కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ వ్యవసాయాధికారి తన ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఒక ఊరికి వెళ్లాడు. ఆ ఊరి దారి పొడవునా తమలపాకు తోటలు కనిపించాయి. ఏపుగా పెరిగిన పచ్చటి తమలపాకు తీగలు, కర్రలకు, పందిళ్లకు అవి అల్లుకున్న తీరును కన్నులార్పకుండా చూశాడు. ఊర్లోని కొందరు రైతులతో మాట్లాడి కొన్ని వ్యవసాయ సూచనలు చేశాడు. అలాగే మర్యాదపూర్వకంగా ఆ ఊరి సర్పంచ్ను కలిశాడు. ఆ ఊర్లో పండే పంటలు, నీటి వనరులు, రైతులు ఎదుర్కొనే ఇతర సమస్యల గురించి తెలుసుకున్నాడు. మాటల సందర్భంలో ‘మీ ఊర్లో తమలపాకు తోటలు ఎక్కువగా ఉన్నాయి, చుట్టుపక్కల పల్లెల్లో ఈ తోటలు లేవు.
ఇక్కడి నేల కూడా వాటికి అంత అనువైనది కాదు కదా. వాటిని పండించడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా?’ అని అడిగాడు. సర్పంచ్ చిన్నగా నవ్వి ఇలా చెప్పాడు ‘పాతికేళ్ల క్రితం ఈ ఊర్లో వాళ్లందరూ విరాళాలు వేసుకుని ఆంజనేయస్వామి గుడి కట్టారు. పూజారిని కూడా నియమించారు. తమలపాకుల ప్రియుడైన స్వామికి ప్రతి మంగళవారం పూజలు చేసి దండలు వేయడం ప్రారంభించారు. అయితే ఇది పల్లెటూరు కాబట్టి ఇక్కడ పూజా సమయానికి తమలపాకులు దొరికేవి కావు. పట్టణానికి వెళ్లి తీసుకురావడం కష్టమయ్యేది. మరీ వానకాలంలో అసలు కుదిరేది కాదు. అందుకని రైతులమైన మేము ప్రయోగం చేద్దామని మొదటగా ఒకరి పొలంలో తమలపాకుల తోట వేశాం.
దేవుడి దయవల్ల బాగానే పండింది. దాంతో ఈ ఊర్లో వాళ్లందరూ వీటినే పండించడం ప్రారంభించారు. అప్పటినుంచీ స్వామికి ప్రతి నిత్యం తమలపాకుల దండలు వెయ్యడం, పూజలు చేయడం ఇక్కడ సాధారణమై పోయింది. దానికితోడు రైతులు తాము పండించిన తమలపాకులను పట్టణానికి తీసుకెళ్లి అమ్ముకోవడం ద్వారా చాలామందికి జీవనోపాధి దొరికినట్లయ్యింది’ అని చెప్పాడు. ఆసక్తిగా విన్న ఆ అధికారికి మనసుంటే మార్గముంటుందని పెద్దలు ఎప్పుడో చెప్పారన్న విషయం గుర్తుకొచ్చింది. నేరుగా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని, ఆకు పూజ చేసి అక్కడినుంచి కదిలాడు….?
-ఆర్సీ కృష్ణస్వామి రాజు
93936 62821