పసిపిల్లలు లేత మొక్కల్లాంటివారు. కళ్లముందే ఎదిగిపోతారు. అంతెత్తు పెరిగిపోతారు. సంతోషించాల్సిన విషయమే ఇది. కానీ, వాళ్ల కోసం అంతంత డబ్బుపెట్టి కొనే షూస్ మాటేమిటి? ఆరేడు నెలలకే మూలన పడేయాల్సిందేనా? ఈ సమస్యకు తన స్టార్టప్ ద్వారా పరిష్కారం అందిస్తున్నారు కృతికా లాల్.
మహారాష్ట్రలోని పుణె కృతిక స్వస్థలం. అక్కడే చదువుకున్నది. ‘అరెట్టో’ పేరుతో ఓ స్టార్టప్ ప్రారంభించి.. పిల్లల పాదరక్షల బ్రాండ్ను సృష్టించింది. వీటికో ప్రత్యేకత ఉంది. పిల్లల ఎత్తుతోపాటు వీటి సైజునూ పెంచుకోవచ్చు.
‘మాది నూటికి నూరుశాతం మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్. భారత్ తరఫున ప్రపంచానికి మేం అందిస్తున్న కానుక’ అని సగర్వంగా ప్రకటిస్తున్నది కృతిక. నవజాత శిశువుల నుంచి మూడేండ్ల పసిబిడ్డల వరకు.. పాదరక్షల సైజు మూడు నెలలకు ఒకసారి మారిపోతుందని అంచనా. కానీ, తల్లిదండ్రులు అన్నన్ని జతల పాదరక్షలు మార్చడం కష్టమే. దీంతో పాతవాటినే తొడిగే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల పిల్లలు అసౌకర్యానికి గురవుతారు. నడకలోనూ తడబాటు ఉంటుంది. అది వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుందని మానసిక నిపుణులు గుర్తించారు. గత సెప్టెంబరులో ‘అరెట్టో’ను స్థాపించింది కృతిక. ఇప్పటికే ఆన్లైన్లో ఐదువేల పాదరక్షల్ని విక్రయించింది కూడా.