కావలసిన పదార్థాలు
ఇడ్లీ బియ్యం: ఒక కప్పు, అటుకులు: అర కప్పు, పచ్చికొబ్బరి తురుము: ఒక కప్పు, కొబ్బరి పాలు: ఒక కప్పు, చక్కెర: అర కప్పు, డ్రై ఈస్ట్: అర టీస్పూన్, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: చిటికెడు, జీడిపప్పు, కిస్మిస్: ఒక టేబుల్ స్పూన్ చొప్పున.
తయారీ విధానం
ఇడ్లీ బియ్యాన్ని బాగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. అటుకులను ఒక గిన్నెలో పోసి అర కప్పు నీళ్లుపోసి బాగా నాననివ్వాలి. మిక్సీ జార్లో అటుకులు, నానిన బియ్యం, కొబ్బరి తురుము, చక్కెర, ఈస్ట్ వేసి కొబ్బరిపాలు పోస్తూ మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.
ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని గంటపాటు పక్కనపెట్టాలి. బాగా పులిసిన ఆ మిశ్రమంలో చిటికెడు ఉప్పు వేసి కలగలపాలి. స్టవ్మీద పాన్పెట్టి నెయ్యివేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కనపెట్టాలి. స్టవ్మీద ఆవిరి గిన్నెపెట్టి నీళ్లుపోసి వేడి చెయ్యాలి. పిండి మిశ్రమాన్ని నెయ్యి రాసిన వెడల్పాటి గిన్నెలో పోసి ఆవిరిపై 20 నిమిషాలపాటు ఉడికించాలి. పైనుంచి వేయించిన డ్రైఫ్రూట్స్ వేసుకుంటే నోరూరించే వట్టాయప్పం సిద్ధం.