బాక్సాఫీస్ వద్ద కాసులవర్షం కురవాలంటే దర్శకుడికి మాస్పల్స్ తెలిసి ఉండాలి. వాణిజ్య పంథాలో కథను వైవిధ్యంగా చెప్పే నేర్పు ఉండాలి. ఈ విద్యను బాగా వంటబట్టించుకున్నారు యువ దర్శకుడు కల్యాణ్కృష్ణ కురసాల. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఆయన ‘నేల టికెట్’, ‘రారండోయ్ వేడుకచూద్దాం’ చిత్రాలతో సత్తా చాటారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘బంగార్రాజు’.నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రధారులు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కల్యాణ్కృష్ణ చెప్పిన సంగతులు..
సినిమా విడుదలైన రోజే సీక్వెల్గా ‘బంగార్రాజు’ చేయాలని ఫిక్సయ్యాం. నేను ఇప్పటివరకు దర్శకత్వం వహించిన నాలుగు చిత్రాల్లో మూడింటికి నాగార్జున గారే నిర్మాత. వృత్తిపరంగా, వ్యక్తి
గతంగా ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆరేండ్ల నుంచి నాకు ప్రతి విషయంలో సహకారం అందిస్తున్నారు. సీక్వెల్ ఐడియా చెప్పగానే వెంటనే అంగీకరించారు.
2014లో నాగార్జున గారితో ఓ ఫ్యామిలీ లవ్స్టోరీ ప్లాన్ చేశాను. ఆ సినిమా ప్రయత్నాల్లో ఉండగా నిర్మాత రామ్మోహన్ తాను రాసుకున్న ‘సోగ్గాడే చిన్నినాయనా’ కథతో నన్ను సంప్రదించారు. రామ్మోహన్, నాగార్జున గారు మంచి స్నేహితులు. వారి సలహాతో మొదట అనుకున్న ప్రేమకథను పక్కనబెట్టి.. యాక్షన్ అంశాలున్న ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా దర్శకత్వ బాధ్యతల్ని స్వీకరించా. అలా నాగార్జున గారితో నా ప్రయాణం మొదలైంది.
‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి కొనసాగింపుగా ఉంటుంది. ఆ సినిమా కథకు ఎక్కడ శుభం కార్డు పడిందో అక్కడినుంచే ‘బంగార్రాజు’ ప్రయాణం మొదలవుతుంది. తరాల అంతరాల్ని స్పృశిస్తూ వినోదం, భావోద్వేగాల కలబోతగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఓ పర్ఫెక్ట్ సీక్వెల్గా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో ఏడుగురు కథానాయికలు కనిపిస్తారు. కథకు అనుగుణంగానే వారిని తీసుకున్నాం.
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే పెద్ద చాలెంజ్లా అనిపించింది. అన్నిటికన్నా ముఖ్యంగా.. సీక్వెల్ అనగానే తొలిభాగంతో పోల్చి చూస్తారు. అందులోనూ ‘సోగ్గాడే చిన్నినాయనా’ పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాకు మించి ‘బంగార్రాజు’ను తీయాలనుకున్నాం. ఈ క్రమంలో కాస్త పనిభారం పెరిగింది. సినిమాలో 35 నిమిషాల పాటు ఉండే కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. భారీ తారాగణంతో, అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కించాం. మేకింగ్లో కొన్ని కష్టాలు ఎదురైనా అవుట్పుట్ చూసుకొని అంతా సంతోషపడ్డాం.
ఈ సినిమాకు సంగీతం ఆయువుపట్టు. మొత్తం ఆరు పాటల్లో ఇప్పటివరకు మూడు పాటలు విడుదలఅయ్యాయి. ప్రతి పాటా దేనికదే ప్రత్యేకంగా అనిపిస్తుంది. దృశ్యపరంగా కూడా కన్నులపండువగా ఉంటాయి. కథలోని ఎమోషన్స్ వల్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కుదిరింది. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చాడు.
మోతుబరి కుటుంబాల్లోని వ్యక్తులు దర్జాగా, ఠీవిగా కనిపిస్తారు. బంగార్రాజు అలాంటివాడే. ఆ పాత్ర లుక్ కోసం చాలా డిజైన్స్ అనుకున్నాం. నేటివిటీని ప్రతిబింబిస్తూ హుందాతనం కనిపించాలనుకున్నాం. చివరికి ఈ గెటప్ ఖరారు చేశాం. బంగార్రాజు లుక్ చాలా బాగుందని అందరూ ప్రశంసిస్తున్నారు.
సినిమాలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. బీటెక్ పూర్తి చేసింది కాబట్టి ఊరిలో అందరికంటే తానే తెలివైన అమ్మాయి అనే భ్రమలో ఉంటుంది. కృతి శెట్టి పాత్ర యువతరాన్ని ఆకట్టుకుంటుంది.
వినోదం, యాక్షన్, ప్రేమకథలు.. ఇలా ఏ తరహా సినిమాల్ని ఎంచుకున్నా అందులో హృదయాన్ని కదిలించే ఉద్వేగాలు ఉండాలన్నదే నా సిద్ధాంతం. సినిమా ఎక్కువమందికి నచ్చాలంటే జీవితాల్లోని భావోద్వేగాల్ని ఒడిసిపట్టుకోగలగాలి. అప్పుడే ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. కలెక్షన్లు కురిపిస్తుంది.
స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్రాజా నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నా. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అంతా ఫైనలైజ్ అయ్యాక ఆ వివరాలు వెల్లడిస్తా. ప్రస్తుతానికైతే పాన్ ఇండియా సినిమాలు, వెబ్సిరీస్లు చేయాలనే ఆలోచన లేదు. వినూత్నమైన కథాంశాలతో తెలుగులోనే సినిమాలు చేయాలనుకుంటున్నా.
సినిమాలో నాగార్జున గారు, నాగచైతన్య ఇద్దరూ ఇద్దరే! ఎవ్వరూ తగ్గరు. పాత్రల నిడివి కూడా దాదాపు సమానంగా ఉంటుంది. ఇద్దరి పాత్రల్ని సమప్రాధాన్యంతో తీర్చిదిద్దాలనే ఆలోచన వల్ల స్క్రిప్ట్ సిద్ధమవడానికి ఎక్కువ సమయం పట్టింది. నాగచైతన్యది అతిథి పాత్ర అని చాలా మంది భావించారు. అలాంటిదేమీ లేదు. ఇటీవల సినిమా సెన్సార్ పూర్తయింది. ఎలాంటి కట్స్ లేకుండా ‘యూఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చూసిన సెన్సార్వాళ్లు ఓ పండుగలా ఉందని
మెచ్చుకున్నారు. వారి ప్రశంస మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
–సినిమా డెస్క్