వారమంతా కాంక్రిట్ జంగిల్లో పనిచేసి అలసిపోయే నగరవాసులు వారాంతంలోనైనా మనసుకు హాయ్నిచ్చే ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి పర్యాటక ప్రేమికులకు ప్రకృతి అందాలు, కొండలు, జలాశయాలు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలు ఇలా భిన్నమైన అనుభూతులను అందించే ప్రదేశాలు హైదరాబాద్కు దగ్గర్లోనే ఉండటం విశేషం. వీకెండ్ టూర్కి ది బెస్ట్గా నిలిచే ఆ పర్యాటక ప్రదేశాలపై ఓ లుక్కెద్దాం రండి..
అనంతగిరి కొండలు: ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి అనంతగిరి కొండలు అత్యంత అనుకూలమైన టూరిస్ట్ స్పాట్. హైదరాబాద్ నుంచి సుమారు 80- 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి సాధారణంగా 2 గంటల సమయంలో చేరుకోవచ్చు. అడవులు, కొండలు, పచ్చని వాతావరణం, ప్రశాంతమైన రోడ్లు ఈ ప్రయాణానికి ప్రత్యేక ఆకర్షణ. అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించడంతో పాటు ప్రకృతి మధ్య వాకింగ్, చిన్ని ట్రెకింగ్, ఫొటోగ్రఫీ లాంటివి చేయవచ్చు.
యాదగిరిగుట్ట: హైదరాబాద్ నుంచి దాదాపు 55-65 కిలోమీటర్ల దూరంలో ఉండే యాదాద్రికి సాధారణంగా గంట నుంచి గంటన్నరలో చేరుకోవచ్చు. లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనం కోసం భక్తులు ఇకడికి వస్తుంటారు. ఆలయ దర్శనంతో పాటు యాదాద్రి పరిసరాలలో ప్రశాంతంగా గడపవచ్చు. ఒక్కరోజు సెలవు తీసుకునేవారికి ఇది మంచి ట్రిప్.
నాగార్జునసాగర్: హైదరాబాద్ నుంచి సుమారు 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే రోడ్డు మార్గంలో 3 నుంచి 4 గంటలు పడుతుంది. నీటి అందాలతో పాటు నాగార్జునకొండకు సంబంధించిన చారిత్రక, బౌద్ధ ప్రదేశాలను కూడా ట్రిప్లో చూడవచ్చు. టైం, అందుబాటును బట్టి బోటింగ్ వంటి వాటిని కూడా ఆస్వాదించవచ్చు.
వరంగల్: రాష్ట్ర రాజధాని నుంచి వరంగల్ దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గంలో సుమారు మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు. కాకతీయుల వైభవానికి అద్దం పట్టే వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయం వంటి ప్రదేశాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. టైం ఉంటే వరంగల్ నుంచి రామప్ప ఆలయానికి వెళ్లడం ద్వారా ట్రిప్ మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది.
శ్రీశైలం: హైదరాబాద్ నుంచి సుమారు 210-230 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం చేరుకోవడానికి 5 నుంచి 6 గంటల ప్రయాణించాల్సి ఉంటుంది. నల్లమల అటవీ ప్రాంతం, కొండలు, లోయలు, కృష్ణా నది పరిసరాలు ప్రయాణంలో ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. మల్లికార్జున స్వామి ఆలయం ప్రధాన ఆధ్యాత్మిక ఆకర్షణ కాగా చుట్టుపకల వ్యూ పాయింట్లు ట్రిప్ను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.