ప్రతి ముగ్గురు బాలికల్లో ఒకరు ఇంటా, బయటా లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారని వార్తా పత్రికల్లో చదివిన ప్రతిసారీ కోపం కట్టలు తెంచుకుంటుంది. ఉక్రోషం పొంగుకొస్తుంది. అయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి మనది. ముంబై కేంద్రంగా మొదలైన ‘ముక్కామార్’ ఉద్యమం మాత్రం ఓ పరిష్కారాన్ని కనిపెట్టింది. వేలాది బాలికల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నది.
ఇశితా శర్మ నటి, నాట్యకారిణి, ఔత్సాహిక పారిశ్రామిక వేత్త. లలిత కళల కోసం ముంబై నగరంలో ఒక స్టూడియో నడుపుతున్నది. చైనా సంప్రదాయ యుద్ధకళ కుంగ్ ఫూ, మలయాళీ సాహస క్రీడ కలరిపయట్టు కలిపి నేర్చుకున్నది. ఆ సాధన తర్వాత తన ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. అంతకుముందు ఈవ్ టీజర్లను చూడగానే భయపడేది. రాత్రిపూట ప్రయాణమంటే హడలిపోయేది. యుద్ధ విద్యలు సవాళ్లను తట్టుకునేలా ఆమెను సన్నద్ధం చేశాయి.
ఇండియాస్ డాటర్..
నిర్భయ ఘటన, తదనంతర పరిణామాలపై బీబీసీ ఒక డాక్యుమెంటరీ రూపొందించింది. అందులోని ప్రతి దృశ్యం ఆమెతో కన్నీళ్లు పెట్టించింది. ప్రతి గణాంకం గుండెల్లో గునపమై గుచ్చుకుంది. అదే సమయంలో గుడియా అనే అయిదేండ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఇశిత కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఒక్కరి వల్ల అసాధ్యమైంది, నలుగురితో కలిసి సాధించవచ్చని ఇశిత నిశ్చితాభిప్రాయం. కాబట్టే, ఫిట్నెస్ ట్రైనర్ అక్షిత, కుంగ్ఫూ క్రీడాకారిణి అంజలీ చౌదరి, థియేటర్ ఆర్టిస్ట్, సంఘ సేవకురాలు అస్మిత దుబే, బాక్సింగ్ క్రీడాకారిణి భీష్మా మల్లా తదితరులతో కలిసి ‘ముక్కామార్’ను ప్రారంభించింది.
తొలి విజయం
ఐదుగురు బాలికలకు యుద్ధ విద్య పాఠాలు బోధించడంతో ముక్కామార్ కార్యశాల మొదలైంది. ఆ ఐదుగురినీ ఆత్మరక్షణలో రాటు దేలేలా చేశారు. ఆ విషయం పత్రికల ద్వారా తెలియడంతో ఎంతోమంది అమ్మాయిలు నేర్చుకునేందుకు వచ్చారు. వారం రోజులు తిరిగే సరికి ఆ సంఖ్య నాలుగు వందలకు పెరిగింది. శిక్షణ కేంద్రాన్ని బస్తీ నుంచి బీచ్కు మార్చారు. ఆ సాధన యువతుల ఆలోచనలను మార్చింది. తిరగబడే సత్తువనిచ్చింది. మలిదశలో, అమ్మాయిల్ని ప్రోత్సహించేందుకు కుంగ్ ఫూ పోటీలు నిర్వహించారు. ఇదంతా సంతోషం కలిగించే పరిణామమే అయినా.. ఇంకా చాలామంది ధైర్యంగా ముందుకు రాలేకపోవడాన్ని గమనించింది ఇశితా శర్మ. జనంలో నమ్మకం పెంచడానికి ముక్కామార్ పబ్లిక్ ట్రస్ట్ను రిజిస్టర్ చేయించింది. సేవల విస్తరణకు పూనుకున్నది. పాఠశాలల్ని సంప్రదించింది. పాలకులనూ ఒప్పించింది. ప్రస్తుతం, ముంబై పురపాలక పాఠశాలల్లో 6,7,8 తరగతి బాలికలకు వారాంతంలో ముక్కామార్ శిక్షణ తప్పనిసరి. ఈ నాలుగేండ్లలో మూడు వేలమంది ప్రత్యక్షంగా శిక్షణ తీసుకున్నారు. మరో 16 వేల మంది ఆన్లైన్లో ఆత్మరక్షణ పాఠాలు నేర్చుకున్నారు. ‘మార్పు మొదలైంది. అర్ధరాత్రి పూట ముంబై వీధుల్లో అమ్మాయిలు ధైర్యంగా తిరగేరోజు ఎంతో దూరం లేదు’ అని కాన్ఫిడెంట్గా చెబుతుంది ఇశితా శర్మ.