‘తూనీగ తూనీగ’ సినిమాతో అందాల తార రియా చక్రవర్తి వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఏడాదికి ఓ సినిమా చేస్తూ గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అయిదేళ్ల క్రితం సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో రియా చక్రవర్తి వార్తల్లోకి ఎక్కింది. అరెస్ట్ అయింది. కేసు సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. సీబీఐ రంగంలోకి దిగింది. రియా బెయిల్పై విడుదలైంది. సుదీర్ఘ విచారణ తర్వాత రియా చక్రవర్తిపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలేమీ లేవని సీబీఐ తేల్చింది. ఇంత జరిగిన తర్వాత రెండే ప్రశ్నలు మిగిలాయి? సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఈ అయిదేళ్ల కాలంలో రియా ఎలా ఉంది? సీబీఐకే అంతు చిక్కలేదు. కాబట్టి మొదట ప్రశ్నకు సమాధానం దొరకదు. యూట్యూబర్లు నేహా దూపియా, అంగడ్ బేడీ రెండో ప్రశ్నకు సమాధానం రాబట్టారు. ఏడాదికి ఓ సినిమా అవకాశం దక్కించుకున్న రియా, బాయ్ ఫ్రెండ్ సుశాంత్ మరణం తర్వాత ఒకే ఒక్క సినిమా చేసింది. అది కూడా ముందు రోజుల్లో కాల్షీట్లు కన్ఫర్మ్ చేసిన సినిమా. వివాదాలు, అవకాశాల విషయంలో ఎంత కుంగిపోయిందో చెబుతూ ‘నేనిప్పుడు సంతోషంగా లేను. భవిష్యత్లో సంతోషాలుంటాయని కోరుకుంటున్నా. ఈ అయిదేళ్లూ ఒక గాయం సలుపుతున్నంత నొప్పిని భరించాను. నిరాధార ఆరోపణలే అయినా ఆ తాలూకు గాయాలు ఇంకా మానలేదు.
అందుకే పెళ్లి కూడా ఇప్పుడు చేసుకోవాలనుకోవట్లేదు’ అని రియా చెప్పింది. తన పెళ్లి గురించి అడిగితే.. ‘ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను. నా వల్ల నా తమ్ముడి భవిష్యత్ కూడా ఇబ్బందుల్లో పడింది. ముందు వాడి పెళ్లి చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను’ అని రియా చెప్పింది. రియాతోపాటు శౌవిక్ కూడా ఇంటర్వ్యూలో ఉన్నాడు. అప్పుడు తను కలుగజేసుకుని ‘అదేమీ లేదు. మా అక్క పెళ్లి తర్వాతే నా పెళ్లి’ అంటూ అడ్డు తగిలాడు. ‘భవిష్యత్లో పెళ్లి చేసుకుంటాను. కానీ, ఇప్పుడే కాదు. మంచి రోజులు వస్తాయి. మనసుకు అయిన గాయం వెంటనే మానదు. అది మానడానికి కొంత పరివర్తన అవసరం. బాధల్ని తట్టుకునేంత పరివర్తన వచ్చేదాకా ఈ కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. అప్పటి దాకా సాధారణ జీవితంలో ఒంటరిగానే ఉండాలనుకుంటున్నా’ అని రియా అన్నది. ఈ అయిదేళ్ల కాలంలో చాలా ఒత్తిడికి గురయ్యామని ఆ ఇంటర్వ్యూలో అక్కాతమ్ముడు వాపోయారు. బెల్ మోగితే భయపడేవాళ్లమని, ఒక్కోసారి బెల్ మోగినట్టుగా భ్రమ కలిగేదని శౌవిక్ చెప్పాడు. జీవితంలో ఇలాంటి నరకాన్ని అనుభవిస్తామని ఎన్నడూ ఊహించలేదు. కానీ, రేపు ఇంతకంటే మంచిగా ఉంటామని మాత్రం ఊహిస్తున్నామని ఇద్దరూ చెప్పారు.