చర్లపల్లి ఫేజ్-3, మహాలక్ష్మినగర్. ఎటు చూసినా పరిశ్రమలే. ఏ కంపెనీ బోర్డు పరిశీలించినా ‘యజమాని’ అన్న చోట పురుషుల పేర్లే. శ్రీ మల్హరి మసాలా కంపెనీ బోర్డుపై మాత్రం వినోద చందావత్ అంటూ కుంకుమ బొట్టు పెట్టినట్టు చక్కగా ఓ మహిళ పేరు. చేపల బజార్లో ప్రారంభమైన వినోద వ్యాపార ప్రయాణంలో ఎన్నో మలుపులు.
వినోద ఆంత్రప్రెన్యూర్షిప్ పచ్చళ్ల దుకాణంతో మొదలైంది. తన కలను నిజం చేసుకోవడానికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి హైదరాబాద్ వచ్చిందామె. కాచిగూడలో మల్హరి ఫుడ్స్ పేరుతో చిన్న షాప్ తెరిచింది. స్థానికంగా తయారు చేసే పచ్చళ్లు, పొడులలో కారం ఎక్కువ. ఆ ఘాటు తట్టుకోలేక హైదరాబాద్లో స్థిరపడిన రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వాసులు సొంతూళ్ల నుంచే తెప్పించుకునేవారు. దీంతో, నాన్-హైదరాబాదీల అభిరుచికి, రుచికి తగినట్టు మసాలాలు, పచ్చళ్లు అందించాలని నిర్ణయించుకుంది వినోద. ‘చదువుకొని ఏదైనా మంచి ఉద్యోగం చేసుకోమంటే ఈ పచ్చళ్ల వ్యాపారమేంది?’ అంటూ అప్పటికే కుటుంబ సభ్యులు వారిస్తున్నారు. అయినా వినోద వినలేదు. కట్ చేస్తే చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో మల్హరి మసాలా అండ్ ఆర్గానిక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రాణంపోసుకుంది.
వినోద ఓ సాధారణ గిరిజన యువతి. అమ్మ సక్కుబాయి, నాన్న నాగేశ్వరరావు నాయక్. వెనకా ముందూ ఆస్తులేమీ లేవు. ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారనే మనస్తాపంతో నాగేశ్వరరావు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. సక్కుబాయి అన్నీతానై పిల్లల్ని పెంచింది. పాల్వంచ రాజీవ్గాంధీ మార్కెట్లో చేపల దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించేది. పెద్ద కూతురిగా వినోద మీద కూడా కొంత బాధ్యత పడింది. పొద్దున్నే లేవడం, కాట గొట్టడం, కాంటా జోకడం, ఆకివీడు, నూజివీడు, ఏలూరు నుంచి వచ్చే సరుకును అన్లోడ్ చేసుకోవడం.. రోజంతా ఆ పనులతోనే గడిచిపోయేది.
వినోద చదువులో ఎప్పుడూ ముందుండేది. పనిని, చదువును బ్యాలెన్స్ చేసుకునేది. పొద్దున్నే షాప్ తెరిచి, పనిచూసుకుని సైకిల్ మీద కాలేజీకి వెళ్లేది. తోటి విద్యార్థులు ‘చేపలోల్ల పిల్ల వచ్చిందిరో.. ఇక క్లాసంతా చేపల కంపే’ అంటూ అవమానించేవారు. కానీ వినోద బాధపడేది కాదు. మరింత కసిగా పని చేసేది. సక్కుబాయి మాత్రం తాను పడిన కష్టాలు తన పిల్లలు పడొద్దని అనుకునేది. అందుకే చేపలు అమ్మడానికి రావొద్దని వారించేది. అయినా వినోద వినేది కాదు. కస్టమర్లు కూడా ‘ఏం సక్కుబాయ్! బిడ్డ బంగారం లెక్క ఉంది. ఈ మురికి పని ఎందుకు చేపిస్తున్నవ్?’ అనేవారు. ‘ఇగ రేపటి నుంచి రాదు. నా బిడ్డెను కలెక్టర్ చదివిస్తా’ అని చెప్పుకొనేది. నిజంగానే బిడ్డల్ని బాగా చదివించింది సక్కుబాయి. వినోదను పెద్ద ఆఫీసర్గా చూడాలని అనుకునేది. ‘నువ్వు కలెక్టరయ్యి మనసొంటి పేద గిరిజనులకు సాయం చెయ్యాలె’ అని హైదరాబాద్ పంపింది. వినోద సివిల్స్ పరీక్షల కోసం కోచింగ్ తీసుకున్నది. ప్రిలిమ్స్లో అర్హత సాధించి. మెయిన్స్ కూడా రాసింది. మరోసారి ప్రయత్నిస్తే సర్వీస్ దక్కేదేమో. కానీ తనకు బిజినెస్ అంటే ఇష్టం. దీంతో ఆ వైపుగా అడుగులు వేసింది.
మార్కెట్ను అర్థం చేసుకోవడానికి ఒక వెహికిల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో టెలికాలర్గా చేరింది వినోద. ఒకసారి నూజివీడు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ వ్యవహారంలో క్లయింట్ చాలా ఇబ్బంది పెట్టాడు. తనే చొరవ తీసుకుని సున్నితంగా డీల్ చేసింది. దీంతో కంపెనీ యాజమాన్యం ఆమె టాలెంట్కు మెచ్చి ఎగ్జిక్యూటివ్గా ప్రమోట్ చేసింది. గ్రాఫిక్ డిజైనర్ సందీప్తో పెండ్లి ఆమె జీవితంలో మరో మలుపు. భర్త ప్రోత్సాహంతో క్యాటరింగ్ బిజినెస్ మొదలుపెట్టింది వినోద. సాఫ్ట్వేర్ కంపెనీలకు భోజనం అందించే ‘డబ్బావాలా కాన్సెప్ట్’ అది. వ్యాపారం బాగానే జరిగేది కానీ, వృథా అధికం. తినే ఆహారాన్ని నేలపాలు చేయడం ఇష్టంలేక.. మల్హరి ఫుడ్స్ను లాంచ్ చేసింది. కానీ, పెట్టుబడికి డబ్బులు అవసరం అయ్యాయి. గిరిజన మహిళలకు ప్రత్యేక రుణాలు ఇస్తున్నారని తెలిసి.. ఓ బ్యాంకును సంప్రదించింది. ‘ఏం చూసి నీకు లోనివ్వాలి? గెట్ అవుట్ ఫ్రమ్ మై బ్యాంక్’ అంటూ ఒక మహిళా మేనేజర్ ఫైల్ విసిరి మొహాన కొట్టింది. అలాంటి అహంభావులకు బుద్ధి చెప్పడానికైనా తాను ఆంత్రప్రెన్యూర్ కావాలని మరింత బలంగా నిశ్చయించుకుంది వినోద. మొత్తానికి మరో బ్యాంకు కొంత రుణం మంజూరు చేసింది. తెలిసినవారి ద్వారా కొంత అప్పు తీసుకుని చర్లపల్లిలో యూనిట్ ప్రారంభించింది. గత ఉగాది నుంచి ‘నమస్తే కిచెన్’ పేరుతో మరిన్ని ఉత్పత్తులు జోడించింది. మొత్తం 24 రకాల మసాలాలు, పచ్చళ్లు, పొడులు అందిస్తున్నది. డీ-మార్ట్, క్యూ-మార్ట్ వంటి రిటైల్ దిగ్గజాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నది వినోద. ప్రస్తుతం మల్హరి మసాలా ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ర్టాలతో పాటు.. అమెరికా, దుబాయ్, యూకే వంటి దేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. నెలవారీ టర్నోవర్ పది లక్షలకు చేరువలో ఉంది.
‘దశాబ్దాలుగా పాతుకుపోయిన బ్రాండ్లకు దీటుగా ఒక కొత్త వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనేది నా ఆశయం. గిరిజన ఆంత్రప్రెన్యూర్గా ఇది నా తొలి విజయం’ -వినోద
-దాయి శ్రీశైలం
-జి.భాస్కర్