అనేకానేక సమస్యలు గుప్పెడంత గుండెను ఉప్పెనలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జీవనశైలి లోపాలు పాపాలై మెడకు చుట్టుకుంటున్నాయి. ఊబకాయం కారణంగా బతుకే బరువైపోతున్నది.మక్కువతో పొట్టలోకి తోసుకుంటున్న పదార్థాల నిండా విషాలూ రసాయనాలే. ఆధునికత పేరుతో అలవాటైపోయిన ధూమపానం జీవితాన్ని బూడిదపాలు చేస్తున్నది. అరవై తర్వాత రావాల్సిన గుండె సమస్యలు నలభైలలోనే దాడి చేస్తున్నాయి. ‘ప్రపంచ గుండె దినోత్సవం’ (సెప్టెంబర్ 29) సందర్భంగా గుండెపోటుకు దారితీసే పరిస్థితులపై అవగాహనా వ్యాసం..
మారుతున్న జీవన విధానం గుండెకు గండంగా మారుతున్నది. ఉన్నచోటే సమస్తమూ సమకూర్చిపెట్టే మార్కెట్ వాతావరణం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనిషిని బద్ధకస్తుడిగా మారుస్తున్నాయి. ఒకప్పుడు అరవై పైబడిన వారిలో మాత్రమే కనిపించే హృద్రోగాలు ప్రస్తుతం 40 ఏండ్లలోపు వారినీ వదలడం లేదు. రక్తనాళాల్లో అవరోధాలే గుండెపోట్లకు ప్రధాన కారణమని తెలుస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.8 కోట్ల మంది కేవలం గుండె, రక్తనాళాల సమస్యలతోనే మృత్యువాత పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మనిషి జీవన విధానం, ఆహారపు అలవాట్లే అని తేల్చేశారు వైద్యనిపుణులు. సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లతో హృద్రోగ మరణాలను 80 శాతం వరకూ నివారించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. గుండె సంరక్షణ పట్ల అవగాహన లేకపోవడం వల్లనే హృద్రోగాలు పెరుగుతున్నాని నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకే ఏటా సెప్టెంబర్ 29ని ‘ప్రపంచ గుండె దినోత్సవం’గా ప్రకటించారు.
రెండు రకాలు
భారతీయులకు జన్యుపరంగా గుండె సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువ. కాకపోతే, నూటికి ఎనభైశాతం సందర్భాలలో హృద్రోగాల నివారణ మన చేతుల్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే గుండె రుగ్మతలకు దారితీసే అంశాలను రెండు
రకాలుగా విభజించారు. ఒకటి సరిదిద్దగలిగేవి, రెండు సరిదిద్దుకోలేనివి. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, వ్యసనాలకు దూరంగా ఉండటం, నిపుణుల సిఫారసుతో తగిన ఔషధాలు వాడటం.. తదితర మార్గాలలో గుండె సమస్యలను 80 శాతం అరికట్టవచ్చు. సాధారణంగా వయసు పెరిగేకొద్దీ గుండె సమస్యలకు ఆస్కారం ఎక్కువే. అరవై దాటిన వారిలో హృద్రోగ సూచనలు పెరుగుతాయి. వయసును నియంత్రించలేం కాబట్టి, ఈ పరిస్థితుల్నీ సరిదిద్దలేం. జన్యుపరమైన అంశాలను కూడా తేలికగా తీసుకోలేం. వంశపారంపర్యంగా వచ్చే గుండె సమస్యలను ఎంత ఆరోగ్యకర జీవనశైలి అయినా అడ్డుకోలేదు. వచ్చిన మార్పుల వల్ల మెనోపాజ్ తరువాత స్త్రీలు హృద్రోగాలకు దగ్గరఅవుతారు.
ధూమపానం
సిగరెట్కు ఒకవైపు నిప్పు, మరోవైపు ముప్పు ఉంటాయి. ధూమపానం మనిషి గుండెకు పొగబెడుతున్నది. నూటికి ముప్పై గుండెపోట్లు ధూమపానం వల్లనే వస్తున్నాయి. పొగ తాగడం వల్ల రక్తం చిక్కబడుతుంది. ఫలితంగా గడ్డకట్టే తత్వం పెరిగిపోతుంది. మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు కఠినంగా మారిపోతాయి. రక్తపోటు బాగా పెరిగిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయి చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. పొగ నేరుగా రక్తనాళాలను దెబ్బతీయడం వల్ల తక్షణమే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. మిగిలినవారితో పోలిస్తే.. ధూమపాన ప్రియులలో గుండెపోటు తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
కొలెస్ట్రాల్ కష్టాలు
ఆహారంలో అమృతమే కాదు, కించిత్ విషమూ ఉంటుంది. అనారోగ్యకర ఆహారం కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. నిత్య వ్యాయామం లేకపోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వారిలో కూడా పైకి ఎలాంటి లక్షణాలూ కనిపించవు. వైద్య పరీక్షల ద్వారానే సమస్య బయటపడుతుంది. సన్నగా ఉన్న
వారిలో కొలెస్ట్రాల్ ఉండదనీ, ఊబకాయుల్లోనే అధికంగా ఉంటుందనీ అనుకోవడం తప్పు. బక్కపలచ వ్యక్తులకూ
కొలెస్ట్రాల్ సమస్య ఉండవచ్చు. రకరకాల కారణాలతో.. మనిషి సంప్రదాయ ఆహారానికి దూరం అవుతున్నాడు. తాజా కూరగాయలు, పళ్లు తీసుకోవడం తగ్గిపోయింది. నూనెలో ముంచితేల్చిన వేపుళ్లు, బేకరీ ఐటమ్స్, జంక్ ఫుడ్ పొట్టలో పేరుకుపోతున్నాయి. ఇవన్నీ గుండెకు శత్రువులే.
ఊబకాయం
పెరిగే ప్రతి కిలో బరువూ మృత్యువు వైపుగా ఓ అడుగే. అధిక రక్తపోటు(బీపీ), మధుమేహం (షుగర్), కొలెస్ట్రాల్
(కొవ్వు).. ఈ మూడింటికీ ప్రధాన కారణం బరువు పెరగడమే. ఒక వ్యక్తి ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉండటమే ఊబకాయం. దీన్ని మధుమేహం,అధిక రక్తపోటుకు ప్రారంభ దశగా భావించాలి. సాధారణంగా బరువు
ఒకేసారి పెరగదు. క్రమంగా అధికం అవుతుంది. తొలిదశలోనే దానిని నియంత్రించడం ఉత్తమం. ఊబకాయానికి అనేక కారణాలు..
శ్రమకు దూరం
ఈ మధ్య కాలంలో శారీరక శ్రమ తగ్గిపోయింది. కరోనా నేపథ్యంలో ఆ ధోరణి ఇంకొంత ముదిరింది. వర్క్ ఫ్రమ్ హోమ్ పుణ్యమాని చాలామంది ఉద్యోగులు నాలుగు గోడల మధ్య కూర్చుని.. గంటల తరబడి పనిచేస్తున్నారు. సమయాభావం వల్ల వైద్య పరీక్షలకు దూరం అవుతున్నారు. దీంతో యువతలోనూ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగిపోయి గుండెపోటుకు దారితీస్తున్నాయి.
తీవ్రమైన ఒత్తిడి
కెరీర్లో, సంపాదనలో పోటీతత్వం పెరిగి పోవడంతో ఒత్తిడి నెత్తినెక్కి కూర్చుం టున్నది. ఫలితంగా గుండె జబ్బులూ పెరుగుతున్నాయి. కరోనా తర్వాత ఉద్యోగాల కోతలు ఎక్కువ అయ్యాయి. దీంతో ఉనికి కోసం పోరాటం మొదలైంది. ప్రతి నిత్యం నెత్తి మీద కత్తి వేలాడుతూ ఉంటుంది. రుణాలు, నెలసరి వాయిదాలు, జీవనశైలి వ్యయాలు, ఉద్యోగ అభద్రత.. అన్నీ కలిసి సగటు జీవిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చిన్న కుటుంబాల్లో సలహాలు ఇచ్చేవారూ కరువు అవుతున్నారు. అన్నీ కలిసి గుండెకు గునపపు పోట్లు పొడుస్తున్నాయి.
వైద్య పరీక్షలు
సాధారణంగా ఈసీజీ ద్వారా గుండె సమస్యలను గుర్తించవచ్చు. అయితే కొంతమందికి మొదటి ఈసీజీలో సమస్య బయట పడదు. ఈసీజీ నార్మల్గా ఉందంటే సమస్యే లేదని అర్థం కాదు. రెండు మూడుసార్లు ఈసీజీ తీస్తే కానీ రుగ్మత నిర్ధారణ కాదు. అంతేకాదు ఎకో పరీక్షలు, టీఎంటీ, రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఆంజియోగ్రామ్లో బ్లాక్లు అధికంగా కనిపిస్తే ఆంజియోప్లాస్టీ, స్టంట్ లేదా బైపాస్ సర్జరీ అవసరం కావచ్చు.
జాగ్రత్త.. జాగ్రత్త!
తొలి శత్రువులు
హృద్రోగ లక్షణాలు:
డాక్టర్ గూడపాటి రమేశ్
గుండె వ్యాధి నిపుణులు
స్టార్ హాస్పిటల్
-మహేశ్వర్రావు బండారి