లక్షణాల విషయంలో అక్షరాలా క్షయను పోలి ఉంటుంది కానీ, ట్యూబర్క్యులోసిస్ కానే కాదు. ఎందుకొస్తుందో చెప్పలేం. ఒక్కసారి వచ్చిందంటే.. చాపకింద నీరులా జీర్ణ వ్యవస్థ మొత్తం విస్తరిస్తుంది. పెద్దపేగుకు పెద్ద గండమై కూర్చుంటుంది. చిన్నపేగు చితికిపోయేలా చేస్తుంది. చికిత్స ఆలస్యమైనకొద్దీ సమస్యే. చివరికి క్యాన్సర్గానూ పరిణమించవచ్చు. కాబట్టి, పేగు పూత లేదా క్రోన్స్ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
మానవ శరీరంలో ప్రతి అవయవమూ ముఖ్యమైందే. ఒకటి ఎక్కువని, ఒకటి తక్కువని చెప్పలేం. దేని ప్రాధాన్యం దానిదే. మనిషి మనుగడకు జీర్ణ వ్యవస్థ ఎంతో కీలకం. ఎందుకంటే, మనం తీసుకునే ఆహారం ఉదరంలోకి వెళ్లిన దగ్గర నుంచీ పరిపూర్ణంగా పక్వమై, అనవసర వ్యర్థాలు మలినాల రూపంలో బయటికి వెళ్లే వరకూ.. జీర్ణ వ్యవస్థదే మొత్తం బాధ్యత. ఈ వ్యవస్థ మీద పేగులదే పెత్తనం. అందులో ఒకటి చిన్నపేగు, రెండోది పెద్దపేగు. పేగుల సమర్థత, ఆరోగ్యంపైనే జీర్ణ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. పేగులకు వచ్చే ప్రధాన సమస్య.. క్రోన్స్ వ్యాధి లేదా పేగు పూత. ఈ రుగ్మత జీర్ణ వ్యవస్థను ప్రమాదంలో నెట్టేస్తుంది. చిన్నపేగు లేదా పెద్దపేగు.. ఏ భాగాన్ని అయినా దెబ్బ తీస్తుంది. నోటి దగ్గర నుంచి గుదమార్గం వరకు ఎక్కడైనా పేగుపూత సమస్య ఉత్పన్నం కావచ్చు. తొలిదశలోనే గుర్తించి చికిత్స చేస్తే రోగి బయటపడతాడు. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం క్యాన్సర్కు దారితీయవచ్చు. అసలు క్రోన్స్ వ్యాధి అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, కారణాలేమిటి, నిర్ధారణ పద్ధతులెన్ని.. తదితర వివరాలను తెలుసుకుందాం.
ఎన్నో అపోహలు శరీరంలో ఏ భాగమైనా ఒరుసుకుపోయినట్టు ఎర్రబారిపోయి వాపు, మంట తదితర సమస్యలు ఉంటే.. ‘ఇన్ఫ్లమేషన్’గా పరిగణిస్తారు. నోరు, అన్నవాహిక, జీర్ణవ్యవస్థ నుంచి మలద్వారం వరకు ఎక్కడ ఈ లక్షణాలు కనిపించినా.. క్రోన్స్ వ్యాధి లేదా పేగు పూత వ్యాధిగా అనుమానించాల్సిందే. గతంలో దీన్ని ‘వెస్ట్రన్ డిసీజ్’గా పిలిచేవారు. ఈ రుగ్మత పాశ్చాత్య దేశాల్లో మాత్రమే వస్తుందని భావించడమే ఇందుకు కారణం. కానీ ఆ అంచనా అబద్ధమని తేలిపోయింది. గత పదిహేను, ఇరవై సంవత్సరాల నుంచీ మనదేశంలోనూ కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే, దీన్ని ‘రీజనల్ ఐలైటిస్’గా పరిగణించేవారు. అంటే, వ్యాధి చిన్నపేగు చివరి భాగాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుందని బలంగా నమ్మేవారు. కానీ, నోటి నుంచి గుదద్వారం వరకు ఎక్కడైనా వ్యాపించవచ్చని తదుపరి అధ్యయనాల్లో రుజువైంది. అయితే, చిన్నపేగు, పెద్దపేగు విషయంలోనే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దాదాపు 40 శాతం సందర్భాల్లో రెండిటినీ నిర్వీర్యం చేస్తే కనుక..‘ఇలియో కొలైటిస్’ అంటారు. పెద్ద పేగును మాత్రమే ప్రభావితం చేసే ఆస్కారం 25 శాతం మేర ఉంటుంది. ఇలాంటి సమస్యను ‘కొలైటిస్’ అంటారు. చిన్నపేగును మాత్రమే ప్రభావితం చేసే అవకాశం 30 శాతం మేర ఉంటుంది. దీన్ని ‘ఇలైటిస్’ లేదా ‘జెజినో ఇలైటిస్’ అంటారు. జీర్ణకోశంపై అతి తక్కువగా.. అదీ 5 శాతం మాత్రమే ప్రభావం చూపితే ‘గ్యాస్ట్రో డియోడినైటిస్’గా భావించాల్సి ఉంటుంది. క్రోన్స్ వ్యాధికి కచ్చితమైన కారణాలు లేవు. ఇదొక ఆటో ఇమ్యూన్ డిసీజ్.
టీబీ లక్షణాలకు దగ్గరగా..
మన దేశంలో ఇప్పటికీ టీబీ కేసులు అధికం. అయితే పేగులో వచ్చే టీబీకి, క్రోన్స్ వ్యాధికి దగ్గరి పోలిక ఉంటుంది. దీంతో జనం కొంత అయోమయానికి గురికావడం సహజమే. లక్షణాలు ఒకటే అయినా, తీవ్రత వేరుగా ఉంటుంది. చికిత్స కూడా వేరుగానే ఉంటుంది. పేగుల్లో వచ్చే టీబీకి ఆరు నుంచి తొమ్మిది నెలల చికిత్స సరిపోతుంది. దాదాపుగా మళ్లీ రాదు. కానీ క్రోన్స్ మాత్రం చికిత్స తీసుకున్న తర్వాత కూడా వచ్చే అవకాశాలు పుష్కలం. అందుకే దీన్ని దీర్ఘకాలిక వ్యాధిగా పరిగణిస్తారు.
నిర్ధారణ ముఖ్యం
క్రోన్స్ వ్యాధి టీబీని పోలి ఉండటం వల్ల ఎక్కడా పొరపడకుండా, సమర్థమంతమైన చికిత్స ఇవ్వాలి. ఇందుకు కచ్చితమైన నిర్ధారణ అవసరం. లేదంటే వ్యాధి ఒకటి అయితే, వైద్యం మరొకటి అవుతుంది. కొత్త సమస్యలు రావచ్చు. రోగి ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చు.
ఇవీ పద్ధతులు:
.. పైన పేర్కొన్న అన్ని పరీక్షలూ ప్రతి రోగికి చేయాల్సిన అవసరం లేదు. వ్యాధి తీవ్రత, రోగి ఆరోగ్య పరిస్థితిని బేరీజువేసి.. ఎలాంటి రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలన్నది వైద్యులే నిర్ణయిస్తారు. ఇలియో కొలనోస్కోపీ, క్యాప్సూల్ ఎండోస్కోపీ అనేవి క్రోన్స్ వ్యాధి నిర్ధారణలో కచ్చితమైన పాత్రను పోషిస్తాయి. వీటి ద్వారా రియల్ టైమ్లో పెద్దపేగు, చిన్నపేగులను చూడటమే కాకుండా, బయాప్సీ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల క్రోన్స్ వ్యాధిని ఇతర వ్యాధులతో స్పష్టంగా వేరుచేసి చూడవచ్చు. దీంతోపాటు ఎంట్రోస్కోపీ సాయంతో పెద్ద పేగు, చిన్న పేగును పూర్తిగా పరిశీలించే అవకాశమూ ఉంటుంది. పెద్దపేగు అధికంగా ప్రభావితమైతే, మొదట ఇలియో కొలనోస్కోపీ చేస్తారు. చిన్నపేగు అధికంగా ప్రభావితమైనప్పుడు క్యాప్సూల్ ఎండోస్కోపీ-ఎంట్రో స్కోపీ తక్షణం చేయాల్సి ఉంటుంది. సీటీ-ఎంట్రోైక్లెసిస్, ఎంఆర్ ఎంట్రోగ్రఫీల ద్వారా క్రోన్స్ వ్యాధిని నిర్ధారించడమే కాకుండా, వ్యాధి ప్రభావంతో వచ్చే సమస్యలను అంచనా వేయవచ్చు. ఆ తర్వాత తగిన చికిత్స అందించవచ్చు.
చికిత్సా విధానం
అప్పట్లో క్రోన్స్ వ్యాధికి చికిత్సే లేదని భావించేవారు. కానీ క్లినికల్గా వ్యాధి నిర్ధారణ జరిగిన తరువాత, స్టిరాయిడ్ ట్రీట్మెంట్ ప్రారంభించారు. ఇది తొలిదశ చికిత్స. కార్టికో స్ట్టిరాయిడ్స్ వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. అందుకని దీర్ఘకాలం కొనసాగించరు. కొందరు రోగుల శరీరాలు ఈ చికిత్సకు స్పందించకపోవచ్చు కూడా. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు స్పందించడానికి కొంత సమయం పట్టవచ్చు. కొన్ని సందర్భాలలో యాంటీ టీఎన్ఎఫ్-యాంటీ బాడీ (ఇన్ఫ్లెక్సిమాబ్, అడాలిముమాబ్) ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కొంత ఖరీదైన వ్యవహారం. ఆరోగ్య పరిస్థితినిబట్టి కొన్ని ఏండ్లపాటు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే పేగులో బ్లాక్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ దశలో ‘బెలూన్ డయల్టేషన్’ చేయాల్సి ఉంటుంది. లేదంటే శస్త్రచికిత్సే మార్గం.
– డాక్టర్ ఇ. రామాంజనేయులు
కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్
స్టార్ హాస్పిటల్, హైదరాబాద్
— మహేశ్వర్రావు బండారి