పిజ్జా ప్రియులను ఇబ్బందిపెట్టే విషయమే ఇది. పిజ్జా మొత్తం బ్రహ్మాండంగా ఉన్నా.. కొనలు మాత్రం రుచీపచీ లేకుండా ఉంటాయి. దీంతో ఆ చివరి ముక్కలు అలానే మిగిలిపోతాయి. ఈ సమస్యను ఎన్నోసార్లు అనుభవించింది స్వాతిరెడ్డి. క్రస్ట్ కూడా టేస్టీగా ఉండేలా ఏదైనా చేయాలనుకుంది. ఆ ఆలోచనలోంచి పుట్టిందే ‘డౌమామా పిజ్జా’. హైదరాబాద్ అమ్మాయి స్వాతిరెడ్డి అందరిలా బిర్యానీతో ప్రేమలో పడలేదు. పాశ్చాత్య పిజ్జాలు తనను బాగా ఆకర్షించాయి. దేశదేశాలు తిరిగి రకరకాల పిజ్జాలు రుచి చూసింది. కానీ, ఏ పిజ్జా కొనభాగంలోనూ రుచి దొరకలేదు. క్రస్ట్ వరకూ కూడా చీజ్ జోడిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించింది. తన ఐడియాతో తనే ప్రేమలో పడిపోయింది. వెంటనే పిజ్జాల వ్యాపారంలోకి అడుగుపెట్టింది.
‘డౌమామా పిజ్జా’ పేరుతో దుకాణం తెరిచింది. కస్టమర్లు చప్పచప్పని క్రస్ట్ను వృథాగా పారేయకుండా ఆలూ మసాలా, గుడ్డు, ఎండు ఫలాలు వంటివి ప్రత్యేక బాక్స్లో పిజ్జాతో పాటు పంపుతుంది స్వాతిరెడ్డి. కస్టమర్లు వాటిని నంజుకొని.. ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినేస్తున్నారు. దీంతో స్విగ్గ్గీ, జొమాటోలో డౌమామా పిజ్జాకు విపరీతంగా ఆర్డర్లు వచ్చేస్తున్నాయి. హైదరాబాద్లో తన బ్రాండ్ను మరింత విస్తరించేందుకు చీఫ్ చెఫ్ శ్రేయా వెల్లిదండతో కలిసి వినూత్నమైన పిజ్జాలు తయారు చేస్తున్నారు స్వాతిరెడ్డి.