చెన్నైలో ట్రాన్స్జెండర్స్ కోసమే ఓ భరతనాట్య శిక్షణాలయం ప్రారంభమైంది. సుప్రసిద్ధ గురువు షణ్ముగ సుందరం అక్కడ నృత్యశాస్ర్తాన్ని బోధిస్తారు. కేరళలోని శ్రీసత్యసాయి సేవా సంస్థ, సహోదరన్ అనే ఎన్జీవో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రతి ఆదివారం దాదాపు 20 మంది ట్రాన్స్జెండర్స్ క్లాసులకు హాజరు అవుతారు. ట్రాన్స్జెండర్ దిశకు చిన్నప్పటి నుంచీ నృత్యమంటే ఇష్టం. అబ్బాయిలు డ్యాన్స్ చూడకూడదని, చేయకూడదని తల్లిదండ్రులు ఆంక్షలు విధించారు. ఒకసారి ధైర్యం చేసి స్కూల్ ఫంక్షన్లో భరతనాట్యం చేసింది. అందరూ మెచ్చుకున్నారు. కానీ, గురువు దగ్గర నేర్చుకునే అవకాశం మాత్రం ఇప్పుడే వచ్చింది. మరో ట్రాన్స్జెండర్ ఓమన కథ కూడా ఇలాంటిదే. ‘సామాజిక అడ్డుగోడల్ని దాటుకుని ట్రాన్స్జెండర్స్ నృత్యం నేర్చుకోవడం నాకెంతో సంతోషాన్ని ఇస్తున్నది’ అంటారు షణ్ముగ సుందరం. శిక్షణ తర్వాత.. వీళ్లందరితో ఒక వేదికపై బ్రహ్మాండమైన ప్రదర్శన ఇప్పిస్తానని చెబుతున్నారు ఆయన.