భారతీయ ఉద్యోగులు ఊబకాయం బారిన పడుతున్నారు. ప్రతి పదిలో ఎనిమిది మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వీరిలో చాలామంది ఇప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలతో సతమతం అవుతున్నారు. తాజాగా, నిర్వహించిన ఓ సర్వే.. ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ అనారోగ్యాలలో చాలావరకు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలను చూపించవు. దాంతో, తీవ్రమయ్యే వరకూ బాధితులు వాటిని విస్మరిస్తున్నారని సదరు సర్వే గుర్తించింది. ఇందుకుగల కారణాలను వివరిస్తూ.. గత కొద్దికాలంగా మనుషుల్లో శారీరక శ్రమ తగ్గిపోయింది. దీనికితోడు ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక షుగర్, కార్బొహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతున్నది. వీటన్నిటికీ మించి.. చాలామంది బరువు పెరగడాన్ని అనారోగ్య సమస్యగా భావించడం లేదు. వయసుతోపాటు వచ్చే సహజ మార్పుగానే భావిస్తున్నారు.
ఫలితంగా, లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. నిజానికి అధిక బరువు అనేది రూపానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. అనేక దీర్ఘకాలిక వ్యాధులకు మూలం ఇదే. మధుమేహం రావడానికి ప్రధాన కారణం కూడా అధిక బరువే! శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. శరీరం మోయగలిగే దానికంటే ఎక్కువ బరువు ఉండటం వల్ల మోకాళ్లపై ఒత్తిడి పడి త్వరగా అరిగిపోతున్నాయి. అయితే, ఈ పరిస్థితిని మార్చడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని అధ్యయనకారులు అంటున్నారు. చిన్నపాటి క్రమశిక్షణతో పెద్ద సమస్య నుంచి బయట పడొచ్చని చెబుతున్నారు. రోజుకు కనీసం 30-40 నిమిషాల పాటు వేగవంతమైన నడక, రాత్రి భోజనం త్వరగా చేయడం, కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రొటీన్, ఫైబర్ పెంచడం, ఒత్తిడిని తగ్గించుకోవడం లాంటివి
అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. బరువును ఒక అంకెలా కాకుండా.. భవిష్యత్తు ఆరోగ్యానికి సూచికగా చూడాలని సలహా ఇస్తున్నారు.