కాకులు దూరని కారడవి ఎక్కడ? చీమలు దూరని చిట్టడవి ఎక్కడ? ఇంకెక్కడ.. మన రాష్ట్రంలోనే.. చందమామ కథల్లో చదువుకున్న రమ్యమైన అరణ్యాల దృశ్యం ఇప్పుడు తెలంగాణలో సాకారమవుతున్నది. బక్కచిక్కిన ప్రకృతికాంతకు పచ్చని కవచం తొడిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఎడారి దారిని తలపించే రహదారులకు హరిత హారాన్ని తోరణంగా కట్టింది. పల్లెపల్లెలో వనదేవతను ప్రతిష్ఠించింది. ప్రకృతి ప్రేమికుల చొరవతో.. పచ్చదనం పట్నానికి పరుగెత్తుకు వచ్చింది. ఈ బృహత్ యజ్ఞంలో అందరూ భాగస్వాములవుతున్నారు. సెలెబ్రిటీలు ముందున్నారు.
పచ్చని చెట్లు. చల్లని గాలి పారే యేరు. ఖనిజ నిక్షేపాలు.. అడక్కుండానే ప్రకృతి ప్రసాదించిన వరాలు. ప్రసాదాన్ని ప్రసాదంగా తీసుకుంటే ఏ సమస్యాలేదు! వాటిపై పెత్తనం చేస్తేనే అసలు చిక్కు. తరాల నుంచి నేలతల్లికి పచ్చని చెట్టు‘పుట్టం’ కట్టి పర్యావరణాన్ని కాపాడుతూ వచ్చారు మనవాళ్లు. అయితే, తర్వాతి కాలంలో ఏకోన్ముఖ అభివృద్ధితో.. పచ్చని చెట్లు కూలిపోయాయి. చల్లని గాలి వేడెక్కింది. సెలయేరు చిన్నబోయింది. నిక్షేపాల్లాంటి ఖనిజాల జాలు జాలి కలిగించే స్థితికి చేరుకుంది. ఈ దుస్థితికి విరుగుడు పచ్చదనం పెరగడమే. సారం కోల్పోయిన భూమికి సత్తువ ఇవ్వడానికి మనసారా ప్రయత్నిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగానే ప్రకృతి వనరుల పరిరక్షణలో ముందుండి, అందరినీ భాగస్వాములను చేస్తున్నది. హరిత హారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ ఇలా పలు మార్గాల ద్వారా కోట్లలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నది.
వనాలు సమృద్ధిగా ఉంటేనే రుతుపవనాలు సజావుగా విస్తరిస్తాయి. వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ఇందుకోసం అటవీ విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలుపరుస్తున్నది ప్రభుత్వం. అడవుల పునరుద్ధరణలో భాగంగా, హరిత హారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. తరలిపోయిన వసంతాన్ని వనాలకు తరలించే బాధ్యతను సమర్థంగా పోషిస్తున్నది. ప్రభుత్వ సంకల్పానికి ఎన్నో చేతులు పిడికిలి బిగించి మద్దతు తెలుపుతున్నాయి. ముఖ్యంగా సినీతారలూ ముందుకొస్తున్నారు. వన సంరక్షణలోనే కాదు పర్యావరణ పరిరక్షణలోనూ ప్రజలకు బాధ్యతను గుర్తుచేస్తున్నారు. వినాయక చవితికి ఏకదంతుడి ఎకో విగ్రహాలను కొలువుదీర్చి అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ను స్వీకరించడమే కాదు, సాటి నటులకు అదే సవాలు విసురుతూ ‘మొక్క’వోని దీక్షను కనబరుస్తున్నారు.
సలామ్.. ప్రభాస్
బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ అడవినే దత్తత తీసుకొని తనది వనమంత మనసని చాటుకున్నాడు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లిలో 1,650 ఎకరాల అడవిని దత్తత తీసుకున్నాడు. ఈ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తన తండ్రి యూవీఎస్ రాజు పేరిట రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చాడు. ఈ మొత్తాన్ని ఖాజీపల్లిలోని అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధికి వినియోగించనున్నారు.
నాగ్ ఆదర్శం
వన సంరక్షణలో హీరో అక్కినేని నాగార్జున అందరికీ ఆదర్శంగా నిలిచాడు. దాదాపు వెయ్యి ఎకరాల అడవిని దత్తత తీసుకున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా స్ఫూర్తితో 1,080 ఎకరాల అడవి అభివృద్ధికి ముందుకొచ్చాడు. హైదరాబాద్ శివారులో చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు పేరుమీద అటవీ పార్క్ ఏర్పాటుకు రూ.2 కోట్ల విరాళం అందించాడు.
ఎల్లలు దాటిన గ్రీన్ చాలెంజ్
పచ్చదనమే లక్ష్యంగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. టాలీవుడ్ హీరోలు మొదలుకొని బాలీవుడ్ స్టార్స్ వరకు అందరూ ఈ సవాలును సగౌరవంగా స్వీకరించారు. పచ్చని మొక్కలు నాటి ప్రగతికి నిచ్చెనలు వేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, సమంత, కాజల్ తదితర తెలుగు నటులతోపాటు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, అజయ్ దేవగణ్ తదితర బాలీవుడ్ నటులు కూడా భాగస్వాములు అయ్యారు. ప్రభుత్వ సంకల్పం, ప్రజాప్రతినిధుల చేయూత, ప్రముఖుల చొరవతో ఇప్పుడు తెలంగాణ సీమ పచ్చగా కళకళలాడుతున్నది. అన్నిదారుల్లోనూ బారులు తీరిన చెట్లు దర్శనమిస్తున్నాయి.
పల్లెపల్లెలో మియావాకీ పద్ధతిలో దట్టంగా పెరిగిన చిట్టడవులు కనిపిస్తున్నాయి. మన హైదరాబాద్ ‘వరల్డ్ ట్రీ సిటీ’గా ప్రశంసలు అందుకుంటున్నది. తెలంగాణ ఏర్పడే నాటికి 24 శాతంగా ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. కోట్లలో మొక్కలు నాటి వాటిని పూర్తిస్థాయిలో సంరక్షిస్తున్నది. ఫలితంగా మూడేండ్ల కిందటితో పోలిస్తే మన రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 3 శాతం పెరిగింది. ఏటికేడూ ఈ నిష్పత్తి పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ముందుతరాల భవిష్యత్ పచ్చగా ఉండాలంటే.. పర్యావరణ పరిరక్షణకు మనమూ పాటుపడదాం. మొక్కలు నాటి సెల్ఫీలకు పరిమితం కాకుండా, ఆ మొక్కను కంటికి రెప్పలా కాపాడుకొని, అది చెట్టయ్యాక మరో గ్రీన్ సెల్ఫీ దిగుదాం.