వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబమే. కానీ, ప్రత్యక్ష అనుభవం లేదు. ఉన్నత విద్య చదివారామె. భర్త డాక్టర్. ఏ లోటూలేని సంతోషకరమైన జీవితం. ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్య సమస్య. ఊహించని విధంగా క్యాన్సర్ బారినపడ్డారు. క్యాన్సర్ నేర్పిన పాఠంతో సేంద్రియ వ్యవసాయంలోకి అడుగుపెట్టి ఆదర్శ మహిళా రైతు అనిపించుకుంటున్నారు పార్వతి తోలేటి!
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చొప్పకట్లపాలెం పార్వతి సొంతూరు. వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి ఉన్నది. హైదరాబాద్లో స్థిరపడటంతో వ్యవసాయంతో పెద్దగా అనుబంధం లేకుండా పోయింది. 55 ఏండ్ల వయసులో సేంద్రియ సాగుకు నడుం బిగించింది. ఆరోగ్యకరమైన సమాజం కోసం ఐదేండ్లుగా వ్యవసాయం చేస్తున్నది. మెట్రోసిటీలో ఉంటూ పూర్తి పల్లెటూరి వాతావరణంలో జీవిస్తున్న పార్వతి తోలేటి సాగుబడి పాఠాలు ఆమె మాటల్లోనే..
ఏ సమస్యా లేకున్నా
ఎలాంటి రసాయనాల జాడే లేని స్వచ్ఛమైన కాయగూరలు దొరకడమే భాగ్యమైపోయింది. పురుగుమందుల వాడకం విపరీతంగా పెరగడంతో మనిషి ఆరోగ్యం చెడిపోతున్నది. రోజు రోజుకూ పెరుగుతున్న క్యాన్సర్ రోగులే దీనికి ఉదాహరణ. పాలు, కూరగాయలు, పండ్లు అన్నింట్లోనూ రసాయనాల ప్రభావం అధికమైంది. నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. పైగా సంపూర్ణ శాకాహారిని. 2016లో విపరీతమైన కడుపునొప్పి వచ్చేది. ఎసిడిటీ సమస్యేమో అనుకొని తేలికగా తీసుకున్నా. కానీ ఆరు నెలలు గడిచినా సమస్య తగ్గలేదు. మామూలుగా హర్రీ, వర్రీ, కర్రీ.. ఈ మూడిటితో ఎసిడిటీ వస్తుంది. నాకు ఈ మూడిట్లో ఏ సమస్యా లేదు. ఎందుకైనా మంచిదని ఎండోస్కోపీ చేసుకుంటే క్యాన్సర్ అని తేలింది. నాకు క్యాన్సర్ రావడమేంటని షాకయ్యాను. రేడియేషన్, కీమోథెరపీ అయ్యేసరికి ఆర్నెల్లు దాటింది. కొంతకాలం విశ్రాంతి తీసుకున్నా. అప్పుడే వ్యవసాయం గురించి ఆలోచించాను. రసాయనాలు లేని ఆహారం తీసుకుంటే ఈ సమస్యలు రావని అర్థమైంది. ముఖ్యంగా స్వచ్ఛమైన గాలి ఉండాలనిపించింది. అందుకు తగ్గట్టే ఇంట్లోనే ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయించాను.
ఎకో ఫ్రెండ్లీ జీవితం
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ల దగ్గర మిద్దెతోట నిర్వహించే పద్ధతులు నేర్చుకున్నా. స్వచ్ఛమైన కూరగాయలు మాత్రమే తినాలని ఇంట్లోనే ఎరువులను తయారుచేస్తూ డాబాపై సాగు మొదలుపెట్టాను. స్వచ్ఛమైన గాలినిచ్చే మొక్కలు పెంచాను. వర్షపు నీరు వృథా పోకుండా ఇంకుడు గుంత తవ్వించా. సోలార్ పవర్ వాడుతున్నాం. ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి వచ్చే విధంగా ప్లాన్ చేశాం. ఎలక్ట్రిక్ కారునే వాడటం మొదలుపెట్టాం. కూతురు పెండ్లి కూడా చేసి ఇంట్లో ఖాళీగా ఉంటున్నా. ఎలాగూ వ్యవసాయం గురించి అధ్యయనం చేశాను కాబట్టి దానిపై మరింత దృష్టి పెట్టాను. ఇక రైతుగా మారాలని నిర్ణయించుకున్నా. సేంద్రియ సాగు మొదలుపెట్టాను. నేను పండించిన కాయగూరలే తినడం మొదలుపెట్టాను. నేను క్యాన్సర్ను జయించాను. సేంద్రియ పద్ధతిలో పండిన కాయగూరలు తీసుకుంటే వ్యాధులను జయించే అవకాశం ఉంటుంది.
ఎరువులు మా దగ్గరే
వ్యవసాయం కష్టం అని తెలుసు. అందులోనూ సేంద్రియ సాగు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో ఎక్కడ వ్యవసాయ సమావేశాలు జరిగినా, యూనివర్సిటీల్లో ఎలాంటి సెమినార్లు ఉన్నా వెళ్తుండేదాన్ని. రైతులతో మాట్లాడటం దినచర్యగా పెట్టుకున్నా. ఊళ్లో ఏడెకరాల్లో మామిడి, జామ, సపోట, నిమ్మ, ఉసిరి, అరటి వంటి పండ్లతోటలు, వరి, కందులు, పెసలు, టమాట వంటి పంటలు సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం మొదలుపెట్టాను. అన్నిరకాల పంటలు వేస్తున్నాం. ఆర్గానిక్ వ్యవసాయం కాబట్టి సహజసిద్ధమైన ఎరువులనే వాడాలి. అందుకోసం 10 ఆవులను కొనుగోలు చేశాను. వాటి దగ్గర పాలు ఎక్కువగా పితకం. దూడల కోసమే వదిలేస్తాం. మాకు మేముగా తయారుచేసి పెట్టుకున్న కంపోస్ట్, జీవామృతంతోనే పంటకు ఎరువులు వేస్తున్నాం. వర్మీ కంపోస్ట్ లాంటిది కూడా వాడటం లేదు.
నా దారిలో..
మావారు డాక్టర్ సూర్యనారాయణ రేడియాలజిస్ట్. ముప్పై ఏండ్లుగా వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. నేను వ్యవసాయం చేస్తానంటే సంతోషించారు. నేను వ్యవసాయం చేయగలను అని ధైర్యాన్నిచ్చింది మా బాబాయి రామ కోటేశ్వర్. ఆయన కాలేజీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. నాకు ఎన్నో సూచనలు ఇచ్చేవారు. అలాగే స్థానిక రైతు అప్పారావు పరిచయం అయ్యాడు. అప్పటివరకు ఆయన రసాయన ఎరువులు వాడుతుండేవాడు. నా దగ్గర శిక్షణ తీసుకొని ఇప్పుడు అద్భుతంగా రాణిస్తున్నాడు. సేంద్రియ విధానంలో దిగుబడి కాస్త నెమ్మదిగా ఉంటుంది. మా అవసరాలకు మించి ఎక్కువ పండితే మార్కెట్కు తీసుకెళ్తున్నాం.
భవిష్యత్ తరాల కోసం
ప్రకృతి వ్యవసాయం వల్ల రైతుకు ప్రయోజనం కలుగుతుంది. స్వేచ్ఛ లభిస్తుంది. ఎరువుల దుకాణం, విత్తనాల కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. చీడపీడల దిగులు ఉండదు. ఊళ్లో అన్ని తోటలకు నల్లి తెగులు వచ్చింది. కానీ మా తోటకు అలాంటిదేమీ లేదు. అంతేకాదు, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో శిక్షణ తీసుకొని తేనెటీగల పెంపకం ప్రారంభించాను. మొదట్లో బాగానే అనిపించింది. అయితే, మా పక్క రైతు తన పొలంలో రసాయనాలు వాడటం, అక్కడి మొక్కలపై తేనెటీగలు సంచరించడం వల్ల చనిపోయాయి. మనమే కాదు, మన పక్కవాళ్లూ సేంద్రియసాగుపై దృష్టి సారిస్తేనే వ్యవసాయం మారుతుంది. ప్రారంభించిన ఒకటి రెండు సంవత్సరాలు దిగుబడి తక్కువగా వస్తుంది. కాస్త ఓపికపడితే ప్రయోజనం పొందవచ్చు. రాబోయే తరాలకైనా స్వచ్ఛమైన గాలి, ఆహారం అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకు సేంద్రియ సాగును మించిన ప్రత్యామ్నాయం లేదు.
మా తోటలో సేంద్రియ పద్ధతిలో బంగినపల్లి, రసాలు, తోతాపురి, పందిరి మామిడి వంటివి 300 చెట్లు పెంచాం. గత మే నెలలో 100 వరకు కాతకు వచ్చాయి. వాటిని కొనడానికి రూ.50 వేలు ఇస్తామని కొందరు వచ్చారు. పిల్లలను సాకినట్లు వాటిని పెంచాను. రూ.1.50 లక్షలకు పైనే ఖర్చు అయింది. సేంద్రియ పద్ధతిలో సాగు చేశానని తెలిసీ బేరమాడుతూ తక్కువ ధరకు అడిగారు. పోనీ, వారికి ఇచ్చామే అనుకోండి, మళ్లీ రసాయనాలు వాడి మగ్గపెడతారు. ఇంత కష్టపడి ఏం లాభం? అనిపించింది. పండ్లన్నిటినీ రాత్రికి రాత్రే హైదరాబాద్ తీసుకొచ్చి ఇల్లంతా నింపేశాం. ‘తాతయ్య నేచురల్ ఫార్మ్స్’ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేసి దాంట్లో పెట్టాం. 15 రోజుల్లోనే అన్నీ అమ్ముడయ్యాయి. రూ.1.30 లక్షల ఆదాయం వచ్చింది. ఆరోగ్యంపై, సేంద్రియసాగుపై ఈ మధ్య అవగాహన పెరిగింది. ఇంకా పెరగాలి. ధర ఎక్కువగా ఉంటుందనో, ఇంకో కారణంతోనే వాటిని నిర్లక్ష్యం చేయొద్దు. డిమాండ్ ఉంటేనే కదా మంచి ఆహారం ఇవ్వాలనే వాళ్లూ ముందుకొచ్చేది.
– దాయి శ్రీశైలం