రైతు కుటుంబం. చదువులే ఆస్తులు.విలువలే ఐశ్వర్యాలు. నిబద్ధతే కొలబద్దగా ఆయన అత్యున్నత శిఖరాన్ని అధిరోహించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి, 48వ ప్రధాన న్యాయమూర్తిగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు.. జస్టిస్ నూతలపాటి వెంకటరమణ.
ఒక వ్యక్తి ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే, కష్టపడే తత్వం ఒక్కటే సరిపోదు. కార్యదీక్ష, క్రమ
శిక్షణ చాలా ముఖ్యం. ఈ రెండూ జస్టిస్ ఎన్.వి.రమణలో నిండుగా తొణికిసలాడుతాయి. కాలేజీ రోజుల్లోనే విద్యార్థుల మధ్య పేచీలు వస్తే ఇరుపక్షాలూ ఆయననే సంప్రదించేవట. అధ్యాపకులు, విద్యార్థుల మధ్య తలెత్తే వివాదాలనూ సామరస్యంగా పరిష్కరించి ‘విద్యార్థి న్యాయమూర్తి’ పాత్రను పోషించారాయన. భవిష్యత్తులో తాను న్యాయవాదిని అవుతాననీ, న్యాయమూర్తిగా ఎదుగుతాననీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తాననీ అప్పుడు ఆయన ఊహించి ఉండరు. కానీ, అంచెలంచెలుగా ఎదుగుతూ సర్వోన్నత పీఠాన్ని అధిరోహించారు జస్టిస్ ఎన్.వి.రమణ.
కృష్ణాజిల్లా, వీరులపాడు మండలం, పొన్నవరం గ్రామంలో జన్మించారు జస్టిస్ ఎన్.వి.రమణ. తండ్రి నూతలపాటి గణపతిరావు రైతు. తల్లి సరోజని గృహిణి. రమణ ప్రాథమిక విద్యాభ్యాసం కంచిక చర్లలో సాగింది. ప్రతి విషయాన్నీ సూక్ష్మదృష్టితో ఆకళింపు చేసుకునేవారు. ఇంటర్, డిగ్రీ అమరావతిలో చదివారు. కుల రాజకీయాల పొడ తమ బిడ్డపై పడకూడదనే విజయవాడ, నందిగామలను కాదని రమణను అమరావతిలోని రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కాలేజీలో చేర్పించారు గణపతిరావు. ఆయన తన ఇద్దరు ఆడపిల్లలకు కూడా మంచి చదువులు చెప్పించారు.
విద్యార్థి నాయకుడిగా..
రమణ డిగ్రీ చదువుతున్న రోజులవి. దేశంలో ఎమర్జెన్సీ విధించారు. జనతాపార్టీలోని సోషలిస్టులతో పరిచయం ఏర్పడింది. యుక్తవయసు. పైగా ఉడుకు రక్తం. కరపత్రాలద్వారా ప్రజాగళాన్ని వినిపించారు. ఓసారి, ఎమర్జెన్సీ వ్యతిరేక సభకు అధ్యక్షత వహించారు. సభనుంచి ఇంటికి రాగానే,
రమణతో తండ్రి దుస్తులు సర్దుకోమని చెప్పారట. ఎందుకని అడిగితే, ‘నీపై పోలీసుల నిఘా ఉంది. అరెస్ట్ చేయవచ్చ’ని హెచ్చరించారట. అలా, ఎమర్జెన్సీ వ్యతిరేక కార్యకలాపాలవల్ల ఆయన ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయారు. ఎమర్జెన్సీ రద్దు తర్వాత, 1979లో బీఎస్సీ పూర్తి చేశారు. డిగ్రీలో ఉండగా విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
అభ్యుదయ భావాలు
డిగ్రీ తర్వాత నాగార్జున యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించారు రమణ. క్యాంపస్లో విద్యార్థి ఉద్యమాలకు అండగా ఉన్నారు. తరిమెల నాగిరెడ్డి ప్రభావం ఆయనపై అపారం. దేశ ఆర్థిక అంశాలను ప్రస్తావిస్తూ నాగిరెడ్డి రాసిన ‘తాకట్టులో భారతదేశం’ పుస్తకం లోతుగా ఆలోచింపజేసింది. సంజయ్దేవ్, త్రిపురనేని గోపీచంద్ తదితరుల రచనల ప్రభావమూ ఉండేది. ఎన్ని వ్యాపకాలున్నా చదువు దగ్గరికి వచ్చేసరికి ప్రతిభావంతుడని నిరూపించుకున్నారు. ఏదైనా అంశాన్ని ఒక్కసారి చెబితే, ఇట్టే పట్టేసే గ్రహణశక్తి ఆయన సొంతం. పరీక్షల్లో అందరికన్నా ఎక్కువ మార్కులు తనకే. లా పూర్తయ్యాక కొన్నాళ్లు ఓ ప్రముఖ పత్రికలో జర్నలిస్ట్గా పనిచేశారు. తర్వాత, బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. నాటినుంచి న్యాయవ్యవస్థలో రమణ ప్రస్థానం ప్రారంభమైంది.
అయ్యపురెడ్డి దగ్గర జూనియర్గా..
మొదట్లో, ప్రముఖ న్యాయవాది కంఠమనేని రవీందర్రావు దగ్గర కొద్ది నెలలు జూనియర్గా ఉన్నారు రమణ. తర్వాత, హైదరాబాద్ వచ్చి సీనియర్ న్యాయవాది ఏరాసు అయ్యపురెడ్డి దగ్గర పదేండ్ల పాటు జూనియర్గా చేశారు. స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించినా, అయ్యపురెడ్డి కార్యాలయానికి తరచూ వెళ్లేవారు. తన గురువు రాజకీయాల్లో బిజీ కావడంతో, ఆయన కేసుల బాధ్యత రమణ చేపట్టేవారు. 1998 ఏప్రిల్లో అదనపు అడ్వకేట్ జనరల్ అయ్యారు. 2000 జూన్ 27న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 13 నుంచి మే 20 వరకూ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తి పీఠాన్ని అధిరోహించారు.
ధర్మ పక్షపాతి
న్యాయవాదిగా తనదైన శైలిలో వాదించి ఎన్నో కేసులు గెలిచారు రమణ. సివిల్, క్రిమినల్ చట్టాలపై అనితర సాధ్యమైన పట్టు ఆయన సొంతం. రాజ్యాంగ పరమైన వివాదాలు, కార్మిక చట్టాలకు సంబంధించిన అంశాలపట్ల్ల పూర్తి సాధికారత సాధించారు. కేంద్ర , రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునల్స్, హైకోర్టు, సుప్రీంకోర్టు, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల ట్రైబ్యునళ్లు.. ఇలా అన్ని న్యాయ పీఠాల ముందూ కేసుల్ని సమర్థంగా వాదించారు. రాజ్యాంగ పరమైన కేసులనూ వాదించారు. ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మాణ ఎత్తు వివాదంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరఫున వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా, క్యాట్, రైల్వే స్టాండింగ్ కౌన్సిల్గా సేవలు అందించారు. ఇప్పుడు, సర్వోన్నత న్యాయస్థానానికి 48వ చీఫ్ జస్టిస్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు, అంటే 16 నెలలపాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా కొనసాగనున్నారు మన తెలుగు బిడ్డ. వృత్తిగతంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా రమణ అదరలేదూ బెదరలేదు. ధర్మ పక్షపాతమే వహించారు. ప్రతి సందర్భంలోనూ, అంతిమంగా ధర్మమే గెలిచింది.. గెలుస్తుంది కూడా!
మహిళలపై ప్రత్యేక అభిమానం
‘అమ్మఒడిలో మంచితనం, మానవత్వం నేర్చుకున్న కొడుకుగా, ఇద్దరు అక్కల ప్రేమను పొందిన తమ్ముడిగా, ఇద్దరు ముద్దుల కూతుళ్లను పెంచిన తండ్రిగా నాకు మహిళ గొప్పదనం తెలుసు. దేవుడిచ్చిన అక్క జస్టిస్ జి.రోహిణి ప్రభావం.. ఎందరో మహిళా న్యాయవాదుల సాహచర్యం.. స్త్రీలపై నాకు ఎనలేని గౌరవానికి కారణమయ్యాయి’ అంటారు జస్టిస్ రమణ. మహిళల హక్కుల గురించి ప్రస్తావించినా, ఇండ్లలో పనిచేసే మహిళల శ్రమశక్తికి విలువ ఉండాలని తీర్పు చెప్పినా ఇవన్నీ ఆయనకు మహిళలపట్ల అభిమానానికి తార్కాణాలే.
నాడు బిడ్డ.. నేడు అల్లుడు!
తూర్పు గోదావరి జిల్లా రాజ
మండ్రికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన తొలి తెలుగు వ్యక్తి. ఆయన సర్వోన్నత న్యాయస్థానం 9వ ప్రధాన న్యాయమూర్తిగా సుమారు పది నెలలు సేవలు అందించారు. 1967లో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరఫు అభ్యర్థిగా పోటీ చేయాల్సి రావడంతో సీజే పదవికి రాజీనామా చేశారు. మళ్లీ ఐదున్నర దశాబ్దాలకు సుప్రీం పీఠాన్ని ఒక తెలుగువాడు అధిరోహించారు. అప్పుడు రాజమండ్రి బిడ్డ చీఫ్ జస్టిస్గా ఎంపిక కాగా, ఇప్పుడు రాజమండ్రి అల్లుడు ఆ పదవిని అలంకరించడం కాకతాళీయమే కావచ్చు.
రాగద్వేషాలకు అతీతం
జస్టిస్ రమణ తన స్వగ్రామం వెళితే, సాధారణ రైతుబిడ్డలా అందరితో కలివిడిగా ఉంటారు. గ్రామస్తుల సమస్యలను తెలుసుకొంటారు. వాటి పరిష్కారానికి సాయపడతారు. ముఖ్యంగా ఆ ప్రాంతానికి చెందిన విద్యార్థినులు, మహిళల ఇబ్బందులను తక్షణమే పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. సమస్యను సానుకూల దృక్పథంతో చూస్తారు. పారదర్శకంగా వ్యవహరిస్తారు. రమణది ధర్మాగ్రహం. కోపం వస్తే దానిని బాహాటంగానే వ్యక్తపరుస్తారు. రాగద్వేషాలకు అతీతంగా అడుగులు వేస్తారు. స్వయంకృషి, సామాజిక బాధ్యత.. రెండూ ఉండటం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని
అంటారు సన్నిహితులు.
తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం, సంప్రదాయ సంగీతం, తత్వశాస్ర్తాలపై రమణకు మక్కువ ఎక్కువ. న్యాయవ్యవస్థపై రావిశాస్త్రి రచనలను లాయర్లంతా చదవాలని సలహా ఇస్తుంటారు. మాతృభాషలో కేసులు వాదించేందుకు నామోషీ వద్దంటారు. తీర్పులు మాతృభాషలోనే ఉంటే ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందంటారు. జ్యుడిషియల్ అకాడమీ అధ్యక్షుడి హోదాలో అధికార భాషా సంఘంతో కలిసి ‘తెలుగులో న్యాయపాలన’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఆయనకు తెలుగు భాషపై ఎంత మమకారం అంటే, తెలుగునాట ఏ సదస్సుకు హాజరైనా తెలుగులోనే ప్రసంగించడానికి ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాదు, తెలుగు సాహిత్యంలోని అనేక అంశాలను ప్రస్తావిస్తూ సభికులను రంజింపజేస్తారు. శ్రీశ్రీ, రావిశాస్త్రి, కాళోజీ తదితరుల రచనలను సందర్భోచితంగా ఉటంకిస్తారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసం నామఫలకంపై ‘జస్టిస్ నూతలపాటి వెంకటరమణ’ అని తెలుగులోనూ కనిపిస్తుంది.
దురలవాట్లకు దూరం
న్యాయవాదిగా, న్యాయమూర్తిగా రకరకాల వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. సభలు, సమావేశాలు, పార్టీలు సరేసరి. దారి తప్పడానికి ఎన్నో దారులు. అయినా, దురలవాట్లు ఆయన దరి చేరలేదు. ధూమపానానికి, మద్యపానానికి దూరంగా ఉంటారు. ముఖ్యంగా మితాహారి, మృదుభాషి. తనముందు ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడితే అస్సలు ఉపేక్షించరు. ముఖ్యంగా మహిళల గురించి చులకనగా మాట్లాడితే తీవ్రంగా ఖండిస్తారు.
ఆదర్శం..
రమణకు న్యాయవాద వృత్తిలో పీసీ రావ్ (పాటిబండ్ల చంద్రశేఖర్రావు) నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. ఆయన ‘ఇంటర్నేషల్ లా’లో డాక్టరేట్ చేశారు. భారత ప్రభుత్వ అంతర్జాతీయ విభాగంలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా కూడా చేశారు. ఇంటర్నేషల్ కోర్టు ఆఫ్ జస్టిస్ మెరైన్ ట్రైబ్యునల్కు చైర్మన్గా చేశారు. న్యాయ విద్యను అభ్యసిస్తున్న రోజుల్లోనే ఎన్.వి.రమణ .. కేంద్ర న్యాయశాఖ సెక్రటరీగా ఉన్న పీసీ రావ్ లాంటి వాళ్లు పాల్గొనే సదస్సులకు తప్పక హాజరయ్యేవారు.
సంస్కరణాభిలాషి
మృదువైన మాట. సరళమైన భాష. సౌమ్యం, హుందాతనం.. ఈ సుగుణాలకు పెట్టింది పేరు జస్టిస్ రమణ. ఆచరణ యోగ్యమైన విప్లవాత్మక ప్రతిపాదనలెన్నో చేశారు. న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పన తప్పనిసరి అని తరచూ చెప్పేవారు. మౌలిక వసతులంటే సౌకర్యాలే కాదనీ.. జడ్జీల నియామకం దగ్గరనుంచి కేసుల పరిష్కారం వంటివి కూడా ఆ పరిధిలోకే వస్తాయంటారు. బాంబే హైకోర్టు భవన ప్రారంభోత్సవంలో ‘నేషనల్ లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్’ ఉండాలని ప్రతిపాదించారు. కోర్టు భవనాలు, గృహ సముదాయాలు, అత్యాధునిక మౌలిక వసతుల కల్పనకు ఓ ప్రత్యేక వ్యవస్థ ఉండాలనే కీలక సూచన చేశారు. విశాఖలోని దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, న్యాయ విద్యలో సంస్కరణల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. విద్యార్థులకు వ్యక్తిత్వాన్నిచ్చి, సామాజిక స్పృహ కలిగించేలా చదువుల వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాలో, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో న్యాయం కోసం ఎదురుచూస్తున్న ఎందరికో సాయం అందేలా చూశారు. కొవిడ్ కష్టకాలంలో వేలాదిమందికి ఉచిత న్యాయసేవలు అందేలా చేశారు. దేశంలోని 70 శాతం మంది ఉచిత న్యాయసేవలు పొందేందుకు అర్హులేనని ఆయన అంటారు.
ఆయన విజయం వెనుక..
రాజమండ్రికి చెందిన రామారావు కుమార్తె శివమాలను వివాహం చేసుకున్నారు రమణ. జీవిత భాగస్వామిగా భర్తకు అన్నివిధాలా సహకారం అందించారామె. ఆయన పురోగతిలో కీలక భూమిక పోషించారు. రమణ, శివమాల దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి డాక్టర్ శ్రీభువన రేడియాలజిస్ట్. డాక్టర్ నాయుడమ్మగారి అబ్బాయికిచ్చి వివాహం చేశారు. రెండో కుమార్తె తనూజ న్యాయవాది. తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓ వ్యాపారవేత్తతో ఆమె వివాహం జరిగింది.
“ఇంగ్లిష్ వస్తేనే అభివృద్ధి చెందుతామన్న అభిప్రాయం ఒక అపోహ మాత్రమే. అందమైన, మధురమైన తెలుగు భాషను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. దీనిని విస్మరిస్తే కొత్తతరాలు క్షమించవు. ఇంగ్లిష్, హిందీ వంటి భాషలు నేర్చుకోవాలి. అలాగని మాతృభాషను కాదనుకోకూడదు.”