మనదేశంలో మధుమేహ నిర్ధారణ కోసం ‘హెచ్బీఏ1సీ’ పరీక్ష ఫలితాల్నే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ రిపోర్టుల్లో హెచ్బీఏ1సీ స్థాయి 6.5శాతం కన్నా ఎక్కువగా ఉంటే.. ‘డయాబెటిస్’ ఉన్నట్లు పరిగణిస్తారు. అయితే, ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్’లో ప్రచురితమైన తాజా అధ్యయనం.. ‘హెచ్బీఏ1సీ’కి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ పరీక్ష ఫలితాలు.. డయాబెటిస్ను గుర్తించడంలో పొరబడుతున్నట్లు తేల్చింది.
మధుమేహ నిర్ధారణ కోసం ఈ ఒక్క పరీక్షపైనే ఆధారపడటం వల్ల.. కొందరిలో వ్యాధి నిర్ధారణ కావడం లేదని అధ్యయనకారులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉన్నప్పటికీ, హెచ్బీఏ1సీ రిపోర్టులో ‘నార్మల్’ వస్తున్నదని అంటున్నారు. ఇందుకు గల కారణాలనూ వారు వివరిస్తున్నారు. రక్తహీనతతోపాటు వారసత్వంగా వచ్చే రక్త సంబంధమైన కొన్నిరకాల రుగ్మతలు.. హెచ్బీఏ1సీ రీడింగ్లను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయట. ముఖ్యంగా, రక్తహీనత ప్రమాదాన్ని పెంచే జన్యుపరమైన ‘జీ6పీడీ’ లోపం ఉన్నవారిలో హెచ్బీఏ1సీ ఫలితాలు తప్పుగా వస్తున్నాయట.
ఇక్కడ ఆందోళనకర విషయం ఏమిటంటే.. ‘జీ6పీడీ’ లోపం మనదేశంలో ప్రబలంగా ఉన్నది. దేశ జనాభాలో 7.7 శాతం నుంచి 8.5 శాతం వరకూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. వీళ్లందరిలోనూ హెచ్బీఏ1సీ ఫలితాల్లో గ్లూకోజ్ స్థాయుల అంచనాలు తప్పుదారిపట్టే అవకాశం ఉన్నదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇక కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకునే వారిలో రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గులు హెచ్బీఏ1సీలో వెంటనే తేలకపోవచ్చనీ అంటున్నారు. ముఖ్యంగా, మధుమేహం ప్రారంభ దశలో ఉన్నవారిలో రక్త పరీక్షల ఫలితాలు తప్పుగా వస్తున్నాయని చెబుతున్నారు. హెచ్బీఏ1సీ పరీక్షలో మధుమేహం లేదని వచ్చిన చాలామందిలో.. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసినప్పుడు డయాబెటిస్/ ప్రీ-డయాబెటిస్ ఉన్నట్లు తేలిందట.
‘హెచ్బీఏ1సీ’తో పోలిస్తే.. ఓరల్ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్లో ఫలితాలు మెరుగ్గా వచ్చే అవకాశం ఉన్నదని అంటున్నారు. కాబట్టి, డయాబెటిస్ ముప్పు ఉన్నవారు, లక్షణాలు కనిపించినవారు హెచ్బీఏ1సీ పరీక్షతోనే సరిపెట్టుకోవద్దని చెబుతున్నారు. ఓజీటీటీ పరీక్షతోపాటు ఫాస్టింగ్ బ్లడ్షుగర్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు.