కరోనా గాయాలు సలుపుతూనే ఉన్నాయి. కొవిడ్ వల్ల గుండె, ఊపిరితిత్తులు, పేగులు, కిడ్నీ.. ఇలా దాదాపు అన్ని అవయవాలూ దెబ్బతిన్నాయి. ఎముకలు, కండరాలను సైతం వదల్లేదా మహమ్మారి. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా నీరసం, అలసట తగ్గడం లేదు. కండరాలు బిగుసుకుపోయి ఒంటినొప్పులు వేధిస్తున్నాయి, కీళ్లనొప్పులు బాధిస్తున్నాయి. అన్ని వయసుల వారినీ ఈ సమస్యలు వెంటాడుతున్నాయి. దీనికి పరిష్కారం ఏమిటి? తగిన వైద్యం అందుబాటులో ఉందా? ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు వివిధ పరిష్కారాలు సూచిస్తున్నారు.
కరోనా తగ్గిన తరువాత కీళ్లనొప్పులతో ఇబ్బందిపడుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు. ముఖ్యంగా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, వాస్క్యులర్ నెక్రోసిస్ బారిన పడుతున్న వారు వేలమంది. వైరస్ తగ్గుముఖం పట్టిన రెండు మూడు వారాల తరువాత ఈ ఇబ్బంది మొదలవుతుంది. కొందరిలో స్వల్ప లక్షణాలతో నెలరోజుల్లోనే తగ్గిపోవచ్చు. మరికొందరిని దీర్ఘకాలం వేధించవచ్చు.
వైరల్ ఇన్ఫెక్షన్ – కండరాల నొప్పులు
(ఫైబ్రోమయాల్జియా)
సాధారణంగా ఏ వైరస్ అయినా నేరుగా కండరాలపై ప్రభావం చూపుతుంది. దీంతో కండరాలు బిగుసుకుపోయి (ఫైబ్రోమయాల్జియా) ఒళ్లంతా నొప్పిగా ఉంటుంది. కొవిడ్ కూడా ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ కావడంతో, సహజంగానే కరోనా వైరస్ దాడితో కండరాలు బిగుసుకుపోయి ఒంటినొప్పులు బాధిస్తాయి. ఫలితంగా రోగి అలసటగా, నీరసంగా ఉంటాడు. సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ బాధితులతో పోలిస్తే కరోనా వచ్చినవారిలో ఈ సమస్యలు తీవ్రంగాను, దీర్ఘకాలికంగానూ కనిపిస్తాయి.
మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ..
(పాలి ఆర్థ్రాల్జియా)
చాలా మంది రోగుల్లో పోస్ట్ కరోనాలో పలురకాల కీళ్లనొప్పులు (పాలి ఆర్థ్రాల్జియా) బయటపడతాయి. చికున్గున్యాను తలపించేలా ఇబ్బందిపెడతాయి. ఈ సమస్య ఒక్కో రోగిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిని స్వల్పంగా భయపెట్టినా, చికిత్స అవసరం ఉండకపోవచ్చు. మరికొందరిని మధ్యస్థంగా వేధించవచ్చు. ఇంకొందరిని తీవ్రంగా ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. కొంతమంది రోగుల్లో కీళ్ల వాపు కూడా కనిపిస్తుంది. ఈ నొప్పులు తాత్కాలికమే అయినా ఐదారు నెలలు వదిలిపెట్టవు. అప్పటికే కీళ్ల వాతం ఉన్న రోగులకు పోస్ట్ కొవిడ్లో ఆకస్మికంగా కీళ్ల నొప్పులు తీవ్రస్థాయికి చేరిన సంఘటనలు అనేకం. కీళ్లు బిగుసుకుపోయిన దాఖలాలూ కనిపిస్తాయి. మల్టిపుల్ జాయింట్ పెయిన్స్కు తగిన చికిత్స అందుబాటులో ఉంది. స్వల్పంగా నొప్పులున్న వారికి మాత్రం ఎలాంటి వైద్యం అవసరం లేదు. మధ్య స్థాయి, తీవ్ర స్థాయి నొప్పులకు చికిత్సతోపాటు దీర్ఘకాలిక విశ్రాంతి తప్పనిసరి.
ఎవాస్క్యులర్ నెక్రోసిస్
సాధారణంగా ఈ వ్యాధి తుంటి కీళ్లలో వస్తుంది. ఆ భాగంలోని ‘ఫిమోరల్ హెడ్’ అనే గుండ్రని బంతి వంటి భాగానికి రక్తప్రసరణ స్తంభించిపోవడం దీనికి కారణం. సాధారణంగా కరోనా వైరస్ వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ప్రసరణ ఆగిపోతుంది. ఈ క్రమంలోనే తుంటి కీళ్లపై వైరస్ ప్రభావం చూపుతుంది. కీళ్లలోని ‘ఫిమోరల్ హెడ్’కు రక్తప్రసరణ నిలిచి
పోతుంది. ఫలితంగా కీళ్లు నిర్జీవంగా మారతాయి. స్టెరాయిడ్స్ వాడే వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది.
లక్షణాలు
వ్యాధి నివారణ
రుగ్మత ప్రారంభ దశలోనే ఉంటే.. ఎక్స్రే ద్వారా గుర్తించడం కష్టం. అడ్వాన్స్డ్ స్టేజ్లో మాత్రమే ఎక్స్ కిరణాలు పట్టుకోగలవు. తొలిదశలో అయితే ఎంఆర్ఐ తీయించాల్సిందే. పోస్ట్ కొవిడ్లో తుంటి నొప్పులకు మందులతో ప్రయోజనం కనిపించకపోతే, నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
చికిత్సా పద్ధతులు
సమస్య ప్రారంభంలోనే ఉంటే సాధారణ వైద్యం సరిపోతుంది. తుంటి కీలు దెబ్బతినకుండా కాపాడే అవకాశమూ ఉంది. సమస్య తీవ్రమైనప్పుడు ‘కోర్ డీకంప్రెషన్’ ప్రక్రియద్వారా శస్త్రచికిత్స చేస్తారు. ఆ తరువాత బి-మ్యాక్ (బోన్మ్యారో ఆస్పిరేట్ కాన్సెంట్రేట్)ను ఇంజెక్షన్ రూపంలో శరీరంలోకి పంపుతారు. ఈ రకమైన చికిత్సలో 70 శాతం వరకూ సమస్యను నివారించవచ్చు. రుగ్మత మరింత ముదిరి చివరి దశకు చేరితే తుంటిమార్పిడి శస్త్రచికిత్స (టోటల్ హిప్ రీప్లేస్మెంట్) ఒక్కటే మార్గం.
జాగ్రత్తలు
ప్రధాన లక్షణాలు
చికిత్స
రోగి లక్షణాలను బట్టి చికిత్స అందిస్తారు. నొప్పి నుంచి ఉపశమనం కలిగించే మందులు సిఫారసు చేస్తారు. దీంతోపాటు కొన్నిరకాల వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల బిగుసుకుపోయిన కండరాలు కొంత వదులుగా మారి ఉపశమనం లభిస్తుంది. అయితే, మితిమీరిన కసరత్తు వల్ల కండరాల నొప్పులు పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, వైద్యుల సలహామేరకే వ్యాయామం చేయాలి.
– డాక్టర్ సాగి రాధాకృష్ణారావు
ఆర్థోహెగ్సగాన్ విభాగాధిపతి,
జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్
ప్రతిమ హాస్పిటల్స్, హైదరాబాద్
– మహేశ్వర్రావు బండారి