గర్భసంచిలో గడ్డలు అనేది ఒకప్పుడు అరుదైన సమస్య. ఇప్పుడు నలభై ఏండ్లలోపే కనిపిస్తున్నాయి. టీనేజ్ అమ్మాయిలూ వీటి బారినపడుతున్నారు. నెలసరిలో అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, నెలసరి కాకపోయినా రక్తస్రావం, నడుము నొప్పి, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, మలబద్ధకం, గర్భవిచ్ఛిత్తి, సంతానలేమి.. ఇలా మహిళలను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి. యోగ, ప్రకృతి వైద్యంతో వీటిని నివారించవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ప్రకృతి వైద్యం
ఈ పద్ధతి ద్వారా పండ్లు (దానిమ్మ, బొప్పాయి మొదలైనవి), కూరగాయలు (పాలకూర, బ్రకోలి మొదలైనవి), హోల్ గ్రెయిన్స్ (ఓట్స్, ఉప్పుడు బియ్యం, చిరుధాన్యాలు మొదలైనవి), అవిసె గింజలు, సోయా పదార్థాలు తీసుకోవాలి. ఇవన్నీ ఈస్ట్రోజెన్ స్థాయులను క్రమబద్ధీకరిస్తాయి. పీచు
పదార్థాలను ఎక్కువగా తినాలి. అలాగే చక్కెర, మద్యం, కెఫిన్, మాంసం, ప్యాకేజ్డ్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి. ఇవన్నీ హార్మోన్ల సమతుల్యతను దెబ్బ తీస్తాయి.
యోగ
శారీరక, మానసిక సమస్యలకు దివ్యౌషధం. కొన్ని ప్రత్యేక ఆసనాలు నడుము కింది భాగానికి రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. ప్రాణాయామం, ధ్యానంతో ఈస్ట్రోజెన్, ప్రొజెస్ట్టిరాన్ హార్మోన్ల అసమతుల్యతను సరిచేయవచ్చు. బద్ధకోణాసనం, ఉపవిష్ట కోణాసనం, పశ్చిమ ఉత్థాన ఆసనం, వజ్రాసనం, ప్రాణాయామం, యోగ నిద్ర గర్భసంచిలోని గడ్డల నివారణకు దోహదం చేస్తాయి.