‘జీవితం ఏదో ఒక చట్రంలో ఇమిడిపోకూడదు. అదే జరిగితే బతుకు కళాకాంతుల్ని కోల్పోతుంది. అందుకే మనిషి నిత్యాగ్నిహోత్రంలా జ్వలించాలి. ప్రతిభకు వన్నెలద్దుకోవాలి. తనను తాను కొత్తగా అభివ్యక్తీకరించుకోవాలి. అప్పుడే, పాత మనిషిలోంచి నూతన మానవుడు ఆవిష్కృతం అవుతాడు’ – ఈ జీవన తాత్వికతనే తాను అనుసరిస్తానని చెప్పారు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య. ‘జై భీమ్’తో ఆయన పేరు అంతర్జాతీయ వేదికలపై మార్మోగింది. నిత్యప్రయోగాల సహవాసి.. సూర్య నటించిన తాజా తమిళ చిత్రం ‘ఎతార్కుమ్ తునిందావన్’.. తెలుగులో ‘ఈటీ’ పేరుతో ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ ద్వారా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా సూర్య పాత్రికేయులతో ముచ్చటించారు. సినిమా విశేషాలతో పాటు తనదైన తాత్విక దృక్పథాన్ని వివరించారు.
మీ గత చిత్రాలు రెండూ ఓటీటీలోనే విడుదల అయ్యాయి. అభిమానులు థియేటర్ అనుభూతికి దూరమయ్యారనే అసంతృప్తి ఏమైనా ఉందా?
అలాంటిదేమీ లేదు. వాస్తవానికి ఓటీటీ వేదికలు భాషా హద్దుల్ని, సాంస్కృతిక పరిధుల్ని చెరిపేశాయి. ఇటీవల నేను కోల్కతా నుంచి చెన్నై వస్తున్నప్పుడు ఫ్లైట్లో నా పక్కన కూర్చున్న వ్యక్తి..“సర్! మీరు నటించిన ‘జై భీమ్’, ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాల్ని చూశాను. ఆ రెండూ బాగా నచ్చడంతో ఆన్లైన్లో వెతికి మరీ మీ సినిమాలన్నీ చూశాను. మీ అభిమానిగా మారిపోయాను” అని చెప్పాడు. చాలా సంతోషంగా అనిపించింది. కరోనా సంక్షోభంలో ఓటీటీ వేదికలు ప్రజలకు కావాల్సినంత వినోదాన్ని పంచాయి.
డిజిటల్ వేదికల వల్ల ప్రయోజనాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా?
డిజిటల్ మాధ్యమం సినిమా వ్యాపార సమీకరణాల్ని పూర్తిగా మార్చేసింది. ఔత్సాహికులు త్వరత్వరగా అవకాశాల్ని అందిపుచ్చుకోవడానికి ఇదో మంచి మార్గంలా మారింది. గతంలో ఓ సినిమాకుదర్శకత్వం వహించాలంటే ఐదారు సంవత్సరాల పాటు వేచి చూడాల్సి వచ్చేది. ఓటీటీ పుణ్యమాని ప్రతిభ ఉంటే చాలు.. పూర్వానుభవం లేకున్నా మెగాఫోన్ పట్టుకునే చాన్స్ దొరుకుతున్నది. కంటెంట్ పరంగా కూడా కొత్తదనం కనిపిస్తున్నది. భవిష్యత్తులో సినిమా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ సమాంతరంగా ప్రయాణిస్తాయి. ఏ సినిమాను ఎక్కడ విడుదల చేయాలనే విషయంలో దర్శకనిర్మాతలు కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
మాస్ సినిమాలతో వరుస విజయాల్ని అందుకున్న మీరు ఒక్కసారిగా పంథా మార్చి ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి సినిమాలు చేయడానికి కారణం?
నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలన్న లక్ష్యంతో ఆ కథల్ని ఎంచుకున్నా. ‘ఆకాశం నీ హద్దురా’లో ఎలాంటి స్టంట్ సీక్వెన్స్ లేవు. ‘జై భీమ్’లో రొమాంటిక్ అంశాల అవసరం కనిపించలేదు. అయినా ఆ సినిమాలు గ్రామీణ ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయి. ముఖ్యంగా ‘జై భీమ్’ మారుమూల ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఆదివాసీల కష్టాల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించేలా ప్రేరణనిచ్చింది. సినిమాల ద్వారా సమాజానికి ఎంతోకొంత మేలు కలిగించవచ్చని ‘జై భీమ్’ నిరూపించింది. సినిమా అంటే ఫాంటసీ ప్రపంచం మాత్రమే కాదు.. మన జీవితాల్ని కూడా తెరపై చూసుకోవచ్చనే భరోసానిచ్చింది.
‘ఈటీ’ (ఎవరికీ తలవంచడు) చిత్రంలో ఎలాంటి అంశాల్ని చర్చించారు?
ఇది పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్. థియేటర్లో మాత్రమే చూసి ఆస్వాదించాల్సిన సినిమా. ఇందులో మహిళల సమస్యల్ని చర్చించాం. ఎవరూ మాట్లాడటానికి సాహసించని అంశాల్ని చర్చకు పెట్టాం. మహిళల పట్ల కుటుంబం, సమాజం దృష్టికోణం ఎలా ఉండాలో తెలియజెప్పాం. సమాజంలో జరుగుతున్న సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు పాండిరాజ్ ఈ కథ రాసుకున్నారు.
తమిళంలో ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా మీరు తాత్విక ధోరణిలో ప్రసంగించారు. దానికి ప్రేరణ ఏమిటి?
అది ఓ మూఢనమ్మకమైనా కావచ్చు.. సౌకర్యవంతమైన జీవిత పరిధి కావచ్చు…మనలోని అహమైనా కావచ్చు – కొత్తకు స్వాగతం పలకాలంటే, కలిసిరాని పాతకు వీడ్కోలు చెప్పాల్సిందే అనే ఫిలాసఫీని నేను బలంగా నమ్ముతాను. ఈ విషయంలో సీనియర్ నటుడు సత్యరాజ్గారి నుంచి స్ఫూర్తి పొందాను. ఒక సాధారణ నటుడి నుంచి హీరోగా..ఆపై విలన్గా..ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన నటప్రస్థానం నుంచి గొప్ప విషయాల్ని నేర్చుకోవచ్చు.
సినిమా సందేశాలతో సమాజంలో మార్పు వస్తుందా?
ఈ మధ్య నేను ఓ హిందీ సినిమా చూశాను. శుభం కార్డు పడే ముందు ఓ డైలాగ్ నా హృదయాన్ని సూటిగా తాకింది. ఆ ఒక్క సంభాషణ.. సినిమాకు ఓ అర్థాన్నిచ్చిందనే భావన కలిగింది. కథలో ఆర్ధ్రత ఉంటే ప్రేక్షకులు పాత్రలతో సహానుభూతి చెందుతారు. తప్పకుండా ఏదో ఒక విషయాన్ని తమ వెంట తీసుకెళ్తారు. సంకల్పశుద్ధి ఉంటే సినిమాల ద్వారా పరివర్తన తీసుకురావచ్చు. ప్రజల్నిగొప్ప సమాజం దిశగా నడిపించవచ్చు. నా దృష్టిలో సినిమా గొప్ప దృశ్య సాహిత్యం. పుస్తకాల మాదిరిగానే ఉద్వేగాల్ని ప్రభావితం చేస్తుంది.
‘జై భీమ్’ చిత్రం ఆస్కార్ గడప వరకూ వెళ్లింది. ఎంట్రీలో చోటు దక్కకపోవడం బాధించిందా?
అలాంటిదేమీ లేదు. ‘జై భీమ్’ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంది..అది చాలనుకుంటున్నా. ఆస్కార్ ఎంట్రీలో చోటు దక్కాలంటే చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఎన్నో నియమాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా మూడువేల చిత్రాలు పోటీపడతాయి. వాటన్నిటిని దాటుకొని ఎంట్రీలో చోటు సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. ఏది ఏమైనా ‘జై భీమ్’ ఆస్కార్ గుమ్మం ముందు నిలవడమే గొప్ప అదృష్టంగా భావిస్తున్నా.
ఈ సినిమాకు మీరు సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఎలా అనిపించింది?
తొలిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. సాధ్యమైనంత వరకు చక్కటి ఉచ్చారణతో తెలుగు మాట్లాడాలని ప్రయత్నించా. ఏ రంగంలోనైనా సరే, మార్పునకు సిద్ధంగా ఉన్నప్పుడే విజయాలు వరిస్తాయి. ఇమేజ్ గురించి ఆలోచిస్తూ ఒకే వృత్తానికి పరిమితమైతే జీవితంలో థ్రిల్ ఉండదు. ఎలాంటి ఇమేజ్ పట్టింపులు లేకుండా ‘ఆకాశం నీ హద్దురా’ ‘జై భీమ్’ వంటి సినిమాలు చేశాను. భవిష్యత్తులో కూడా నా ద్వారా కొత్త కథల్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తాను.
– కళాధర్ రావు జూలపల్లి