‘కన్నడ పరిశ్రమ నన్ను చిన్నతెరకు పరిచయం చేస్తే.. తెలుగు టీవీ ఎంతో గుర్తింపు తెచ్చింది’ అంటారు జీ తెలుగులో ప్రసారం అవుతున్న ‘మిఠాయికొట్టు చిట్టెమ్మ’ సీరియల్లో కీలక పాత్ర పోషిస్తున్న అనూష రావు. ఆ ప్రయాణమంతా ఆమె మాటల్లోనే..
Anusha rao | మాది బెంగళూరు. పుట్టింది, పెరిగింది, చదివింది.. అంతా అక్కడే. ఎంఎస్సీ సైకాలజీ చేశాను. క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. నృత్యం లేదా సైకాలజీ .. ఏదో ఒకటి ఎంచుకుని కెరీర్ ప్రారంభించాలని అనుకున్నా. సైకాలజీ కౌన్సెలర్లకు అప్పట్లో పెద్దగా అవకాశాలు లేవు. అందుకే డ్యాన్స్ వైపే మొగ్గాను. నా విద్యార్థులకు వారంలో రెండు రోజులు క్లాసులు చెప్పేదాన్ని. మిగతా ఐదు రోజులూ ఖాళీగా ఉండేదాన్ని. ఈ సమయంలోనే ఓ సీరియల్కు ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. నిజానికి నాకు నటన మీద ఆసక్తి లేదు.
నాన్న ‘ప్రజావాణి’ పత్రిక ఎడిటర్. అమ్మ బ్యాంక్ మేనేజర్. అన్నయ్య గ్రాఫిక్స్ ఎడిటర్, మా ఆయన కెమెరామెన్. ఎవరూ అడ్డు చెప్పలేదు. అమ్మ మాత్రం ‘ఇంత చదువు చదివి యాక్టింగ్ వైపు వెళ్తానని అంటున్నావ్. ఆలోచించుకో’ అని హెచ్చరించింది. ‘ఒకవేళ అక్కడ సక్సెస్ కాకపోతే నువ్వు చెప్పినట్టు చేస్తాలే’ అంటూ ఆడిషన్కు బయల్దేరాను. రెండు రోజుల తర్వాత డైరెక్టర్ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. నన్ను ఎంపిక చేసినట్టు చెప్పారు. ‘దుర్గ’ అనే సీరియల్లో పాత్ర అది. తర్వాత ‘అగ్ని సాక్షి’లో అవకాశం ఇచ్చారు. అదీ సూపర్ హిట్. అలా, కన్నడలో వరుసగా పదమూడు సీరియల్స్ చేశాను. అన్నీ మంచి పాత్రలే.
మనసిచ్చి చూడు..
తెలుగులో తొలిసారి ‘మనసిచ్చి చూడు’ సీరియల్లో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాను. షూటింగ్ సమయంలో తెలుగు భాష తెలియక చాలా ఇబ్బంది పడ్డాను. తోటి నటుల సహకారంతో ఆ పరిమితినీ అధిగమించాను. ప్రస్తుతం జీ తెలుగు ‘మిఠాయికొట్టు చిట్టెమ్మ’ సెట్స్లో గడగడా తెలుగు మాట్లాడేస్తున్నా. ఒకవైపు విలన్గా కనిపిస్తూనే.. హాయిగా నవ్వించే ప్రయత్నం చేస్తున్నా. ఈ సీరియల్తో తెలుగు పరిశ్రమలో నిలదొక్కుకునే మంచి చాన్స్ కొట్టేశాను. చేసింది రెండు సీరియల్సే అయినా.. కన్నడ పరిశ్రమ కంటే ఇక్కడే ఎక్కువ గుర్తింపు వచ్చింది. తెరమీద చీరకట్టులో కనిపించే నేను.. బయట మాత్రం మోడ్రన్గా ఉంటాను. దేవుడు మనకిచ్చిన దానికి సంతోషించాలనేది నా తత్వం. సంతృప్తిని మించిన సంపద
లేదు కదా!
…? సుంకరి