Koppula Vasundhara | పోలియోతో చచ్చుబడిన పాదాలు ఇల్లు కదలనివ్వలేదు. అయితేనేం, సవాళ్లను స్వీకరించే ఆ పట్టుదలకు ముచ్చటపడి ప్రపంచమే ఆమె ముంగిట వాలింది. చుట్టూ ఉన్న సమస్యలు పోరాట స్ఫూర్తిని రగిలించాయి. ఏ ఉపాధి అవకాశాలూ లేని దివ్యాంగుల కోసం ఓ వేదిక ఏర్పాటు దిశగా ప్రోత్సహించాయి. చక్రాల కుర్చీకి పరిమితమైతేనేం.. కొప్పుల వసుంధర ఆత్మబలం అపరిమితం.
వైకల్యం.. ఒకటిరెండు అవయవాలను నిర్జీవంగా మార్చేస్తుంది. కానీ, మిగిలిన భాగాలను సమర్థంగా ఉపయోగించుకునే శక్తినిఇస్తుంది. అంధులు చూడలేరు. కానీ సూక్ష్మగ్రాహులు. బధిరులు వినలేరు. అయితేనేం, ప్రత్యామ్నాయ వ్యక్తీకరణ మార్గాలు కొట్టినపిండి. పోలియో బాధితులు అడుగు ముందుకు వేయలేరు. కానీ, సమూహాల్ని ముందుండి నడిపించగల నాయకత్వ ప్రతిభ అపారం. అందుకు కొప్పుల వసుంధర జీవితమే ఉదాహరణ. అనంతపురం జిల్లాలోని శెల్పూరు ఆమె సొంతూరు.
రెండేండ్ల వయసులో పోలియో బారిన పడింది. రెండుకాళ్లూ చచ్చుబడి పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితమైంది. ఆ కష్టం అక్కడితో ఆగలేదు. ఊహ తెలిసేనాటికి తండ్రిని కోల్పోయింది. అయినా ఏనాడూ కుంగిపోలేదు. సవాళ్లతో పాటు పట్టుదలా పెరిగింది. తల్లి ప్రమీలమ్మ, సోదరుడు రాజేంద్రప్రసాద్ సహకారంతో చదువుకుంది. మాస్ కమ్యూనికేషన్లో పీజీ చేసింది. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చింది. ఒడుదొడుకులను అధిగమించి ఉద్యోగం సంపాదించింది. వివిధ ఛానెళ్లలో ప్రోగ్రాం ప్రొడ్యూసర్గా, కంటెంట్ రైటర్గా పనిచేసింది. అయినా వెలితి. అసంతృప్తి. దివ్యాంగుల కోసం ఏదైనా చేయాలనే పట్టుదల. ఎంతో అంతర్మథనం తర్వాత ఉద్యోగం వదిలేసి.. ‘వీ మీడియాస్’ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్థాపించి ఆంత్రప్రెన్యూర్గా కొత్త ప్రయాణం ప్రారంభించింది. భర్త దేవులపల్లి నరేందర్ సహకారంతో దివ్యాంగుల కోసం ఈవెంట్స్ నిర్వహిస్తూ విభిన్న రంగాలలో అవకాశాలు కల్పించింది.
మరో ప్రాజెక్ట్.. డి-హబ్
దైనందిన అవసరాల కోసం దివ్యాంగులు ఎవరో ఒకరిపై ఆధారపడాల్సి వస్తున్నది. ఉద్యోగ, వ్యాపార అవకాశాలు సాధించడం అంటే మాటలు కాదు. ఒకవేళ అవకాశాలు వచ్చినా.. రోజూ ఆఫీసుకు వెళ్లేందుకు సరైన ప్రయాణ సాధనాలు లేవు. ర్యాంపులు, ప్రత్యేక మరుగుదొడ్లు, లిఫ్ట్లులు అసలే లేవు. వసుంధర ఆ ఇబ్బందులను అనుభవించింది. వ్యవస్థ నిర్లిప్తతను గ్రహించింది. ఉన్నచోటే చిన్నచిన్న వ్యాపారాలు చేసుకోగలిగితే సమస్యే లేదు. ఆ కోణంలోంచి లోతుగా అధ్యయనం చేసింది. వివిధ ఉపాధి మార్గాలపై దివ్యాంగులకు అవగాహన కల్పించాలని తీర్మానించుకుంది. అందుకు వేదికగా ‘డి-హబ్’ను స్థాపించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ, రుణాల కోసం బ్యాంకులతో సంప్రదింపులు, మారెటింగ్ -సేల్స్, పబ్లిసిటీ.. మొదలైన అంశాలలో ఆమె శిక్షణ ఇస్తున్నది. ఆ శిబిరాలకు హాజరైనవారికి ఉచిత భోజనం, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నది. ‘అడుగు ముందుకేయండి. నేనున్నాను..’ అని ధైర్యమిస్తున్నది.
‘విభిన్న’ కార్యక్రమాలు..
గత ఏడేండ్లుగా తన సంపాదనకు తోడు.. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం, దాతల సహకారంతో దివ్యాంగుల కోసం పలు ఈవెంట్స్ చేపడుతున్నది వసుంధర. అంధుల కోసం ‘విజువల్లీ చాలెంజ్డ్ క్రికెట్ లీగ్’, దివ్యాంగ మహిళల కోసం ‘మిస్ ఎబిలిటీ’ అందాల పోటీలు, నగరానికి తమవంతు సేవ చేస్తున్న వారికోసం ‘ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్’ తదితర కార్యక్రమాలు నిర్వహించింది. వాటికి మంచి స్పందన లభించింది. దివ్యాంగులకు పర్యాటక ప్రాంతాలను చేరువ చేయాలనేది వసుంధర సంకల్పం. ఆ ప్రయత్నంలో ‘ట్రై టూర్’
ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని కోటలు, ఆలయాలు తదితర పర్యాటక ప్రాంతాలను దివ్యాంగులు సందర్శించేందుకు అనువుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వమూ సానుకూలంగా స్పందించింది.
సాయం వద్దు. సహకారం ఇవ్వండి.
సమాజంలో అందరికన్నా వెనకబడిన వర్గం దివ్యాంగులే. బతకడానికి కనీస సౌకర్యాలు కూడా లేవు. గ్రామీణ ప్రాంతాల్లోనేమో ఉపాధి అవకాశాలు లేవు. పట్టణాల్లో ఉన్నా.. ఆ అవకాశాల్ని అందిపుచ్చుకోవడానికి మౌలిక వసతుల్లేవు. దీంతో ప్రతి చిన్న విషయానికీ ఇతరులపై ఆధారపడాల్సి వస్తున్నది. దివ్యాంగుల సమస్యల పట్ల సమాజంలోని అవగాహనా రాహిత్యమే మన ముందున్న పెద్ద సవాలు. అందుకే, దివ్యాంగులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి డి-హబ్ పేరుతో ఇంకుబేషన్ సెంటర్ స్థాపించాను. నేను సమాజాన్ని కోరుకునేది ఒక్కటే. దివ్యాంగుల అవసరాలు తీర్చాల్సిన పన్లేదు. ఆ ప్రయత్నంలో ఎదురయ్యే అవరోధాలను తొలగించండి. వ్యాపార వేత్తలుగా మారాలనుకునే దివ్యాంగులు 85003 61735 నంబరు ద్వారా సంప్రదిస్తే తగిన సహాయ సహకారాలు అందిస్తాను.
– కొప్పుల వసుంధర
– మ్యాకం రవికుమార్