చరిత్ర పుస్తకాల్లో ఉంటే చదువరులకే వరం. అదే చరిత్ర వెండితెరకు ఎక్కితే? అందరికీ పండుగే! చరిత్రకు వన్నెలద్దిన వెండితెర చిత్రాలెన్నో! అలనాటి ‘పల్నాటి యుద్ధం’ మొదలు.. మూడేండ్ల కిందట వచ్చిన ‘పానిపట్’ వరకు ఎన్నో సినిమాలు చరిత్రను కండ్లకుకట్టాయి. భారతదేశ వజ్రోత్సవ స్వాతంత్య్ర దినం సందర్భంగా చరిత్ర చెక్కిన చిత్రాల సంగతులు తెలుసుకుందాం. తొడ చరిచి సెల్యూట్ కొడదాం. రొమ్ము విరిచి భారతీయతను చాటుకుందాం!
ప్రసార మాధ్యమాల్లో సినిమాది అగ్రస్థానం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరిపైనా ప్రభావం చూపే సత్తా సినిమాకు ఉంది. అందుకే, సినిమాలన్నా, సినీ నటులన్నా అందరికీ క్రేజ్. మానవ సంబంధాలు, ప్రేమలు, పెండ్లిళ్లు, కుటుంబ బాధ్యతలు, కక్షలు, యుద్ధాలు.. కథాంశం ఏదైనా సినిమా అంత సూటిగా మరేదీ వివరించలేదు. చరిత్ర పుటల్లోకి చేరిపోయి, గ్రంథాలయాల్లో కూరుకుపోతున్న చరిత్ర గ్రంథాలు కోకొల్లలు. వాటిని చదివే ఓపిక ఈ తరానికి ఎక్కడిది? చదివినా బుర్రకెక్కించుకునే వాళ్లూ కరువే! ‘హిస్టరీ’ లెక్చర్ కన్నా.. మిస్టరీ పిక్చర్ బెస్ట్ అనుకునే తరానికి సినిమాలే ఘన చరిత్ర పాఠాలను బోధించే గురువులు. మహాత్ముడి ఆత్మకథ ‘సత్యశోధన’ చదివి తెలుసుకోలేని వాళ్లు, అటెన్బరో తెర కెక్కించిన ‘గాంధీ’ చిత్రం చూస్తే జాతిపిత సంకల్పం ఎంత గొప్పదో అర్థమవుతుంది. మన్యం వీరుడి పోరాటపటిమ ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా చూస్తే తెలుస్తుంది. సినీ చరిత్రను పరికిస్తే జాతీయవాదాన్ని బలపరిచే సినిమాలు ఎన్నో కనిపిస్తాయి.
చారిత్రక సినిమాల ట్రెండ్ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో విరివిగానే ఉండేది. పురుషోత్తముడు, అలెగ్జాండర్ పోరు నేపథ్యంలో తెరకెక్కిన ‘సికందర్’ 1941లో సంచలనం సృష్టించింది. స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో బంకించంద్ర ఛటర్జీ నవల ‘ఆనంద్మఠ్’ ఆధారంగా అదే పేరుతో నిర్మించిన సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. తెలుగు సినిమాల విషయానికి వస్తే ‘పల్నాటి యుద్ధం’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘వీరపాండ్య కట్టబ్రహ్మన’, ‘తాండ్ర పాపారాయుడు’ తదితర చిత్రాలు చరిత్ర ఆధారంగా నిర్మితమైనవే! ఆ తర్వాత కాలంలోనూ అడపాదడపా భారతదేశ చరిత్ర, స్వతంత్ర పోరాటంపై పలు చారిత్రక సినిమాలు విడుదలై విజయం సాధించాయి.
వీరగాథలు
కొన్నేండ్లుగా బాలీవుడ్లో చారిత్రక సినిమాల జోరు ఊపందుకుంది. రాజుల కాలంనాటి కథలు వెండితెరపై రాజసం ఒలకబోస్తున్నాయి. చరిత్రకెక్కిన ప్రేమ జంటల కథలు ఒకప్పటి కథాంశం. ఇప్పుడు చరిత్రను మలుపు తిప్పిన సంఘటనల మేళవింపుతో సినిమాలు రూపొందిస్తున్నారు దర్శక నిర్మాతలు. భారత స్వతంత్ర పోరాటంలో 1857 సిపాయి తిరుగుబాటు కీలకమైనది. ఆ పోరాటంలో పాల్గొన్న యోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె జీవితం ఆధారంగా 1953లో ‘ఝాన్సీ కీ రాణి’ సినిమా తెర కెక్కింది. తర్వాత పలు సినిమాల్లో లక్ష్మీబాయి పాత్ర కనిపించింది.
2019లో విడుదలైన ‘మణికర్ణిక’ లక్ష్మీబాయి ధీరత్వాన్ని ఈ తరానికి మరోసారి పరిచయం చేసింది. లక్ష్మీబాయిగా కంగనా రనౌత్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2019లోనే విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ‘కేసరి’లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు. సారాగఢి సిక్కు రెజిమెంట్కు చెందిన 21 మంది సిక్కు యోధులకు, పదివేలమంది అఫ్ఘన్ చొరబాటుదారులకు మధ్య 30 గంటలపాటు జరిగిన హోరాహోరీ పోరు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా మరచిపోయిన మన చరిత్రను మళ్లీ గుర్తుచేసింది.
మరాఠా పీష్వాలు, మొఘలుల పోరాటం ఆధారంగా 2020లో విడుదలైన ‘తానాజీ- ది అన్సంగ్ వారియర్’ సినిమా ప్రేక్షకులకు మేటి చరిత్రను పరిచయం చేసింది. పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పృథ్వీరాజ్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకులను పలకరించింది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం దక్కకపోయినా, ఢిల్లీ చివరి హిందూ చక్రవర్తి జీవిత కథ తెలిసినట్టయింది. 2019లో చిరంజీవి హీరోగా వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా రాయలసీమ పాలెగాళ్లకు, బ్రిటిష్ అధికారులకు మధ్య జరిగిన పోరును కండ్ల ముందుంచింది. తెల్లవారి దురాగతాలను దృశ్యమానం చేసింది.
స్ఫూర్తిదాయక ఇతివృత్తాలు స్వతంత్ర సంగ్రామంలో కీలకపాత్ర పోషించిన మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్సింగ్, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్, అంబేడ్కర్ జీవితాల ఆధారంగానూ బయోపిక్ చిత్రాలు విడుదలయ్యాయి. భగత్సింగ్ జీవితంపై ఏకంగా 7 బయోపిక్లు వచ్చాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1965లో విడుదలైన ‘శహీద్’ సినిమా ఎవర్గ్రీన్ లిస్ట్లో చోటు దక్కించుకుంది.
2002లో భగత్సింగ్ బయోపిక్లు ఏకంగా మూడు విడుదలయ్యాయి. వేటికవే ప్రేక్షకుల ఆదరణను పొందాయి. అదే సమయంలో భగత్సింగ్ గొప్పదనాన్ని మరోసారి దేశానికి తెలియజేశాయి. గతేడాది విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన ‘సర్దార్ ఉదమ్’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ‘లగాన్’, ‘గదర్’ తదితర కాల్పనిక సినిమాలు కూడా స్వతంత్ర స్ఫూర్తిని రగిలించాయి. స్వాతంత్య్ర సమరాన్ని, స్వేచ్ఛకోసం జాతీయ నాయకులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకునే తరుణం ఇది. వజ్ర సంకల్పంతో వారు చేసిన పోరాటమే ఈనాటి వజ్రోత్సవ సంబురాలకు ప్రధాన కారణం. వారి చరిత్రను తెలుసుకుందాం. వారు చూపిన తెగువతో దేశాభివృద్ధిలో భాగమవుదాం. జై హింద్!
యుద్ధం
ఇండియా -పాకిస్థాన్, ఇండోచైనా యుద్ధ
నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు కోకొల్లలు. 1997లో వచ్చిన ‘బార్డర్’ యావత్ భారతాన్ని కదిలించింది. సరిహద్దుల్లో సైనికులు ఎదుర్కొనే పరిస్థితులను కండ్లకు కట్టిందీ సినిమా. ‘ఘాజీ’, ‘రాజీ’, ‘భుజ్’ వంటి సినిమాలు 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో జరిగిన పోరాటాలను పరిచయం చేశాయి. 1999 కార్గిల్ యుద్ధ నేపథ్యంలోనూ పలు చిత్రాలను నిర్మించారు. అవన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందినవే. ‘ఎల్ఓసీ కార్గిల్’, ‘లక్ష్య’, ‘టాంగో చార్లీ’ వంటి సినిమాలు సైనికుల త్యాగాలకు అద్దంపట్టాయి. కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన విక్రమ్ బత్రా బయోపిక్ ‘షేర్షా’కు ఈ తరం ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సర్జికల్ స్ట్రయిక్ కథాంశంగా నిర్మించిన ‘ఉరి’ రికార్డు విజయం సాధించింది.