ఎడారి ఓడ ఒంటె.. హనుమంతుడి వాహనం ఎలా అయ్యింది?
– అంబటి సుభాష్, నిజామాబాద్
ఆంజనేయుడి వాహనం ఒంటె అని పరాశర సంహితలో పేర్కొన్నారు. మనోవేగంతో సమానంగా ప్రయాణించే వాయుపుత్రుడి వాహనాన్ని గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి ఎక్కడా ప్రస్తావించలేదు. సీతాదేవిని వెతుకుతూ పంపా నదీ తీరానికి రామలక్ష్మణులు చేరుకున్నపుడు, సుగ్రీవుడు వాళ్లను చూసి భయపడతాడు. ధనుర్బాణాలు ధరించి వస్తున్న ఈ వీరులు ఎవరో తెలుసుకొని రమ్మని హనుమను పంపిస్తాడు.
ఆంజనేయుడు మొదటిసారి శ్రీరాముణ్ని కలుసుకున్నది పంపానదీ తీరంలోనే! ఈ ప్రాంతం హనుమకు ఎంతో నచ్చిన ప్రదేశం. ‘పంపాతీర నివాసాయ గంధమాదన వాసినే’ అని స్వామిని కీర్తిస్తారు భక్తులు. అయితే, ఈ నది తీరం వెంబడి ఎడారిని తలపించేలా దట్టమైన ఇసుక మేటలు ఉండేవి. హనుమ ఈ ప్రాంతంలో విహరించడానికి సౌకర్యంగా ఉండటం కోసం, ఇసుకలో తేలికగా నడవగలిగే ఒంటెను సుగ్రీవుడు వాయుపుత్రుడికి బహుమానంగా ఇచ్చాడని ప్రతీతి. అంతేకాదు, హనుమంతుడి ధ్వజంపైన కూడా ఒంటె గుర్తే ఉంటుంది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు వృషభం వంటి బలిష్ఠమైన ఒంటెను వాహనంగా ఎంచుకున్నాడని కూడా పెద్దలు చెబుతారు.
– డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370