బరువు తగ్గాలనో, ఆరోగ్యం కోసమో.. కొందరు స్ట్రిక్ట్ డైట్ పాటిస్తుంటారు. రోజూ ఒకే రకమైన ఆహారం తీసుకుంటారు. అయితే, ఈ అలవాటు పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారంలో వైవిధ్యం ఉన్నప్పుడే.. గట్ హెల్త్ బాగుంటుందని చెబుతున్నారు.
పేగుల్లో కొన్ని వందల రకాల మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి. మనం తినే రకరకాల ఆహార పదార్థాలతోనే అవి శక్తిని పొందుతాయి. అయితే, ఒకే రకమైన ఆహారం తిన్నప్పుడు.. కేవలం కొన్ని రకాల బ్యాక్టీరియాకు మాత్రమే పోషణ అందుతుంది. మిగిలిన మంచి బ్యాక్టీరియాలు క్రమంగా అంతరించిపోతాయి. అలా, పేగుల్లో బ్యాక్టీరియా వైవిధ్యం తగ్గితే.. జీర్ణక్రియ మందగించడం, రోగనిరోధక శక్తి బలహీనపడటం లాంటి సమస్యలు వస్తాయి. ఇక ఎంత ఆరోగ్యకరమైన ఆహారమైనా సరే.. అందులో అన్నిరకాల విటమిన్లు, ఖనిజాలు ఉండవు. దాంతో, పోషకాహార లోపం ఏర్పడుతుంది. అంతేకాకుండా, శరీరం ఒకే రకమైన ఆహారానికి అలవాటు పడిపోతే.. కొన్నిరోజులకు కొత్తరకం ఆహారాన్ని జీర్ణం చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
దీనివల్ల ఎప్పుడైనా బయట, ఏదైనా కొత్తగా తిన్నప్పుడు కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. ‘రెయిన్బో ప్లేట్’ను ఫాలో అవ్వాలి. భోజనంలో వివిధ రంగుల కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వారానికి కనీసం 30 రకాల మొక్కల ఆధారిత ఆహార పదార్థాలను తీసుకోవాలట. అప్పుడే గట్ హెల్త్ బాగుంటుందని చెబుతున్నారు. ఇక ఆహారంలో పెరుగు, మజ్జిగ లాంటి ప్రో బయోటిక్ పదార్థాలను చేర్చుకుంటే.. మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. పేగుల ఆరోగ్యానికి భరోసా లభిస్తుంది.