ప్రస్తుతం ఆన్లైన్లో ఏ సమాచారం కావాలన్నా.. ‘గూగుల్ సెర్చ్’ ఓపెన్ చేయాల్సిందే! ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 శాతం మందికి ఇదే పెద్దదిక్కు. ప్రతిరోజూ 850 కోట్ల శోధనలను ప్రాసెస్ చేస్తుంది. యూజర్లు అడిగిన సమాచారాన్ని.. సంబంధిత వెబ్లింక్లను వెతికి ఇస్తుంది. అయితే, చాట్జీపీటీ రాకతో గూగుల్ కూడా ‘ఏఐ’ వైపు అడుగులు వేసింది. తన సెర్చ్ ఇంజిన్కు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను అనుసంధానం చేసింది.
ఇప్పటికే అమెరికాలో విడుదలై విజయవంతంగా సేవలు అందిస్తున్న ‘గూగుల్ సెర్చ్ ఏఐ మోడ్’ను భారత్కూ పరిచయం చేసింది. మన దగ్గర మొబైల్, వెబ్ వెర్షన్లలో ఏఐ ఆధారిత శోధనలు చేసుకోవచ్చని గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ వెల్లడించింది. ఇప్పటివరకు గూగుల్లో ఏదైనా వెతికితే.. అందుకు సంబంధించిన వెబ్లింక్లు మాత్రమే వచ్చేవి. కొన్ని సంక్లిష్టమైన ప్రశ్నలకు జవాబులు దొరికేవి కాదు.
కానీ, ఏఐ మోడ్లో.. ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం దొరుకుతుందని ఆల్ఫాబెట్ చెబుతున్నది. వినియోగదారుల మనసులో ఏమున్నా.. గూగుల్ను నేరుగా అడగొచ్చని అంటున్నది. వాటికి గూగుల్ ఏఐ టూల్ ‘జెమిని’ సహాయంతో సమాధానాన్ని అందిస్తుంది. అందుకే, ఈ గూగుల్ సెర్చ్ ఏఐ మోడ్ను ‘జెమిని 2.5’ వెర్షన్గా చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే అందుబాటులో ఉన్నది. త్వరలోనే తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ సేవలు అందించనున్నది.