పెంపుడు కుక్కల మీద ప్రేమ ఉండటం సహజమే. కానీ, దానివల్ల ఒక్కోసారి చిక్కుల్లో పడుతుంటారు కొంతమంది. శునకం పట్ల మితిమీరిన ప్రేమే ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తను సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యేలా చేసింది. కొద్దిరోజుల క్రితం ఆ కుబేరుడు తన పెంపుడు కుక్కను తనతో పాటు చెన్నై తీసుకెళ్లాల్సి వచ్చింది. ప్రాణానికి ప్రాణమైన శునకం ఇబ్బంది పడకుండా.. సౌకర్యం కోసం ఏకంగా రూ. 2.5 లక్షలు ఖర్చు చేసి బిజినెస్ క్లాస్ మొత్తం బుక్ చేశాడు. ఈ విషయం ఆనోటా ఈనోటా చేరి సోషల్ మీడియా చెవిన పడింది. ఇంకేముంది, నెటిజన్లు ఆ యజమానిని అదేపనిగా ట్రోల్ చేస్తున్నారు. ‘ఒక కుక్క ప్రయాణానికి రెండున్నర లక్షలు ఖర్చు చేస్తావా?’, ‘ఆ డబ్బేదో పేద పిల్లల చదువులకు ఉపయోగించొచ్చు కదా!’, ‘అన్ని లక్షలతో ఐదారు పేద కుటుంబాలు ఏడాదిపాటు మూడు పూటలా కడుపు నింపుకొంటాయి బాసూ’ అంటూ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ పెడుతున్నారు.