నిండిన తృప్తిని కలిగిస్తాయి. అదే వేగంగా తినడం వల్ల.. ఈ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేసే అవకాశం ఉంటుంది.
అయితే, ఇలా వేగంగా తింటూ.. ఊబకాయం బారినపడే వారు ‘30-30’ చిట్కాలు పాటించాలని ఆహార నిపుణులు సలహా ఇస్తున్నారు.