రాజస్థాన్ జాలోర్ జిల్లాలోని ఓ మారుమూల పల్లెలో పుట్టింది లక్ష్మి. బాల్యం నుంచీ చురుకైన విద్యార్థి. ఆమెకు ఓ సోదరుడు ఉన్నాడు. పేరు లక్ష్మణ్. తనూ తెలివైనవాడే. ఇద్దరికీ ఏడాది తేడా. దీంతో ఒకే పాఠశాలలో, ఒకే తరగతిలో చదువుకున్నారు. బాల్యంలోనే పెద్ద దిక్కును కోల్పోయింది ఆ కుటుంబం. కన్నతల్లే సర్వస్వమై పెంచింది. పదో తరగతి పరీక్షలలో ఇద్దరికీ మంచి మార్కులు వచ్చాయి. ‘ఇంతకు మించి చదివించడం నా వల్ల కాదు. పరిస్థితులను అర్థం చేసుకోండి’ అని చెప్పింది తల్లి. లక్ష్మికేమో పెద్ద చదువులు చదవాలని ఆశ.
చెల్లి మనసును గ్రహించిన లక్ష్మణ్.. తనను చదివించే బాధ్యత భుజాన వేసుకున్నాడు. కూలీపని చేసి నాలుగు డబ్బులు సంపాదించడానికి ముంబై బయల్దేరాడు. ఫీజు, పుస్తకాలు, పరీక్ష రుసుము.. చెల్లి చిన్న మెసేజ్ పెడితే చాలు క్షణాల్లో డబ్బు పంపేవాడు. లక్ష్మి కూడా శ్రద్ధగా, పట్టుదలతో చదివింది. ఇంటర్మీడియెట్లో తొంభై ఏడు శాతం మార్కులు సాధించి జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ ప్రతిభను పాలకులు మెచ్చుకున్నారు. గ్రామపెద్దలు కీర్తించారు. మేధావులు ఆకాశానికెత్తారు. పూల దండలతో ఊరేగింపుగా లక్ష్మి ఇంటికి బయల్దేరారు. ఆ సమయానికి ఆమె ఇంట్లో లేదు. ఏ వేళకు వస్తాడో తెలియని అన్నయ్య కోసం.. రైల్వే స్టేషన్లో ఎదురుచూస్తున్నది. చేతిలో పాయసం గిన్నెతో.